కవితను అదుపులోకి తీసుకున్న పోలీసులు..
ఎమ్మెల్సీ కవితను చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు.;
బస్ పాస్ ఛార్జీలను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజలు, బస్ పాస్ల లబ్ధిదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిరసన బాట పట్టారు. బస్ పాస్ ఛార్జీల పెంపును పునరాలోచించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బస్ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. భారీ ఎత్తున నిరసన చేశారు. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. పలువురు కార్యకర్తలతో పాటు కవితను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్సీ కవితను చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ‘‘బస్ పాస్ ధరలను పెంచి ప్రజలపై ప్రభుత్వం పెనుభారాన్ని మోపింది. విద్యార్థులు, చిరుద్యోగులపై తీవ్రంగా ఆర్థిక భారం పడుతుంది. బస్ పాస్ ధరలను పెంచి ప్రజలపై గుదిబండను మోపారు. ఈ పెంపుతో ఒక్క ప్రయాణికుడిపై నెలకు దాదాపు రూ 300 పైగా భారం పడుతుందని అంచనా. అనేక రూట్లల్లో విద్యార్థుల కోసం బస్సులు నడపడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రజలను దోచుకోవడానికి ప్రభుత్వం అలవాటుపడింది’’ అని కవిత తీవ్ర విమర్శలు చేశారు. పెరిగిన ఛార్జీల ప్రకారం గతంలో రూ.1,150 ఉన్న ఆర్డినరీ పాస్, ఇప్పుడు రూ.1,400కి పెరిగింది. రూ.1,300గా ఉన్న మెట్రో ఎక్స్ప్రెస్ పాస్, ప్రస్తుతం రూ.1,600కి పెరిగింది. అలాగే రూ.1,450గా ఉన్న మెట్రో డీలక్స్ పాస్, ఇప్పుడు రూ.1,800గా అమలులోకి వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్, గ్రీన్ మెట్రో ఏసీ పాస్ ధరలు కూడా గణనీయంగా పెరిగింది.