తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం నిరుత్సాహ పరుస్తున్నదా?

ప్రత్యేక రాష్ట్రం పదేళ్ల మీద ‘ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్’ విశ్లేషణ;

Update: 2025-06-17 11:09 GMT
తెలంగాణ రాష్ట్రం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక రాష్ట్రానికి, ప్రజలకు ఎక్కవ నష్టమే జరిగిందా?

అవునంటున్నది ’ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్’ (Forum for Good Governance: FGG).

ప్రభుత్వాల పరిపాలన బాగుండాలి, చట్టబద్ధపాలన జరగాలని, అవినీతి అక్రమాలకు చోటులేని పాలన ఉండాలని, ప్రజాసమస్యలను పట్టించుకుని పరిష్కరించేలా ప్రభుత్వాలు పనిచేసేలా వత్తిడి తెచ్చే  లక్ష్యంతో పనిచేసే సంస్థ ఎఫ్ జిజి. కొంతమంది మాజీ అఖిలభారత సర్వీసుల అధికారులు, శాస్త్రవేత్తలు, మేధావులు కలసి ఏర్పాటు చేసిన  ఈ సంస్థ ఇటీవల  పదేళ్ల ప్రత్యేక తెలంగాణ ఎలా ముందుకు సాగుతున్నదనే అంశాన్ని విశ్లేషించింది. ఈ విశ్లేషణ నిరాశాజనక ఫలితాలను వెల్లడించింది.

"అప్పులు చేసి నిర్మించిన ప్రాజెక్టుల్లో విచ్చలవిడిగా అక్రమాలు జరిగాయని పలు విచారణల్లో తెేలింది. ప్రజాధనం అక్రమార్కుల పాలు కావడంతో ఆశించిన ఫలితాలు లభించలేదు. తెలంగాణ ఏర్పడినపుడు మద్యం విక్రయాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.8 వేల కోట్ల వార్షికాదాయం కాస్తా ప్రభుత్వాల ప్రోత్సాహం కారణంగా మద్యపానం పెరిగి రూ.40వేల కోట్లకు పెరిగిందని ఎక్సైజ్ రికార్డులే చెబుతున్నాయి. కల్తీ కల్లు, డ్రగ్స్ వాడకం పెచ్చు పెరిగింది," ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ విశ్లేషణలో తేలింది.

నీళ్లు,నిధులు, నియామకాల కోసం జరిగిన ప్రజా ఉద్యమంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నేటికి 11 సంవత్సరాలు గడచింది. ప్రత్యేక రాస్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు గడిచినా ఇంకా ఈ మూడు కీలక విషయాల్లో తెలంగాణ ప్రజలు ఆశించిన మేర ప్రగతి సాధించలేదని ఎఫ్ జిజి గుర్తిచింది.

‘తెలంగాణ ప్రజల అసలు ఆకాంక్షలు నెరవేరక పోవడంతో పాటు రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోయింది.రాజకీయ వైరుధ్యాల వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ కొత్త రాష్ట్రానికి ఆశించిన నిధులు రాక, అప్పులు చేయడంతో తెలంగాణ ప్రజల అసలు లక్ష్యాలు నెరవేరలేదు,’ ఎఫ్ జిజి విశ్లేషణ పేర్కొంది.

పదకొండేళ్లలో తెలంగాణ ఆకాంక్షలు ఏ మేర నెరవేరాయి?
2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఇప్పటికి  11 ఏళ్లు గడిచాయి. అయితే, ప్రజలు దేని కోసమైతే పోరాడి ప్రత్యేక రాస్ట్రాన్ని సాధించుకున్నారో ఆ ఆశలు ఎంతమేర నెరవేరాయి అనేదాన్ని ప్రధానంగా  ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్  విశ్లేషించింది.  గడచిన పదకొండేళ్లలో నీళ్లు, నిధులు, నియామకాల ప్రగతిని ఎఫ్ ఎఫ్ జి అధ్యక్షుడు యం పద్మనాభరెడ్డి వెల్లడించారు.
రూ.30వేల కోట్లు ఖర్చు అయినా ఎకరాకు కూడా అందని నీరు
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును రూ.32,000 కోట్లతో నిర్మించాలని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా డీపీఆర్ తయారు చేసి ప్రభుత్వానికి సమర్పిస్తే అప్పటి సీఎం కేసీఆర్ దాన్ని కాదని జూరాల నుంచి కాకుండా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 5 పంపుల ద్వారా నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించారు. కేంద్ర అనుమతులు లేకుండానే ప్రాజెక్టు పనులు ప్రారంభించడంతో ఆంధ్రప్రదేశ్ ఫిర్యాదు చేయడంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూ.920 కోట్ల జరిమానా విధించింది. శ్రీశైలం నుంచి నీటిని తరలించేందుకు 2015 జూన్ 10వతేదీన జీఓనంబరు 105 ద్వారా రూ.35 వేల కోట్ల ప్రాజెక్టుకు పరిపాలనా ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టుకు రూ.30వేల కోట్లు ఖర్చు అయినా ఎకరానికి కూడా సాగు నీరు అందని పరిస్థితి నెలకొందని  పద్మనాభరెడ్డి ఆధ్వర్యంలో  జరిగిన ఈ పరిశీలనలో వెల్లడైంది.
కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై కమిషన్ విచారణ
తెలంగాణ వచ్చాక చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల్లో మేడిగడ్డ పిల్లర్లు రెండు దెబ్బతిన్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పలు అక్రమాలు జరిగాయని వెల్లడైంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకున్న ఇద్దరు ఇంజినీర్ల వద్ద రూ.200 కోట్లకు పైగా అక్రమార్జన ఏసీబీ విచారణలో బయటపడటంతో వారిద్దరినీ అరెస్టు కూడా చేశారు. మరో వైపు కాళేశ్వరం అవినీతి బండారంపై విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్, ఏసీబీ, జుడీషియల్ కమిషన్ విచారణ జరుపుతోంది.
ఎస్ఎల్ బీసీ టన్నెల్ ప్రమాదంతో నిలిచిన పనులు
ఎసఎల్ బీసీ టన్నెల్ నిర్మాణ పనులు కూడా పూర్తి చేయలేదు. ఈ ఏడాది టన్నెల్ పైభాగం కూలిపోయి 8 మంది ఉద్యోగులు, కార్మికులు మరణించడంతో ఈ పనులు కాస్తా నిలిచి పోయాయి. ప్రాజెక్టు చేపట్టి 20 ఏళ్లు గడిచినా పూర్తి కాలేదు.
తెలంగాణలో పెరిగిన అప్పులు
తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్ర అప్పు రూ.80వేల కోట్లు ఉండగా అది కాస్తా రూ.7 వేల కోట్లకు పెరిగింది. అప్పులు చేసి చేపట్టిన ప్రాజెక్టులు, ఇతర పనులు సత్ఫలితాలు ఇవ్వడం లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు యం పద్మనాభరెడ్డి చెప్పారు. విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్రాజెక్టులు చేపట్టినా అవి అధునాతన సాంకేతికతతో నిర్మించలేదని తేలింది. అప్పు చేసి తెచ్చిన నిధులతో సంక్షేమ పథకాల పేరిట గొర్రెల పంపిణీ చేసినా ఆ పథకంలో అక్రమాలు జరిగి ప్రజాధనం పక్కదారి పట్టింది. సాగు కాని భూములకు కూడా రైతు బంధులు ఇచ్చారు. దళిత బంధు పథకం కింద రూ.4వేల కోట్ల ప్రజాధనం వెచ్చించినా ఫలితాలు మాత్రం రాలేదు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కార్యక్రమాల్లో అక్రమాలు జరిగాయని తేలిందని యం పద్మనాభరెడ్డి ఆర్టీఐ కింద ప్రభుత్వం నుంచి సేకరించి సమాచారాన్ని విశ్లేషించి చెప్పారు.
నియామకాలు అంతంత మాత్రమే...
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగుల నియామకాలు కొద్దో గొప్పో జరిగాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ప్రశ్నాపత్రాల లీకేజీ, కోర్టు స్టేలతో ఆశించిన మేర నియామకాలు జరగలేదు.

ప్రజాపోరాటాలతో వచ్చిన తెలంగాణ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1956వ సంవత్సరంలో ఏర్పాటు కాగా, నాటి నుంచి తెలంగాణ ప్రాంతానికి నీళ్లు, నిధులు, నియామకాల్లో తీరని అన్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రజలు 1969 వసంవత్సరం నుంచి ఉద్యమ బాట పట్టారు. మొదటి దశ తెలంగాణ పోరాటంలో పోలీసు కాల్పుల్లో పలువురు తెలంగాణ ఉద్యమకారులు మృత్యువాత పడ్డారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి రెండో దశ తెలంగాణ ఉద్యమ పోరాటం చేపట్టారు. ఈ పోరాటంలో ఎందరో విద్యార్థులు బలిదానం చేశారు. ఉద్యోగులు, ప్రజలు, విద్యార్థులు, జర్నలిస్టులు ఇలా ఒకరేమిటి? అందరూ మూకుమ్మడిగా సర్వజనుల సమ్మె చేశారు. దీంతో 2014 జూన్ నెలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది.




Tags:    

Similar News