‘కాంగ్రెస్ నిర్ణయం వల్ల పిల్లలే టాయిలెట్లు కడగాల్సిన దుస్థితి’
వివక్షల నుండి తప్పించడానికే కదా ఈ పిల్లలకు సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఏర్పాటు చేయించి చదివించేది.;
తెలంగాణలోని గురుకుల పాఠశాలల పరిస్థితులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్కు పాలన చేతకాదని చెప్పడానికి గురుకులాల విషయంలో వాళ్లు తీసుకున్న ఒక్క నిర్ణయం చాలని వ్యాఖ్యానించారు. వాళ్ల తెలివితక్కువ తనం వల్ల పిల్లలే టాయిలెట్లు కడగాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో గురుకులాలు స్ఫూర్తిగా నిలిచాయని, కానీ ఇప్పుడు వాటి పరిస్థితి అద్శానంగా తయారైందంటూ మండిపడ్డారు కవిత. స్వీపర్లు, శానిటేషన్ వర్కర్ల తొలగింపుపై కవిత ధ్వజమెత్తారు. అసలు ఏం ఆలోచించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని నిలదీశారు.
‘‘స్వీపింగ్, శానిటేషన్ కోసం ఒక్కో గురుకుల పాఠశాలకు ప్రతి నెల బీఆర్ఎస్ ప్రభుత్వం రూ 40 వేలు కేటాయింపు. ఆ నిధులతో ఒక్కో పాఠశాలలో నలుగురు తాత్కాలిక ఉద్యోగులు టాయిలెట్లు, తరగతి గదులు శుభ్రం చేసేవారు. ఈ నెల నుండి ఈ పద్ధతి కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించింది. దాంతో పిల్లలే టాయిలెట్లు, గదులు మాత్రమే కాకుండా పాఠశాల హాస్టల్ ఆవరణలోని పనులు అన్ని కూడా విద్యార్థులే రెగ్యులర్ గా చేసుకోవాలని చెప్పారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు గురుకుల పాఠశాల లోని వాచ్ మెన్ వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ప్రమాదవశాత్తు మరణించగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. రాష్ట్రంలోని 240 గురుకుల విద్యా సంస్థలలో అసిస్టెంట్ కేర్ టేకర్ లను తొలగించి వారు చేసే వార్డెన్ పనులను పిల్లలతో చేయించాలని చెప్తున్నారు’’ అని గుర్తు చేశారు.
‘‘ఇప్పటివరకు వార్డెన్లే అన్ని రకాల నిర్వహణలు చూసుకున్నా పిల్లలు కమిటీగా ఏర్పడి క్వాలిటీ చెక్ చేసుకునేవారు. కానీ ఇకపై పిల్లలే వంటశాల నిర్వహణ, మెస్ పనులు కూడా చేయవలసి వస్తుంది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ నేర్పడం వేరు, విద్యార్థులతో వెట్టిచాకిరి చేయించడం వేరు. అసలు మొత్తంగా శానిటేషన్ వర్కర్స్ ను తొలగించి ఆ పనులు పిల్లలతో రెగ్యులర్ గా చేయించడం నేరం. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో చదివే పిల్లలు ఏమైనా పోష్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చారా? వెళ్లి కూర్చోగానే టేబుల్ పైకి ఫుడ్ రాదు అనడం.. ఎందుకు ఇలాంటి పనులు చేయరు చేయాల్సిందే అని ఒక ఐఏఎస్ అనడం దుర్మార్గం’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘ఈ వివక్షల నుండి తప్పించడానికే కదా ఈ పిల్లలకు సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఏర్పాటు చేయించి చదివించేది. ఇది డిగ్నిటీ ఆఫ్ లేబర్ నేర్పడం కాదు. కుల వివక్ష, శ్రమ దోపిడీ మాత్రమే. గతంలో లాగానే పిల్లలు క్వాలిటీ మాత్రమే తనిఖి చేసుకునే ఏర్పాటు ఉండాలి. అంతే కానీ పిల్లలతో పూర్తిస్థాయి వార్డెన్, శానిటేషన్ వర్కర్స్ చేయించే పని చేయించడం సరికాదు. రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ గురుకులాలలో కలిపి 1200 మంది ఉద్యోగులను తొలగించడం అన్యాయం. ఒకవైపు ఉద్యోగాలు కల్పిస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పడం మరోవైపు అత్యవసరమైన చోట వారిని తొలగించి ఆ పని భారం విద్యార్థుల మీద ఉంచడం తప్పు’’ అని అన్నారు.
‘‘పోష్ పిల్లలు కాకపోయినా అందరూ పిల్లలు సమాజం దృష్టిలో ప్రభుత్వం దృష్టిలో సమానమే అన్న సంకేతాలను పంపాల్సిన గురుకుల పాఠశాలలు వివక్ష కేంద్రాలుగా మారకూడదు. ఎస్సీ వర్గాల పిల్లలు ప్రధానంగా చదివే గురుకుల పాఠశాలలో ఈ నిర్ణయం మానవతావాదులు ముక్తకంఠంతో ఖండించవలసింది. కాంగ్రెస్ ప్రభుత్వ పేదల వ్యతిరేక ఆలోచన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. తక్షణమే ఆ అధికారిని తప్పించాలి, నెలకు మెయింటెనెన్సు డబ్బులు పాఠశాలలకు ఇవ్వాలి. పిల్లలతో పనిచేయించటం ఆపివేయాలి’’ అని కోరారు.