తెలంగాణల అడవుల్లోకి వస్తున్న మహారాష్ట్ర పులులు

మహారాష్ట్ర నుంచి వస్తున్న పులుల పరిరక్షణ కోసం కుమురంభీం టైగర్ రిజర్వును ఏర్పాటు చేసింది.;

Update: 2025-05-31 00:45 GMT
పులుల పరిరక్షణకు కుమురం భీం టైగర్ రిజర్వు

పొరుగున ఉన్న మహారాష్ట్రలోని తడోబా, అంధేరి,తిప్పేశ్వర్ పులుల అభయారణ్యాల్లో తీసుకుంటున్న సంరక్షణ చర్యలతో పులుల సంఖ్య పెరిగింది.దీంతో టెరిటరీ కోసం పులులు సరిహద్దు తెలంగాణలోని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలోని కాగజ్ నగర్, ఆసిఫాబాద్ అటవీ డివిజన్లలోని అడవులకు వలస వస్తున్నాయి. ఇలా వలస వస్తున్న పులులకు రక్షణ కొరవడుతోంది. ఇటీవల ఓ పులిని వేటగాళ్లు విద్యుత్ కంచె సాయంతో చంపి, దాని గోళ్లు, చర్మాన్ని తీసుకువెళ్లారు.పులిని హతమార్చిన ఘటనలు గతంలో పలు చోటుచేసుకున్నాయి. తరచూ పులుల వేట కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పులుల పరిరక్షణ కోసం కుమురం భీం టైగర్ రిజర్వును తాజాగా ఏర్పాటు చేసింది.


కుమురంభీం పులుల అభయారణ్యం
ఇప్పటికే తెలంగాణలో పులుల కోసం కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వులు ఉండగా, కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం కుమురంభీం పులుల అభయారణ్యాన్ని ఏర్పాటు చేసింది. కాగజ్ నగర్, ఆసిఫాబాద్ అటవీ డివిజన్ల పరిధిలోని 1,49,288.88 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని కుమురంభీం పులుల అభయారణ్యంగా అటవీశాఖ ప్రకటించింది. మహారాష్ట్ర నుంచి పులులు తెలంగాణ అడవుల్లోకి వలస వచ్చి వెళుతున్న నేపథ్యంలో వీటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులు ఈ కొత్త టైగర్ రిజర్వును ఏర్పాటు చేశారు.

టైగర్ రిజర్వుతో పులుల కారిడార్
తెలంగాణలో కొత్తగా కుమురంభీం టైగర్ రిజర్వు ఏర్పాటుతో మహారాష్ట్ నుంచి తెలంగాణ దాకా పులుల రాకపోకలకు వీలుగా పులుల కారిడార్ ను ఏర్పాటు చేసినట్లయింది. మహారాష్ట్రలోని తడోబా, అంధేరి,తిప్పేశ్వర్ పులుల అభయారణ్యాల నుంచి తెలంగాణ సరిహద్దుల్లోని కుమరంభీం, కవ్వాల పులుల అభయారణ్యాలకు పులులు రాకపోకలు సాగించేలా పులుల కారిడార్ ఏర్పాటు చేశారు.

వలసపులుల కోసం...
మహారాష్ట్ర వలస పులుల సంరక్షణ కోసం కుమురంభీం టైగర్ రిజర్వు ఏర్పాటు చేయాలని 2024వ సంవత్సరం నవంబరు నెలలోనే తెలంగాణ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రతిపాదనలకు రాష్ట్ర వన్యప్రాణి బోర్డు ఆమోదం తెలిపింది. దీంతో కుమరం భీం టైగర్ రిజర్వు ఏర్పాటు చేస్తూ అటవీశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీని వల్ల మహారాష్ట్ర నుంచి వలస పులుల రాకపోకలకు మార్గం సుగమమైంది.

పులుల సంరక్షణకు కమిటీ
కుమురంభీం పులుల అభయారణ్యంలో పులుల సంరక్షణకు ఆసిఫాబాద్ డీఎఫ్ఓ మెంబర్ సెక్రటరీగా 11 మంది సభ్యులతో టైగర్ కన్జర్వేషన్ రిజర్వు మేనేజ్ మెంట్ కమిటీని రాష్ట్ర అటవీశాఖ ఏర్పాటు చేసింది. దీనివల్ల తెలంగాణలో పులుల పరిరక్షణ వల్ల వీటి సంఖ్య పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సోసైటీ వ్యవస్థాపకులు ఇమ్రాన్ సిద్ధిఖీ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.


Tags:    

Similar News