'ఓట్ల చాణక్యుడు'
ప్రశాంత్ కిశోర్ గురించి సొంత వూర్లో టాక్ ఏమిటి?
ఓట్ల చాణక్యుడు, 'జన్ సూరజ్' పార్టీ స్థాపకుడు ప్రశాంత్ కిషోర్ పేరు బిహార్ రాజకీయాల్లో మారు మోగుతోంది. తెలుగు రాజకీయాలతోనూ ప్రశాంత్ కిషోర్కు బలమైన బంధం వుంది. 2019 ఎన్నికలకు ముందు వైసీపీకి వ్యూహకర్తగా, జగన్ గెలుపునకు భారీగా వ్యూహాలు పన్నారు. అవి సక్సెస్ అయ్యాయి. ఆ ఎన్నికల్లో జగన్ గెలిచిన తర్వాత.. ప్రశాంత్ కిషోర్ తో విభేదాలు ఏర్పడ్డాయి. 2024 ఎన్నికలప్పుడు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో సన్నిహితంగా వుంటూ జగన్ కు దారుణ పరాజయం తప్పదని హెచ్చరించారు. ప్రశాంత్ కిషోర్ జోష్యం ఫలించింది.
ఆయన ఏ పార్టీతో అయితే పని చేస్తారో.. అదే పార్టీ అధినేతతో విభేదాలు పెంచుకుంటారు. ప్రధాని మోదీతో పనిచేసిన ఆయన.. అదే మోదీని వ్యతిరేకించారు. కాంగ్రెస్ కు దగ్గర అవుతూనే.. అదే పార్టీ విధానాలను ఎండగట్టారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయు పార్టీలో చేరారు ప్రశాంత్ కిషోర్. కానీ ఆ పార్టీలో ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. 2020లో బహిష్కరణకు గురయ్యారు. ఆ తరువాత జన సూరజ్ అనే సంస్థను స్థాపించి పార్టీగా మార్చారు.
2025 అసెంబ్లీ ఎన్నికల్లో 243 స్థానాల్లోనూ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. తన పార్టీ గెలిస్తే బీహార్ దశ-దిశ మార్చివేస్తానని హామీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ బీహార్ విజన్ పట్ల, ఆయన స్వగ్రామం ప్రజలు ఆయన గురించి, ఆయన ఆహామీల గురించి ఏం అనుకుంటున్నారో తెలుసుకోవడానికి ది ఫెడరల్ టీం కోనార్ గ్రామాన్ని సందర్శించింది. ఈ గ్రామం బీహార్లోని కార్గహర్ నియోజకవర్గంలో వుంది.
శిథిలావస్థలో ఉన్న ఓ పెద్ద ఇల్లు, కేదార్ పాండే అనే కేర్ టేకర్ అక్కడ కనిపించారు. ప్రశాంత్ కిషోర్ మూలాలు, అతను పెరిగిన ప్రదేశం అది. అతని తల్లిదండ్రులు డాక్టర్ శ్రీకాంత్ పాండే, సుశీల పాండే లేరు కానీ, వారి బంధువులు అక్కడ నివాసమున్నారు.
ది ఫెడరల్ టీం ఊరంతా తిరిగింది. ప్రశాంత్ కిషోర్ గురించి స్థానికులతో మాట్లాడితే వాళ్ళెవరూ తమకు ఆయన గురించి తెలియదని చెప్పారు. స్వంత ఊరినే మార్చలేని వాడు బీహార్ రాష్ట్రాన్ని ఎలా మార్చుస్తాడంటూ కొంత మంది అసహనం వ్యక్తం చేశారు. ప్రశాంత్ కిషోర్ బీహార్ రాజకీయాలను మార్చాలనుకుంటున్నారు. కానీ తన స్వంత గ్రామాన్నే మార్చలేదు. చాలా మందికి ప్రశాంత్ కిషోర్ గురించి తెలియదు. ఎందుకంటే అతను చాలా సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని సందర్శించలేదు.
'జన్ సురాజ్' పార్టీ ఐదు పెద్ద వాగ్దానాల జాబితా పట్ల స్థానికులు నిరాశను వ్యక్తం చేశారు. ప్రశాంత్ కిషోర్ చెప్పే మాటలకు, చేతలకు పొంతనే లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపై ప్రేమ చూపుతున్నారు. కానీ వాళ్ళ భూములపై కబ్జాను ఎందుకు వదులుకోవడం లేదని కోనార్ గ్రామస్థులు తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. భూ కబ్జాల్లో వాళ్ళ కుటుంబం పలు ఆరోపణలు ఎదుర్కొంటోంది. కబ్జాల విషయం గురించి గ్రామంలోని ఆయన బంధువులతో మాట్లాడినప్పుడు ఆ ఆరోపణల్లో వాస్తవం లేదు. అవి కేవలం అవి రాజకీయ ఆరోపణల్ని వాళ్ళు వ్యాఖ్యానించారు.