‘కాళేశ్వరం ప్రాజెక్ట్పై అందరిదీ ఒకే మాట..’
రూ. 8వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో రూ.1.20లక్షల కోట్లకు పెంచలేదా?;
కాళేశ్వరం ప్రాజెక్ట్లో అవకతవకలు జరిగాయన్న అంశంపై తమది, తమ పార్టీది ఒకే అభిప్రాయం, మాట అని ఘోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో అవినీతి జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. దానికి సంబంధించిన అన్ని విషయాలను ఆధారాలతో సహా కేంద్రమంత్రి బండిసంజయ్ బట్టబయలు చేయడంతో బీఆర్ఎస్ నేతలు బెంబేలెత్తిపోయారని చురకలంటించారు. అందుకే బండి సంజయ్ వ్యాఖ్యలను వాళ్లు ఖండిస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ముమ్మాటికీ అవినీతి ప్రాజెక్టేనని ఆయన పునరుద్ఘాటించారు. ఈ విషయంలో బీజేపీ ద్వంద వైఖరి కనబరుస్తోందని, రాష్ట్ర నేతలు, పార్టీ హైకమాండ్ విభిన్న స్వరాలు వినిపిస్తుందన్న వాదనలకు ఆయన ఫుల్ స్టాప్ పెట్టారు.
‘‘కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాది.. మా పార్టీది ఒకే అభిప్రాయం. ఈ ప్రాజెక్టుపై ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా చెప్పిన మాటలకే మేమూ కట్టుబడి ఉంటాం. బీఆర్ఎస్ నేతల వైఖరి చూస్తుంటే ‘ఉల్టా చోర్ కొత్వాల్ డాంటే’ అన్నట్లుగా ఉంది. ప్రధాని మోదీ చెప్పినట్లు బీఆర్ఎస్.. కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంది. ఇది వాస్తవం కాదా? రూ. 8వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో రూ.1.20లక్షల కోట్లకు పెంచలేదా?ఆనాడు కేసీఆర్ స్వయం ప్రకటిత ఇంజినీరు అవతారం ఎత్తి కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారు. ఈనాడు ఆయన కుమారుడు ఎన్డీఎస్ఏ కంటే తానే తెలివైన మేధావిగా ప్రవర్తిస్తున్నారు’’అని రాజాసింగ్ చురకలంటించారు.