ఎర్రజెండాల రెపరెపలతో ఎరుపెక్కిన వెలిశాల
గాజర్ల మృతదేహాన్ని పోలీసులు కుటుంబసభ్యులకు ఇస్తారా ఇవ్వరా అన్న సందేహలు పెరిగిపోయాయి;
ఎర్రజెండాల రెపరెపలతో వెలిశాల గ్రామం ఎరుపెక్కింది. విప్లవగీతాలతో గ్రామం మొత్తం మారుమోగిపోయింది. ఇదంతా ఏమిటో అనుకుంటున్నారా. మావోయిస్టు అగ్రనేతల్లో ఒకడైన గాజర్ల రవి(Gajarla Ravi) అంత్యక్రియల సందర్భంగా వెలిశాల గ్రామంలో కనబడిన దృశ్యం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని వెలిశాల గ్రామంలో శుక్రవారం సాయంత్రం గాజర్ల రవికి అంత్యక్రియలు జరిగాయి. గాజర్ల మృతదేహాన్ని పోలీసులు కుటుంబసభ్యులకు ఇస్తారా ఇవ్వరా అన్న సందేహలు పెరిగిపోయాయి. బుధవారం ఉదయం రంపచోడవరం అడవుల్లో గ్రేహౌండ్స్ ఎన్ కౌంటర్లో(Grey Hounds) రవితో పాటు సహచర మావోయిస్టు(Maoists Encounter)లు అరుణ, ఝాన్సీ కూడా మరణించిన విషయం తెలిసిందే. బుధవారం సాయంత్రానికే మూడు మృతదేహాలను పోలీసులు రంపచోడవరం ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే కుటుంబసభ్యుల్లో ఎవరినీ మృతదేహాలను చూడనీయలేదు.
గురువారం పోస్టుమార్టమ్ అయిపోయినా మృతదేహాలను చూడటానికి కూడా కుటుంబసభ్యులకు పోలీసులు అవకాశం ఇవ్వలేదు. ఈనేపధ్యంలోనే మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగిస్తారా ? లేకపోతే నంబాల కేశవరావు మృతదేహాన్ని పోలీసులే ఖననం చేసినట్లే ఇపుడు కూడా అదే జరుగుతుందా అనే అనుమానాలు పెరిగిపోయాయి. అందుకనే రాజకీయ పార్టీల నేతలు, హక్కుల సంఘాల నేతల ద్వారా పోలీసులపై కుటుంబసభ్యులు బాగా ఒత్తిడిపెంచేశారు. సరే, కారణాలు ఏవైనా శుక్రవారం మధ్యాహ్నం మృతదేహాలను పోలీసులు కుటుంబసభ్యులకు అందచేశారు. దాంతో గాజర్ల డెడ్ బాడీని కుటుంబసభ్యులు వెలిశాలకు తీసుకొచ్చారు.
గాజర్ల మృతదేహాన్ని గ్రామానికి తీసుకొస్తున్న విషయం తెలియగానే చుట్టుపక్కల గ్రామాల జనాలు చివరిచూపుగా వెలిశాలకు తండోపతండాలుగ చేరుకున్నారు. వెలిశాల గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గాజర్ల రవి అంత్యక్రియల సందర్భంగా విప్లవగీతాలు పాడారు. మృతదేహం గ్రామానికి రాకముందే గ్రామంలో ఎర్రజెండాలు ఎగరేశారు. ఇళ్ళపైన కూడా ఎర్రజెండాలు రెపరెపలాడాయి. గాజర్ల మృతదేహాన్ని గ్రామంలో ఊరేగించారు. రవి అంత్యక్రియల్లో కాంగ్రెస్ ఎంఎల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar mallanna), భూపాలపల్లి ఎంఎల్ఏ గండ్ర సత్యనారాయణరావు, శాసనమండలిలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత సిరికొండ మదుసూధనాచారి, తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య, జనశక్తి నేత అమర్, అరుణోదయ సంఘం నేత విమలక్క, విప్లవరచయితలు, పౌరహక్కుల సంఘాల నేతలు, బంధు, మిత్రులు, కళాకారుల తాకిడితో వెలిశాల ఉక్కిరిబిక్కిరైపోయింది.