కేసీఆర్ ఫ్యామిలీకి కాంగ్రెస్ లోకి నో ఎంట్రి
కవిత చేస్తున్నదంతా అసెంబ్లీ రౌడీ సినిమా తరహా డ్రామాగా రేవంత్ ఎద్దేవాచేశారు;
కేసీఆర్ ఫ్యామిలీపై రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవటంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy), కేసీఆర్(KCR) ఇద్దరూ ఒకటే అన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు కేసీఆర్ ఫ్యామిలీకి కాంగ్రెస్ పార్టీలోకి నో ఎంట్రీ అని స్పష్టంగా చెప్పారు. కేసీఆర్ కుటుంబసభ్యులే తెలంగాణ అభివృద్ధికి ప్రధాన శతృవులన్నారు. తాను ఉన్నంతవరకు కవితకు కాంగ్రెస్ లోకి ఎంట్రీ దొరకదన్నారు. కవిత చేస్తున్నదంతా అసెంబ్లీ రౌడీ సినిమా తరహా డ్రామాగా రేవంత్ ఎద్దేవాచేశారు. కేటీఆర్(KTR) చెప్పినట్లుగానే కిషన్ రెడ్డి నడుచుకుంటున్నట్లు సీఎం ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఒక్కరోజు కూడా సమీక్ష నిర్వహించలేదని మండిపడ్డారు.
రీజనల్ రింగ్ రోడ్డు సహా అనేక ప్రాజెక్టులను కిషన్ అడ్డుకంటున్నట్లు ఆరోపించారు. చర్లపల్లి రైల్వేస్టేషన్ భూసేకరణను తానే క్లియర్ చేయించినట్లు రేవంత్(Revanth) చెప్పారు. సామాజికఅంతరాలు ఉన్నంతవరకు నక్సలిజం ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నక్సలిజం కొంతతగ్గినా వివిధ రూపాల్లో మళ్ళీ వస్తుందని చెప్పారు. కొత్తమంత్రులకు శాఖల కేటయింపుపై మాట్లాడుతు తాను హైదరాబాద్ కు చేరుకోగానే తనదగ్గరున్న శాఖలను కేటాయిస్తానని ప్రకటించారు. ప్రస్తుతం రేవంత్ దగ్గర విద్యాశాఖ, హోంశాఖ, మున్సిపల్, క్రీడలతో పాటు చాలా శాఖలున్న విషయం తెలిసిందే. తాను ఢిల్లీకి వచ్చింది శాఖల కేటాయింపు అధిష్ఠానంతో చర్చకు కాదని తెలంగాణ, కర్నాటకలో విజయవంతమైన కులగణన వివరాలు మాట్లాడేందుకే అని వివరణిచ్చారు.
కాళేశ్వరం విచారణపై మాట్లాడుతు మూడురోజుల్లో కాళేశ్వరం గురించి కీలకమైన అంశాలు చెబుతానని అన్నారు. రేవంత్ తాజా వ్యాఖ్యలతో రేవంత్ చెప్పబోయే అంశాలు ఏముంటాయనే విషయమై ఆసక్తి పెరిగిపోతోంది. ఎందుకంటే ఈరోజే కమిషన్ కేసీఆర్ ను విచారించింది. కేసీఆర్ విచారణతో కమిషన్ విచారణ దాదాపు ముగిసినట్లే అని అనుకుంటున్నారు. ఈనేపధ్యంలో కీలకమైన అంశాలు చెబుతానని రేవంత్ చెప్పటం ఆసక్తిగా మారింది. కాళేశ్వరం అవినీతి, అవకతవకతలపై కమిషన్ తన పని తాను చేసుకుపోయినట్లు రేవంత్ కామెంట్ చేశారు. విచారణ పేరుతో ప్రభుత్వం కేసీఆర్ ను వేధిస్తోందన్న ఆరోపణలను కొట్టిపడేశారు.