మూసీ వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్
ఎంజీబిఎస్ కు వచ్చే ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
మూసీ ఉగ్రరూపం దాల్చింది. మూసీ పరివాహక ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.హైడ్రా కమిషనర్ రంగనాథ్ మూసీ పరివాహకప్రాంతాల్లో శనివారం పర్యటించారు. మూసీ వరద తాకిడికి గురైన ఎంజీబిఎస్ చేరుకుని ప్రయాణికులు ఇబ్బంది పడకుండా రంగనాథ్ తగు సూచన చేశారు. ఎంజీబీఎస్ కు ఎవరూ రావద్దని, ఎంజీబీఎస్ కు వచ్చే బస్సులను సమీప బస్టాండ్లలో హాల్ట్ అయ్యే విధంగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో వరద తాకిడి ఎక్కువ కావడంతో ముంపు ప్రాంతాల్లో రంగనాథ్ పర్యటించారు. . ఎంబీజీఎస్ నుంచి బయలుదేరే బస్సులను హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసి నడుపుతోంది ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపునకు వెళ్లే సర్వీసులు జేబీఎస్లో ఆగుతాయి.వరంగల్, హనుమకొండ వైపునకు వెళ్లేవి ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి బయలు దేరుతాయి. సూర్యాపేట, నల్లగొండ, విజయవాడ వైపునకు బస్సులు ఎల్బీనగర్ చౌరస్తా నుంచి నడుస్తున్నాయి. మహబూబ్నగర్, కర్నూలు, బెంగళూరు వైపునకు వెళ్లే సర్వీసులు ఆరాంఘర్ నుంచి నడుస్తున్నాయి. ప్రయాణికులకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. రెవిన్యూ, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సహాయకచర్యలు చేపడుతున్నాయి.
అనుకోకుండా ఎంజీబీఎస్కు ఎవరైనా ప్రయాణికులు వచ్చినా వారిని తరలించే ఏర్పాట్లు చేశారు. లోకల్ బస్సులు అందుబాటులో ఉంచారు. వారిని ఆయా బోర్డింగ్ ప్రాంతాలకు లోకల్ బస్సుల్లో తరలించారు. వర్షాలు, వరదలు తగ్గే వరకు ఎంజీబీఎస్కు ఎవరూ రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఎంబీజీఎస్ నుంచి నడిచే బస్సులను ఇతర ప్రాంతాల నుంచి తిప్పుతున్నామని అధికారులు వెల్లడించారు.