క్వశ్చన్ పేపర్ కేసీఆర్ కు లీకైందా ?

మొత్తంమీద ఉన్నతాధికారులు, ఇంజనీర్లదే బాధ్యతని, తనకు ఎలాంటి సంబంధంలేదని చెప్పి చేతులు దులిపేసుకున్నారు;

Update: 2025-06-10 08:57 GMT
KCR and Justice PC Ghosh

పరీక్షల్లో కొందరు విద్యార్ధులకు క్వశ్చన్ పేపర్ ముందే లీకైతే వచ్చే లాభాలు ఏమిటో చాలామందికి తెలిసిందే. ఇపుడు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, అవకతవకలపై రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కూడా అలాగే తయారయ్యేట్లుంది. విషయం ఏమిటంటే ఈనెల 11వ తేదీన అంటే బుధవారం కమిషన్ ముందు కేసీఆర్(KCR) విచారణకు హాజరవుతున్నారు. రెండురోజుల క్రితం 9వ తేదీన కమిషన్ ముందు హరీష్ రావు(Harish) విచారణకు హాజరయ్యారు. విచారణలో కమిషన్ హరీష్ ను అనేక ప్రశ్నలడిగింది. కమిషన్ ప్రశ్నలకు హరీష్ సమాధానాలు చెప్పినపుడు సాంకేతిక లోపాలకు ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ నిపుణులదే బాధ్యతని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవినీతి, అవకతవకలు జరగలేదన్నారు.

కమిషన్ విచారణలో హరీష్ చెప్పింది ఏమిటంటే హోలు మొత్తంమీద ఉన్నతాధికారులు, ఇంజనీర్లదే బాధ్యతని, తనకు ఎలాంటి సంబంధంలేదని చెప్పి చేతులు దులిపేసుకున్నారు. ఈ నేపధ్యంలో 11వ తేదీన కేసీఆర్ కమిషన్ ముందు హాజరైనపుడు ఏమి జరుగుతుంది అనే చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా పనిచేస్తే హరీష్ ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు. పీసీ ఘోష్ కమిషన్ విచారణ సందర్భంగా కేసీఆర్, హరీష్ ను అడిగే ప్రశ్నలు దాదాపు ఒకేలాగుంటాయనటంలో సందేహంలేదు. ప్రశ్నలు ఒకేలాగున్నపుడు మరి సమాధానాలు మాత్రం భిన్నంగా ఎందుకుంటాయి. కమిషన్ ప్రశ్నలకు హరీష్ చెప్పిన సమాధానాలనే కేసీఆర్ కూడా చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఈనేపధ్యంలోనే కమిషన్ వేయబోయే ప్రశ్నలు కేసీఆర్ కు ముందుగానే లీకైనట్లు అనుకోవాలి. అసలు ప్రశ్నలను ముందుగా తెలుసుకునే ఆలోచనతోనే 6వ తేదీన కమిషన్ ముందు హాజరవ్వాల్సిన కేసీఆర్ విచారణ తేదీని 11వ తేదీకి మార్చుకున్నట్లున్నారు. కమిషన్ నోటీసుల ప్రకారమైతే 6వ తేదీన విచారణకు కేసీఆర్ హాజరవ్వాల్సుండగా 9వ తేదీన హరీష్ హాజరవ్వాలి. చివరి నిముషంలో తన విచారణ తేదీని 11వ తేదీకి మార్చాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని కమిషన్ ఆమోదించింది. తాజా డెవప్మెంట్ల ప్రకారం 9వ తేదీన హరీష్ కు కమిషన్ ఏవైతే ప్రశ్నలు సంధించిందో దాదాపు అవే ప్రశ్నలను కేసీఆర్ ను కూడా అడగబోతోంది. అంటే తనను కమిషన్ అడగబోయే ప్రశ్నలు ఏమిటన్నది కేసీఆర్ కు ముందే తెలిసిపోయాయి. కమిషన్ విచారణ పూర్తి కాగానే హరీష్ నేరుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోని కేసీఆర్ ను కలిశారు.

దాదాపు ఐదుగంటల భేటీలో కమిషన్ తనను అడిగిన ప్రశ్నలు ఏమిటి ? 11వ తేదీన అడగబోయే ప్రశ్నలు ఎలాగుండబోతున్నాయనే విషయాలను హరీష్ వివరించారు. కమిషన్ అడగబోయే ప్రశ్నలకు తాను ఎలాంటి సమాధానలు చెప్పాలనే విషయంలో కేసీఆర్ ప్రిపేర్ అవుతున్నారు. అంతకుముందు 7వ తేదీన మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Eatala Rajendar) ను కూడా కమిషన్ ప్రశ్నించింది. బీఆర్ఎస్ హయాంలో ఈటల ఆర్ధికశాఖ మంత్రిగా పనిచేశారు కాబట్టే కమిషన్ విచారణకు పిలిచింది. విచారణలో ఈటలను కమిషన్ ఎలాంటి ప్రశ్నలు వేశారన్న విషయం హరీష్ కు తెలిసింది. దాదాపు అలాంటి ప్రశ్నలను కమిషన్ తర్వాత హరీష్ కు సంధించింది. కాబట్టి 9వ తేదీన హరీష్ ను అడిగిన ప్రశ్నలే 11వ తేదీన కేసీఆర్ ను అడిగే అవకాశాలున్నాయి. ప్రశ్నలు ఏమిటో తెలిసిపోతే సమాధానాలు ప్రిపేర్ అవటంలో కష్టమేముంటుంది ? సాంకేతికంగా జరిగిన తప్పులు, అవకతవకలు అన్నింటినీ ఉన్నతాధికారులు, ఇంజనీర్ల మీదకు తోసేసి చేతులు దులిపేసుకోవటమే కదా పాలకులు చేసేపని ?

Tags:    

Similar News