మామోయిస్ట్ కీలక నేత హిడ్మా అరెస్ట్
భద్రతా బలగాల మెయిన్ టార్గెట్ లిస్ట్లో ఉన్న హిడ్మా కూడా లభించాడు.;
మావోయిస్ట్ కీలక నేత హిడ్మాను పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్ట్లలో అత్యంత కీలక నేతగా ఉన్న హిడ్మాను కోరావుట్లో అరెస్ట్ చేశారు. ఆయన కోసమే దండకారణ్యంలో పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేస్తున్నట్లు సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. హిడ్మా టార్గెట్ చేపట్టిన ఆపరేషన్లోనే నంబాల కేశవరావు హతమయ్యాడు. అలాంటిది ఇప్పుడు భద్రతా బలగాల మెయిన్ టార్గెట్ లిస్ట్లో ఉన్న హిడ్మా కూడా లభించాడు. అయితే హిడ్మా అరెస్ట్ కావడం మావోయిస్ట్లకు అతిపెద్ద దెబ్బ. ఆయన పార్టీలో అత్యంత కీలక పాత్ర పోషించారు.
అసలెవరీ హిడ్మా..
1980లో ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలోని పువ్వర్తి గ్రామంలో జన్మించారు. అతని పూర్తి పేరు మాడ్వి హిడ్మా. పిన్న వయసులోనే మావోయిస్ట్ భావజాలానికి ఆకర్షితుడై అటుగా వెళ్లాడు. 16ఏళ్ల వయసులో 1996లో మావోయిస్ట్ పార్టీ గ్రామ కమిటీలో సభ్యునిగా చేరారు. ఆ తర్వాత అతడు చేసిన దాడులతో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్గా మారాడు.
ఆయన చేసిన ప్రధాన దాడులు
నంబాల తరహాలోనే హిడ్మా కూడా గెరిల్లా యుద్ద వ్యూహాలు పన్నడంలో సిద్దహస్తుడు. ఆయన వ్యూహాలు పసిగట్టలేనివి. భద్రతా బలగాలకు తన వ్యూహరచనతో చేసిన గెరిల్లా దాడులు వెన్నులో వణుకు పుట్టించినవే.
2010 దంతెవాడ దాడి: ఈ దాడిలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టుల చరిత్రలో ఇది అత్యంత పెద్ద దాడులలో ఒకటి.
2013 దర్భా ఘాట్ దాడి: ఈ దాడిలో ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ నాయకులు సహా 25 మంది మరణించారు. ఇందులో సల్వాజుడుం ఏర్పాటు చేసిన మాజీ మంత్రి మహేంద్ర కర్మతోపాటు, మాజీ కేంద్ర మంత్రి విసీ శుక్లా కూడా ఈ దాడిలో మరణించారు.
2017 సుక్మా దాడి: ఈ దాడిలో 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి తర్వాతే హిడ్మా కేంద్ర కమిటీకి పదోన్నతి పొందాడు.
2021 బీజాపూర్ దాడి: ఈ దాడిలో 22 మంది భద్రతా బలగాల జవాన్లు అమరులయ్యారు. ఈ దాడికి హిడ్మానే కీలక సూత్రధారి అని చెబుతారు.
హిడ్మా కేవలం మెరుపుదాడులకే పరిమితం కాకుండా, పార్టీ విధానాల్లో మార్పులు తేవడంలోనూ కీలక పాత్ర పోషించాడని చెబుతారు. మావోయిస్టులను ల్యాండ్ మైన్ల నుంచి తుపాకీ యుద్ధం వైపు మళ్లించడంలో అతడు ప్రభావం చూపాడు.