కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అవినీతి.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఎంపీ ఈటెల ఆధ్వర్యంలో వికసిత భారత్ సంకల్ప సభ;
By : V V S Krishna Kumar
Update: 2025-06-22 11:45 GMT
కాంగ్రెస్ పాలన అంటేనే అవినీతిమయమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.కేంద్రంలో యూపీఏ హయాంలో అన్నీ అవినీతి వార్తలే ప్రధానంగా వచ్చేవి అన్నారు.ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని దేశంలో సమర్థవంతమైన పాలన కొనసాగుతోందన్నారు.
యూపీఏ హయాంలో రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం ఉండేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆక్షేపించారు.సికింద్రాబాద్లో ఎంపీ ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వికసిత భారత్ సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు.ప్రజల ఆకాంక్షలు, ఆశలకు అనుగుణంగా బీజేపీ పాలన సాగుతోందని తెలిపారు.మోదీ నేతృత్వంలో అద్భుత, సమర్థవంతమైన పరిపాలన అందిస్తున్నామన్నారు.గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పాకిస్థాన్ ఆడిందే ఆటపాడిందే పాటగా ఉండేదని, దేశంలోని పలు ప్రాంతాలను ఉగ్రవాదులు నాశనం చేశారన్నారు. హైదరాబాద్లోనూ ఉగ్రవాదులు బాంబులు పేల్చిన సంఘటనలను మర్చిపోలేమని ,ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినా ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉండేదని తెలిపారు. ప్రస్తుతం ప్రధాని మోదీ నేతృత్వంలో పాక్ దాడులకు గట్టిగా జవాబిచ్చి ప్రపంచ దేశాలు నివ్వెరపోయేలా చేస్తున్నామని ,ప్రజలు గమనిస్తున్నారన్నారు.వికసిత్ భారత్ లక్ష్యంగా అందరూ కలిసి రావాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
రాజకీయాలే ఎజెండాగా బతికే చిల్లరగాళ్లు రెచ్చగొడతారుః ఈటెల
రాజకీయాలే ఎజెండాగా బతికే కొందరు చిల్లరగాళ్లు రెచ్చగొడుతుంటారని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.పదవులు శాశ్వితం కావని ,మానవ సంబంధాలు తనకు ముఖ్యమని ఈటెల అన్నారు. ఎందరో త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాకట్టు పెడుతున్నారని ఆయన విమర్శించారు. బీజేపీలో చేరక ముందే తాను ప్రధాని మోదీని రెండు సార్లు కలిశానని , ఆయన గొప్పగా భవిష్యత్ ను ఆలోచించే వ్యక్తన్నారు.
వికసిత భారత్ సంకల్ప సభలో ప్రధాని మోదీ పాలనను కొనియాడారు.తాను ఆరోగ్యమంత్రిగా వున్నప్పుడు దీనపరిస్థితి నెలకొని ఉందని, కరోనా వల్ల ప్రపంచమంతా విలవిల్లాడిపోయిందన్నారు. ఆ విషమ పరిస్థితులలో ప్రధానిగా మోదీ తీసుకున్న చర్యలు ప్రపంచాలకే ఆదర్శంగా మారాయని తెలిపారు. అమెరికా వంటి దేశాలు కూడా విలవిలలాడిపోతే , విదేశాలకు కూడా వ్యాక్సిన్లు ఇచ్చి భారత్ ఆదుకుందన్నారు.. మన దేశమేధోశక్తి విదేశాలకు వలస పోవద్దని భావించి మోదీ మేకిన్ ఇండియా అమలు చేశారని ఈటెల తెలిపారు. ప్రాజెక్టులకు,అభివృద్దికి తాను వ్యతిరేకం కాదని రాష్ట్రాలలో ఏ ప్రభుత్వం కేంద్రం సహకరిస్తుందని మోదీ ఆనాడే చెప్పారన్నారు.
ఈటల నాయకత్వం రాష్ట్రానికి అవసరంఃఏలేటి మహేశ్వర్రెడ్డి
ఈటల నాయకత్వం రాష్ట్రానికి అవసరమని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి తెలిపారు.జరగబోయే ఎన్నికల్లో నేతలందరం కలిసి పనిచేసి తెలంగాణ లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.తెలంగాణకు మోదీ 11 ఏళ్లలో రూ.11లక్షల కోట్లు ఖర్చు చేశారని అన్నారు. ఈటల రాజేందర్ ప్రజల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారని చెప్పారు. ఈటల ఎంపీ అయి ఏడాది అయిన సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపారు.