తెలంగాణలొ తొలిసారి... అవినీతి తిమింగలం ఆస్తుల జప్తు
కాళేశ్వరం అవినీతికేసులో నాటి ఇంజనీర్ బి హరిరామ్ ఆస్తుల జప్తు
కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ కు ఎండీగా పనిచేసిన బి. హరిరామ్ అనే సీనియర్ ఇంజనీర్ ఆస్తులను జప్తు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు తీసుకుంది. సోమవారం నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా నోటిఫికేషన్ జారీ చేశారు.ఈయన పూర్తి భూక్యా హరిరామ్.
ఇరిగేషన్ శాఖలో ఇంజనీర్ ఇన్ చీఫ్ (ENC)గా పనిచేశారు. లెక్కకు మించి ఆస్తులున్నాయనే అరోపణలతో ఆయన ఆస్తుల మీద అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈ ఏడాది ఏప్రిల్ లో దాడులు జరిపి ప్రపంచం విస్మయం చెందేంత ఆస్తులను కనుగొన్నారు. కాళేశ్వరంలో నిర్మాణంలో హరిరామ్ కీలక పాత్రపోషించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బాగా అవినీతి జరిగిందని ఒక వైపు ఆరోపణలు, మరొక వైపు జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్డీఎ్సఏ)ప్రాజెక్టు అభద్రత మీదఇచ్చిన నివేదిక అందడంతో ప్రభుత్వం ఈ దాడులు జరిపింది.
ఇళ్లు సహా 14 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఆయన ఆస్తులు రెండు తెలుగు రాష్ట్రాలకు విస్తరించిఉన్నట్లు బయటపడింది. ఆస్తుల్లోఇళ్లు,ఫామ్ హౌస్ లు, విల్లాలు, వ్యవసాయం భూములు పిచ్చిపిచ్చిగా కనుగొన్నారు. ఖరైదన కార్లు, దండిగా బంగారు, బ్యాంకు డిపాజిట్లు కనిపించాయి. హరిరామ్కు మర్కూక్ మండలంలోనే 28 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కమర్సియల్ ప్లాట్స్ ఉన్నాయి. హైదరాబాద్లోని షేక్పేట్, కొండాపూర్లో విల్లాలు ఉన్నాయి. మాదాపూర్, శ్రీనగర్కాలనీ, నార్సింగ్లో ఫ్లాట్లు ఉన్నాయి. పటాన్చెరులో 20 గుంటల భూమి ఉంది. శ్రీనగర్ కాలనీలో రెండు ఇండిపెండెంట్ ఇళ్లు కూడా ఉన్నాయి. బొమ్మలరామారంలో ఆరు ఎకరాలలో ఫామ్హౌస్ ఉంది. మామిడి తోట, కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న భవనం, కుత్బుల్లాపూర్, మిర్యాలగూడలో ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఇక, బీఎండబ్ల్యూ సహా రెండు కార్లు, ఉన్నాయి. ఇవే కాక, బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లను కూడా గుర్తించారు.
దీనిని పర్యవసానమే నేటి జప్తు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలో28 ఎకరాల వ్యవసాయ భూమితోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో హరిరామ్కు ఉన్న ఆస్తుల క్రయవిక్రయాల మీద నిషేధం విధించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హరిరామ్ను అరెస్ట్ చేయడంతో ఆస్తుల జప్తు కోసం కోర్టులో ఏసీబీ కేసు వేసింది. దీనికి కోర్టు అనుమతి ఇచ్చింది. దీనితో నీటిపారుదలశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మరొక
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఏఈఈ) నికేశ్కుమార్ ఆస్తులను కూడా జప్తు చేశారు. ఎసిబి రికార్డుల ప్రకారం ఆస్తుల విలువ రూ.17.73 కోట్లు. బహిరంగ మార్కెట్లో అది రూ.100 కోట్లపైనే ఉంటుంది.ఈయన మరొక ఇంజనీర్ కు బినామీ అని అనుమానం.