‘తిట్టుకున్నా కూల్చివేతలు ఆపేది లేదు’
ఆదివారం 260 ఇళ్లు కూల్చామని వెల్లడించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.
హైడ్రా కూల్చివేతలపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీవ్రంగా ఖండించారు. తాము నాలాలు, చెరువులను కబ్జా చేసిన నిర్మించిన భవనాలనే కూల్చేశామని స్పష్టం చేశారు. చెరువులు సమాజ ఆస్తులని, వాటిని కాపాడే బాధ్యత తమదని చెప్పారు. కానీ కొందరు హైడ్రా కూల్చివేతలపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వార్తలన్నీ అవాస్తవాలని, కబ్జా చేసి నిర్మించిన భవనాలనే తాము కూల్చామని చెప్పారు. గాజులరామారంలో కూడా అడ్డగోలుగా కబ్జాలు జరిగాయని అన్నారు. అందులో ఆదివారం ఆ ప్రాంతంలో కూల్చివేతలు చేపట్టామని, ఆదివారం ఒక్కరోజే 260 ఇళ్లు కూల్చామని తెలిపారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం 640 ఇళ్లు కూల్చినట్లు తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు. ప్రభుత్వ స్థలం అని తెలియక కొంత మంది పేదలు ఇళ్ళు కొనుక్కున్నారని చెప్పారు.
లాలూచీ పడే ప్రసక్తే లేదు..
‘‘బిల్డర్స్తో లాలూచీ పడటం అనేది హైడ్రాకు తెలియదు. 12 మంది బడా బిల్డర్స్పై కేసులు బుక్ చేశాం. సోషల్ మీడియా వేదికగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వర్టెక్స్, వాసవి బిల్డర్స్తో రాజీ పడలేదు. హైడ్రా ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు 923.14 ఎకరాల భూమిని కబ్జా కోరల నుంచి కాపాడాం. ఆ స్థలం విలువ రూ.45 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్ల వరకు ఉంటుంది. దాదాపు 581 ఆక్రమణలను కూల్చేశాం. చెరువులు 50-60 ఏళ్ల నుంచి కబ్జాకు గురవుతున్నాయి. వాటని 14 నెలలుగా హైడ్రా రక్షిస్తోంది. చెరువులు, నాలాల కబ్జాపై హైడ్రాకు వస్తున్న ఫిర్యాదుల సంఖ్య భారీగా ఉంది’’ అని అన్నారు.
గాజులారామారం కూల్చివేతలపై హైడ్రా ఏమందంటే..
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని గాజులరామారంలో పెద్ద మొత్తంలో ప్రభుత్వ భూమిని కాపాడింది. సర్వే నంబరు 307తో పాటు పలు సర్వే నంబర్లలో ఉన్న 317 ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జాల చెర నుంచి విముక్తి కల్పించింది. ప్రభుత్వ భూమిలో వెలిసిన వెంచర్లను, లే ఔట్లను తొలగించింది. స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్కు ప్రభుత్వం ఇచ్చిన భూమిలో తిష్ట వేసిన కబ్జాదారుల భరతం పట్టింది. ఇదే సర్వే నంబరు చుట్టూ కబ్జాలు జరగగా.. ప్రగతినగర్ వైపు ఏకంగా లేఔట్లు, వెంచర్లు వేశారు. ఇందులో రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ యజమానులు, కొంతమంది అధికారులు ఉన్నారు. 12 ఎకరాలలో వెలిసిన వెంచర్తో పాటు.. 20 ఎకరాల మేర ఉన్న లే ఔట్ను తొలగించింది. అందులో తాత్కాలికంగా బడాబాబులు వేసిన షెడ్డులను, ప్రహరీలను కూల్చివేసింది. ప్రభుత్వ భూమిలో రహదారుల నిర్మాణం, కరెంటు కనెక్షన్లు ఇలా దర్జాగా సాగిపోయిన బడాబాబుల దందాకు హైడ్రా ఫుల్స్టాప్ పెట్టింది. ఆక్రమణలను తొలగించిన తర్వాత చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తోంది.
పేదల పేరిట కబ్జాలు మరోవైపు..
ప్రగతినగర్వైపు బడాబాబులు ఏకంగా వెంచర్లు, లే ఔట్లు వేస్తే.. గాజులరామారం సర్వే నంబర్లు 329/1, 342 లో ఉన్న ప్రభుత్వ భూమిని 60 గజాలు, 120 గజాల ప్లాట్లచొప్పున పేదలే లక్ష్యంగా పెట్టుకుని అమ్మేసుకున్న రౌడీషీటర్లు, స్థానిక చోటమోటా నాయకులు, గుండాగిరి, దాదాగిరితో బతుకుతున్న మరికొందరికి కూడా హైడ్రా చెక్ పెట్టింది. జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్లో రౌడీషీట్ ఉన్న షేక్ అబిద్ ఏకంగా లక్ష్మి మురళి హుస్సేన్ పేరుమీద ప్లాట్ల విక్రయాలు జరిపారు. బోడాసు శ్రీనివాస్(డాన్ సీను), ఏసుబాబు, సయ్యద్ గౌస్ బాబు, మనీష్, దేవా ఇలా ఎవరికి వారు ఆక్రమించేసి ప్లాట్లుగా అమ్మేసుకున్న వారికి హైడ్రా ఆదివారం చెక్ పెట్టింది. స్థానిక రెవెన్యూ అధికారులు కూడా వీరికి సహకరించినట్టు సమాచారం. దీనిపై పూర్తి స్థాయిలో హైడ్రా విచారణ చేపట్టింది. 60, 120 గజాల చొప్పున ప్రహరీ నిర్మించి.. అందులో ఒక గదిని కట్టి.. కిరాయి లేకుండా ఒక కుటుంబానికి అద్దెకు ఇవ్వడం.. కొనుగోలుదారుడు దొరికిన తర్వాత ఆ ప్లాట్ను అమ్మేయడం.. తర్వాత మరో ప్లాట్ ఇలా సాగిపోయిన కబ్జాలకు హైడ్రా చెక్పెట్టి... ఆక్రమణల దందాకు బ్రేకులు వేసింది.
పేదల ఇళ్ల జోలికి వెళ్ల లేదు..
ఇప్పటికే నివాసం ఉంటున్న వారి ఇళ్ల జోలికి హైడ్రా వెళ్లలేదని మరోసారి స్పష్టంచేసింది. రౌడీల ఆధీనంలో ఉండి అమ్మకానికి సిద్ధంగా ప్రహరీలు నిర్మించి ఉన్న వాటిని మాత్రమే హైడ్రా తొలగించింది. అక్కడ నివాసం ఉంటున్న పేదల ఇంటింటికీ వెళ్లిన హైడ్రా అధికారులు పదేపదే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. మొదట్లో అక్కడ నివాసం ఉంటున్నవారు ఆందోళన చెందినా.. వారికి స్పష్టమైన హామీ లభించడంతో ఊరట చెందారు. హైడ్రా, జీహెచ్ ఎంసీ, రెవెన్యూ, పోలీసు అధికారులు పలుమార్లు ఈ విషయాన్ని స్పష్టం చేయడంతో పాటు.. అక్కడ కూల్చివేతలను గమనించిన స్థానికులు ఆందోళన చెందలేదు. ఎవరైతే అక్కడ బోర్డులు పెట్టి ప్లాట్ల విక్రయాలకు పాల్పడుతున్నారో వారే ఆందోళనకు దిగారు. నవాసితులుగా చూపించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ఎత్తుగడలన్నిటినీ చిత్తు చేస్తూ ఆక్రమణలను హైడ్రా తొలగించింది. చుట్టూ ఫెన్సింగ్ వేసే పనిని వేగవంతం చేసింది.
పూర్తి స్థాయిలో పరిశీలించాకే చర్యలు..
గాజుల రామారంలోని సర్వేనంబరు 307 తో పాటు.. ఆ పక్కనే ఉన్న సర్వే నంబర్లలో 444 ఎకరాలకు పైగా ప్రభుత్వభూమి ఉంది. ఇందులో సర్వే నంబరు 307లోనే 317 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ కార్పొరేషన్కు అప్పటి ప్రభుత్వం ఈ భూమిని అప్పగించింది. ఆ తర్వాత రాష్ట్రం విడిపోవడం.. ఫైనాన్స్ కార్పొరేషన్కు చెందిన ఆస్తుల పంపకాల్లో జరిగిన జాప్యాన్ని ఆసరాగా తీసుకుని ఎవరికి వారు ఆక్రమణలకు పాల్పడ్డారు. ఈ విషయమై హైడ్రాకు స్థానికుల నుంచి పెద్ద మొత్తంలో ప్రజావాణిలో ఫిర్యాదులందాయి. ఆ ఫిర్యాదుల మేరకు సర్వే నంబర్ల వారీ.. విచారణను హైడ్రా చేపట్టింది. రెవెన్యూ అధికారులు, జీహెచ్ ఎంసీ, ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులతో 5 - 6 సార్లు సమావేశం ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో విచారణ జరిపింది. 6 నెలలుకు పైగా పూర్తి స్థాయిలో విచారించి చర్యలు తీసుకుంది.