‘త్యాగాల అడ్డా.. పోరాటాల గడ్డ తెలంగాణ’
సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వ పోకడలను ఎదిరిద్దామమని కేటీఆర్ పిలుపు.;
ఎందరో అమరవీరులకు తెలంగాణ పుట్టినిల్లని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ గడ్డ కోసం వేల మంది అసువులు బాసారని, వారందరి త్యాగాలను ఎన్నిటికీ మరువలేమని చెప్పారు. సెప్టెంబర్ 17 సందర్భంగా తెలంగాణ భవన్లో జాతీయ సమైక్యతా దినోత్స వేడుకలను బీఆర్ఎస్ నిర్వహించింది. ఇందులో కేటీఆర్ కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ అమరవీరులకు ఆయన నివాళులు అర్పించారు. సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న నియంతృత్వ పోకడలను ఎదిరించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ అంటేనే త్యాగాల అడ్డా.. పోరాటాల గడ్డా అని వ్యాఖ్యానించారు. ఆనాటి సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలుకొని 1969 తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత జరిగిన కేసీఆర్ ఆధ్వర్యంలోని ప్రజాస్వామిక తెలంగాణ ఉద్యమం... అన్నింటినీ తెలంగాణ చూసిందని కేటీఆర్ తెలిపారు.
‘‘రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి తెలంగాణ బిడ్డలు అడుగుపెట్టిన రోజు ఇది. కొంతమంది దీనిని విమోచనమని, విలీనం అని అన్నా, వేలాది మంది ఆనాటి రాచరిక వ్యవస్థపై పోరాటం చేసి ప్రాణాలు అర్పించారు. ఆనాటి పోరాట యోధులకు, అమరవీరులందరికీ మా పార్టీ తరపున శిరస్సు వంచి నివాళులు అర్పిస్తున్నాం. తెలంగాణ అంటేనే త్యాగాల గడ్డ, పోరాటాల అడ్డ. ఆనాటి సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలుకొని 1969 తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత జరిగిన కేసీఆర్ గారి ఆధ్వర్యంలోని ప్రజాస్వామిక తెలంగాణ ఉద్యమం... అన్నింటినీ తెలంగాణ చూసింది. చాకలి ఐలమ్మ, షేక్ బందగి, రావి నారాయణరెడ్డి వంటి అద్భుతమైన అమరవీరులను ఈ తెలంగాణ కన్నది’’ అని పేర్కొన్నారు.
‘‘తెలంగాణలో మరోసారి సంక్షేమ, అభివృద్ధి రాజ్యం రావాలని, నియంతృత్వ పోకడలు లేని ప్రజాస్వామిక రాజ్యం రావాలని కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పోరాటం చేస్తూనే ఉంటాం. గ్రూప్-1 విద్యార్థులు తమకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆకాంక్షలు వ్యక్తపరచుకోవడానికి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుంటే, రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వంతో దాడి చేసింది. ఒకవైపు రైతన్నలు యూరియా లేక ఇబ్బందులు పడుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఒలింపిక్స్ గురించి మాట్లాడుతున్నది. ఇలాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పైన భారత రాష్ట్ర సమితి పోరాడుతూనే ఉంటుంది. ఈ రోజును సమైక్య దినోత్సవంగా జరుపుకుందాం. ఆనాటి పోరాట యోధుల త్యాగాల సాక్షిగా తెలంగాణ బిడ్డలు మరోసారి పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది’’ అని తెలిపారు.