సఖ్యత దారి పట్టిన రాజాసింగ్.. కారణం అదేనా..
వ్యక్తిగతంగా కలిసి కొన్ని సమస్యలు చెప్పాలనుకుంటున్నా.;
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు, బీజేపీ పెద్దలకు కొంతకాలంగా గిట్టడం లేదు. ఏదో విషయంలో పార్టీపై రాజాసింగ్ కోపంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఏమైందో ఏమో కానీ తాజాగా ఆయన నుంచి సఖ్యత స్వరం వినిపిస్తోంది. ఇప్పటి వరకు పార్టీ నుంచి పాత సామాను బయటపడేయాలని, కొందరు నేతలు అధికారంలో ఉన్న వారితో కుమ్మక్కు కావడం వల్లే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటిది తాజాగా ఆయన స్వరం ఒక్కసారిగా మారడం కీలకంగా మారింది. కిషన్ రెడ్డి తమకు కాస్తంత సమయం కేటాయించాలని కోరారు రాజాసింగ్. ఆయన ఒక్కసారిగా కాస్తంత సమయం ఇవ్వండి అంటూ రజాసింగ్ను కోరడం కీలకంగా మారింది. ఇటీవల పార్టీ హైకమాండ్ తనకు నోటీసులు ఇవ్వనుందన్న ఆరోపణలపై స్పందించిన రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నోటీసులు ఇవ్వడం కాదని, సస్పెండ్ చేయాలని అన్నారు. అదే జరిగితే అందరి జాతకాలు బయటపెడతానని అన్నారు. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా రాజీ స్వరం వినిపించడం ఆసక్తికరంగా మారింది. దాంతో పాటుగానే వ్యక్తిగత విబేధాలను పక్కనబెట్టి కలిసి కట్టుగా ఐక్యంతో పనిచేద్దామని అన్నారు.
‘వ్యక్తిగతంలో సమస్యలు చెప్పుకోవాలి’
‘‘కిషన్ రెడ్డి.. మాకు కొంచెం సమయం కేటాయించాలి. వ్యక్తిగతంగా కలిసి కొన్ని సమస్యలు చెప్పాలనుకుంటున్నా. ఎక్కడ, ఎప్పుడు అనేది నిర్ణయిస్తే అప్పుడు అక్కడకు వచ్చి కలిసేందుకు సిద్ధంగా ఉన్నాను. రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం అవసరం. వ్యక్తిగత విబేధాలను పక్కనబెట్టి ఐక్యంగా పనిచేద్దాం’’ అని రాజాసింగ్ పేర్కొన్నారు.
అధిష్టానం కన్నెర్ర చేసిందా..
రెబల్ నేతగా పేరొందిన రాజా సింగ్ నోటి నుంచి సఖ్యత మాటలు రావడంతో అంతా అవాక్కయ్యారు. మొన్న నోటీసుల వ్యవహారంపై ఆయన చేసిన వ్యాఖ్యలతో పార్టీ అధిష్టానం కన్నెర్ర చేసిందని, ఆయనను తీవ్రంగా మందటించిందని కొందరు విశ్లేషకులు అంటున్నారు. తనకు ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి, రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి తీసుకురావాలే తప్పా ఇలా పబ్లిక్గా ఛాలెంజ్, వార్నింగ్లు ఇవ్వడం సరికాదని పార్టీ అధిష్టానం తెలిపినట్లు సమాచారం. అందువల్లే రాజాసింగ్ తన రూట్ మార్చి సంప్రదింపుల బాట పట్టారని తెలుస్తోంది. మరి రాజాసింగ్ అడిగిన సమయాన్ని కిషన్ రెడ్డి ఇస్తారా లేదా అనేది చూడాలి.