ఊపిరి ఆగిపోనున్న రవీంద్రఖని
52 అండర్ గ్రౌండ్ గనుల్లో తవ్వకాలు సాధ్యంకాదని ఇప్పటికి 31 గనులను మూసేసింది యాజమాన్యం.;
సింగరేణి బొగ్గు గనుల్లో గడచిన 50 ఏళ్ళుగా మిలియన్ టన్నుల బొగ్గును అందించిన మంచిర్యాలలోని రవీంద్రఖని-6 అండర్ గ్రౌండ్ మైన్ తొందరలోనే మూతపడుతోంది. బొగ్గు నిక్షేపాలను ఇఫ్పటికే చాలా లోతులోకి తవ్వేసిన కారణంగా ఇక తవ్వకాలు సాధ్యంకాదని మేనేజ్మెంట్ కు అర్ధమైపోయింది. అందుకనే అండర్ గ్రౌండ్ మైన్(Under ground mine) ను మూసేయాలని డిసైడ్ అయ్యింది. బహుశా జూలై చివరకు గనిలో బొగ్గు తవ్వకాలను ఆపేసి గనిని మూసేయబోతున్నారు. సింగరేణి(Singareni mines) పరిధిలో రెండురకాల బొగ్గుగనులున్న విషయం అందరికీ తెలిసిందే. ఒకటి ఓపెన్ కాస్ట్ మైన్(ఓసీ) రెండోది అండర్ గ్రౌండ్ మైన్(యూజీ). తొందరలో మూతపడబోతున్న రవీంద్రఖని-6 యూజీ మైన్.
ఆర్కే గని 6లో సింగరేణి కార్మికులు సుమారు 50 ఏళ్ళుగా బొగ్గు తవ్వకాలు జరుగుతున్నాయి. ఉత్పాదకత, ఉత్పత్తిలోనే కాకుండా రక్షణపరంగా కూడా ఆర్కే 6 గని ఎన్నో రికార్డులు సృష్టించింది. ఈ గనిలో బొగ్గు తవ్వకాలు 1975లో మొదలయ్యాయి. గనిలో 29.60 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు యాజమాన్యం గుర్తించింది. గడచిన 50 ఏళ్ళల్లో 14.48 మిలియన్ టన్నుల బొగ్గును కార్మికులు వెలికితీయగలిగారు. మరో 13.95 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఇంకా ఉన్నాయి. ఇందులో నుండి ఉత్పత్తయిన బొగ్గు జీ9, జీ12 గ్రేడుకు చెందింది. బొగ్గు నిల్వలు సుమారు 305 మీటర్ల లోతువరకు ఉన్నయి. అయితే అంతలోతులోకి వెళ్ళి తవ్వటం జరిగేపనికాదు. ఇప్పటికి 128 మీటర్లలోతులోకి మాత్రమే కార్మికులు వెళ్ళగలిగారు. ఇంకా లోతులోకి వెళ్ళి తవ్వకాలు జరపటం సాధ్యంకాదని కార్మికులు చెప్పటంతో యాజమాన్యం కూడా గనిని పరిశీలించింది.
128 మీటర్ల లోతులోకి మించి కార్మికులు వెళ్ళటం సాధ్యంకాదని యాజమాన్యం కూడా గ్రహించింది. 306 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించిన గనిలో యంత్రాలసాయంతో కార్మికులు మైనింగ్ జరిపినా ఇకముందుకు వెళ్ళటం సాధ్యంకాదని తేలిపోవటంతో గనిలో బొగ్గు తవ్వకాలను నిలిపేయాలని యాజమాన్యం నిర్ణయించింది. తాజా పరిస్ధితి ఏమిటంటే గనిలో మరో 60 రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయి. అందుకనే జూలై నెలాఖరులో గనిని మూసేయాలని యాజమాన్యం డిసైడ్ చేసింది. ఒకసారి గనిని మూసేస్తే ఇందులో పనిచేస్తున్న సుమారు 600 మంది కార్మికులను చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ఇతర గనుల్లోకి బదిలీచేస్తుంది యాజమాన్యం.
ఎలా క్లోజ్ చేస్తారు ?
ఇపుడు రోజుక 577 టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతోంది. ఉత్పత్తి ఆగిపోయిన తర్వాత గనిలో ప్రస్తుతం ఉన్న యంత్రాలు, ఇతర పరికరాలు, భారీ పంపులు, మెష్షులతో పాటు ఇతర పరికరాలను బయటకు తీసుకొచ్చేస్తారు. జూలైలో బొగ్గు తవ్వకాలు ఆపేసినా గనిని పూర్తిగా మూసేయటానికి మరో మూడునెలలు పడుతుంది. పైన చెప్పిన యంత్రాలు, తవ్వకం పరికరాలన్నింటినీ బయటకు తీసుకొచ్చేసిన తర్వాత లోపల నుండి కొద్దికొద్దిగా మైన్ పై కప్పును కూల్చేస్తారు. దాంతో పై కప్పునుండి ఊడిపడిన డెబ్రిస్ అంటే మట్టి, ఇసుక, రాళ్ళు తదితరాలతోనే గనిలోపల ప్రాంతాన్ని మూసేస్తారు. వీలైనంతలో గనిని డెబ్రిస్ తో మూసిన తర్వాత మిగిలిన గనిని ఇసుకతో నింపేస్తారు. యాజమన్యం పరిధిలోని 52 అండర్ గ్రౌండ్ గనుల్లో తవ్వకాలు సాధ్యంకాదని ఇప్పటికి 31 గనులను మూసేసింది యాజమాన్యం.
లోపలకు వెళితే ప్రమాదం : వీరభద్రయ్య
ఇదే విషయమై మంచిర్యాల ప్రాంతంలోని రవీంద్రఖని-6 గని ఏరియా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వీరభద్రయ్య తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు మరింత లోతులోకి వెళ్ళి బొగ్గు తవ్వకాలు జరపటం ఎంతమాత్రం క్షేమకరం కాదన్నారు. ఎందుకంటే గనిలోతులోకి వెళ్ళేకొద్ది కార్మికులు ఆక్సిజన్ అందదని చెప్పారు. గనిని క్లోజ్ చేసేముందు అందులోని యంత్రాలు, యంత్రపరికరాలతో పాటు ఇతర పరికరాలన్నింటినీ కార్మికులు బయటకు తెచ్చేస్తారని తెలిపారు.ఇప్పటికే లోపలనుండి బయటకు వచ్చేమార్గంలో 120 మీటర్లను యజమాన్యం పూడ్చేసినట్లు తెలిపారు. గని ఎత్తు 12 అడుగులు, 16 అడుగుల వెడల్పుంటుందన్నారు. 80 మీటర్ల నుండి గనిని ఇసుకతో పూడుస్తారని చెప్పారు. గనిని పూడ్చేందుకు సుమారు 300 టన్నుల ఇసుక అవసరమని వీరభద్రయ్య అంచనా వేశారు. ఇపుడు మూతవేసిన అండర్ గ్రౌండ్ గనులని తర్వాత ఓపెన్ క్యాస్ట్ గనులుగా తిరిగి ఓపెన్ చేసే అవకాశలున్నట్లు చెప్పారు.
ప్రత్యేక పూజలు
గనిలో బొగ్గు తవ్వకాలు మొదలుపెట్టేముందు, గనిని మూసేసేటప్పుడు కూడా యాజమాన్యం ప్రత్యేక పూజలు చేస్తుందని ప్రధన కార్యదర్శి చెప్పారు. గ్రామదేవత మైసమ్మకు యాజమాన్యం ప్రత్యేక పూజలు చేస్తుందన్నారు. పూజలు చేసిన తర్వాత తవ్వకాలు మొదలుపెడితే కార్మికులకు ఎలాంటి ప్రమాదాలు జరగవని, తవ్వకాలు కూడా నిరాటంకంగా సాగుతాయని యాజమాన్యంతో పాటు కార్మికులు కూడా గట్టిగా నమ్ముతారని చెప్పారు. సింగరేణి పరిధిలో ఎక్కడ ఏ గనిలో తవ్వకాల సమయంలో అయినా ఇదేపద్దతిలో మైసమ్మకు పూజలు చేస్తారని చెప్పారు.