‘8+8=0 అయింది’.. కొత్త సమీకరణం చెప్పిన కవిత
తర్వాత వచ్చేది బీఆర్ఎస్ 3.O వెర్షన్. కార్యకర్తలు చెప్పేదే బీఆర్ఎస్ చేస్తుంది. పార్టీ కార్యకర్తలందరికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.;
కాంగ్రెస్, బీజేపీలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శలు గుప్పించారు. రెండు పార్టీలకు చిరో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి వచ్చింది గుండు సున్నా అంటూ చురకలంటించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్ పల్లి మండల కేద్రంలోని జీ కన్వెన్షన్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సన్నాహాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సందర్బంగా నిర్వహించిన సమావేశంలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్బంగానే కాంగ్రెస్, బీజేపీలపై విమర్శల గుప్పించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు పైసా కూడా రాకపోవడాన్ని లేవనెత్తారు. కేంద్రంలో తెలంగాణ బీజేపీ, తెలంగాణ కాంగ్రెస్ల నుంచి 16మంది ఎంపీలు ఉన్నా.. తెలంగాణకు ఏమీ రాకపోవడం వారి చేతకాని తనానికి ప్రతీకన్నారు.
‘‘కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు 8 ప్లస్ 8 జీరో అయ్యింది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు పైసా ఇవ్వలేదు. కేంద్ర బడ్జెట్లో పసుపు బోర్డుకు పైసా ఇవ్వలేదు. ఎంపీ అరవింద్ ఇందూరు బిడ్డ అయితే పసుపు బోర్డుకు చట్టబద్ధత తేవాలి. అన్ని బోర్డులకు పార్లమెంట్ చట్టం చేస్తే.. పసుపు బోర్డ్ గెజిట్ ద్వారా ప్రకటించారు. బీజేపీ, కాంగ్రెస్ కూడబలుక్కొని దోచుకుంటున్నారు. 60 లక్షల మంది ఉన్న పెద్ద కుటుంబం మనది. ప్రారంభమైన ప్రతి ఉద్యమం లక్ష్యం చేరుకోవడం కష్టం. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. కేసీఆర్ను ప్రశంసించారు’’ అని గుర్తు చేశారు.
‘‘ఉద్యమంలో అనేక సంక్లిష్టమైన పరిస్థితులను చూశాను. కేసీఆర్ను దీక్ష చేయొద్దని చాలామంది కళ్లనీళ్లు పెట్టుకున్నారు. కేసీఆర్ బక్కమనిషైనా మొండిమనిషి. అయితే తెలంగాణ జైత్రయాత్ర.. లేకుంటే కేసీఆర్ శవయాత్ర అని దీక్షకు బయలుదేరారు. కేసీఆర్ పిలుపునిస్తే ఊరూవాడలు కదిలాయి. స్వరాష్ట్ర ఉద్యమం ప్రతి సందర్భం స్ఫూర్తిదాయకం. తెలంగాణ కోసం 36 పార్టీలను కేసీఆర్ ఒప్పించారు. మాయావతిని తెలంగాణకు ఒప్పించడానికి కేసీఆర్ 50సార్లు వెళ్లారు. యూపీఏ ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది’’ అని అన్నారు.
‘‘మళ్లీ 30 ఏళ్లు అధికారంలోకి రారని కాంగ్రెస్ వాళ్లకు తెలుసు. అందుకే ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నారు. ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు.. కాంగ్రెస్ వాళ్లు ఉపయోగించుకోవాలి. వచ్చిన అవకాశాన్ని ప్రజలకు సేవ చేయడానికి కాంగ్రెస్ ఉపయోగించుకోవాలి. కాంగ్రెస్ పాలనలో 20 పర్సెంట్ కమీషన్ అని ఢిల్లీలో చెప్పుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం గురించి అలా మాట్లాడుతుంటే బాధనిపించింది. 25 ఏళ్ల బీఆర్ఎస్ ప్రస్థానం తెలంగాణ ప్రజల పోరాట చరిత్ర. అటుకులు తినైనా బతుకుతాం..ఆత్మగౌరవం వదులుకోబోమని కేసీఆర్ చెప్పారు’’ అని అన్నారు.
‘‘తర్వాత వచ్చేది బీఆర్ఎస్ 3.O వెర్షన్. కార్యకర్తలు చెప్పేదే బీఆర్ఎస్ చేస్తుంది. తెలంగాణ, నిజామాబాద్ అభివృద్ధి కోసం ఆనాడు బాజిరెడ్డి గోవర్దన్ బీఆర్ఎస్లో చేరారు. పార్టీ కార్యకర్తలందరికి అండగా ఉంటాను. ప్రతి ఊరులో గులాబీ జెండా ఎగరేసి వరంగల్ సభకు బయల్దేరాలి’’ అని పిలుపునిచ్చారు.