2018 నుంచే ఫ్యాన్ ట్యాపింగ్ జరిగిందా..?
కాంగ్రెస్ నేతల అనుచరుల నుంచి రూ.3.50 కోట్లు స్వాధీనం చేసుకోవడంలో కూడా ఫోన్ ట్యాపింగ్ సహాయపడింది.;
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరో కీలక మలుపు తీసుకుంది. ఇన్నాళ్లూ ఈ వ్యవహారంలో మనకి తెలిసింది చాలా తక్కువ అని తాజాగా సిట్ అధికారులు తెలిపారు. తాజాగా లభించిన కొన్ని ఆధారాలు చూసి తాము కూడా విస్తుబోయామని, ఇన్నాళ్లూ అనుకున్నట్లు ఫోన్ ట్యాపింగ్ అనేది 2022 నుంచి జరగలేదని గుర్తించారు. 2018 ఎన్నికల సమయంలో కూడా ఫోన్ ట్యాపింగ్లు జరిగినట్లు కొన్ని ఆధారాలు సిట్ అధికారులకు లభించాయి. ప్రణీత్ రావు నుంచి టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుకు ఫోన్ ట్యాపింగ్ సమాచారం చేరేదని సిట్ అధికారులు గుర్తించాయి. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ అరంగేట్రం చేసింది. ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ప్యారడైజ్ వద్ద భవ్య ఆనంద్ప్రసాద్కు చెందిన రూ. 70లక్షల డబ్బును టాస్క్ఫోర్స్ అధికారులు సీజ్ చేసినట్లు సమాచారం. అదే విధంగా దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు, ఎన్నికల్లో పోటీ చేసిన రఘునందన్ రావు బంధువులకు చెందిన రూ.కోటి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ సహాయంతోనే సీజ్ చేసినట్లు సమాచారం. నల్గొండ కాంగ్రెస్ నేతల అనుచరుల నుంచి రూ.3.50 కోట్లు స్వాధీనం చేసుకోవడంలో కూడా ఫోన్ ట్యాపింగ్ సహాయపడిందని సమాచారం.
బీఆర్ఎస్ రెండో సారి గెలుపుకు ఇదే కారణమా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా రెండు సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చింది. తొలిసారి కన్నా రెండోసారి బీఆర్ఎస్ భారీ మెజార్టీ సాధించింది. అయితే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంభవించిన పరిణామాలను చూస్తే మాత్రం.. 2018 ఎన్నికల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ సహాయంతోనే బీఆర్ఎస్ విజయదుందుబీ మోగించి ఉండొచ్చన చర్చ మొదలైంది. విశ్లేషకులు కూడా దీనిని సమర్థిస్తున్నారు. 2018 ఎన్నికల ముందు నుంచే కేసీఆర్ చేతిలో ఫోన్ ట్యాపింగ్ అస్త్రం ఉందంటే.. ఆయన సాధించిన విజయం ఏదీ కూడా ఆయనదు కాదని వారు అభిప్రాయపడుతున్నారు. నిజంగా ఉద్యమ బిడ్డలు, తెలంగాణ కోసం ప్రాణాలను తృణప్రాయంగా వదలడానికి సిద్ధమైన వీరులే అయితే అధికారం రాగానే.. పదవి పోతుందన్న భయం ఎందుకు పట్టుకుందని, పదవిని కాపాడుకోవడం కోసం ప్రత్యర్థుల ఫోన్లను ఎందుకు ట్యాప్ చేయించినట్లు అని ప్రశ్నిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ఆనాటి నేతలు అందరినీ విచారించాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.