సౌదీ ఎడారి నుంచి స్వదేశానికి వచ్చిన నిర్మల్ వాసి

ఉపాధి కోసం కువైట్ దేశానికి వెళ్లి, ఒంటెల కాపరిగా ఏడారిలో కష్టాలు పడిన నిర్మల్ జిల్లా వాసి రాథోడ్ నాందేవ్ సీఎం చొరవతో క్షేమంగా స్వదేశానికి తిరిగి వచ్చారు.

Update: 2024-10-05 10:01 GMT

కువైట్ - సౌదీ అరేబియా సరిహద్దుల్లోని ఎడారిలో ఒంటెల కాపరిగా కష్టాలు అనుభవించిన నిర్మల్ జిల్లావాసి రాథోడ్ నాందేవ్ సీఎం ఏ.రేవంత్ రెడ్డి చొరవతో ఇటీవల రియాద్ నుంచి హైదరాబాద్ కు క్షేమంగా చేరుకున్నాడు. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రి, కాంగ్రెస్ ఎన్నారై సెల్ నాయకులు మంద భీంరెడ్డి, చెన్నమనేని శ్రీనివాస రావు, స్వదేశ్ పరికిపండ్ల, నంగి దేవేందర్ లతో పాటు గల్ఫ్ బాధితుడు రాథోడ్ నాందేవ్ తన కుటుంబ సభ్యులతో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.


సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
నిర్మల్‌ జిల్లా ముధోల్ మండలం రూవి గ్రామానికి చెందిన రాథోడ్‌ నాందేవ్‌ అనే గిరిజనుడు ఇంటిపని వీసాపై కువైట్‌ వెళ్లాడు. అరబ్బు యజమాని అతన్ని కువైట్‌ నుంచి అక్రమంగా సౌదీకి తరలించి ఒంటెల కాపరి పని చేయించాడు. ‘‘యజమాని హింసను తట్టుకోలేకపోతున్నాను, నిత్యం నరకం అనుభవిస్తున్నాను, ఎడారి నుంచి నన్ను రక్షించండి’’ అంటూ రాథోడ్ నాందేవ్ ఆగస్టులో సీఎం రేవంత్ రెడ్డిని వేడుకుంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తూ పంపిన ఒక సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించింది.

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ జీఏడీ ఎన్నారై శాఖ అధికారులు, అనిల్ ఈరవత్రి తో కలిసి కువైట్, సౌదీ అరేబియా రెండు దేశాల్లోని ఇండియన్ ఎంబసీలతో, అక్కడి సామాజిక సేవకులతో, ఢిల్లీలోని విదేశాంగ శాఖతో సమన్వయం చేసి నాందేవ్ ను రక్షించి స్వదేశానికి వచ్చేలా చేశారు. నాందేవ్ ను స్వదేశానికి పంపించడంలో సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (సాటా) బృందం కూడా కృషి చేసింది.

పునరావాసం కల్పించండి : సీఎంకు వినతి
తాను గల్ఫ్ దేశానికి వెళ్లేందుకు లక్షా ఇరవై వేల రూపాయలు అప్పు చేశానని, తనకు ఉపాధి కల్పించి పునరావాసం కల్పించాలని రాథోడ్ నాందేవ్ సీఎంకు విన్నవించారు. తనను కువైట్ పంపించిన ఏజెంట్ మోహన్ తోపాటు ఢిల్లీలోని రిజిస్టర్ రిక్రూటింగ్ ఏజెంటుపై చర్యలు తీసుకునేలా పోలీసు శాఖను ఆదేశించాలని నాందేవ్ కోరారు.


Tags:    

Similar News