అందరికీ ఇష్టమైన ‘తాండూరు కందిపప్పు’ రైతుకి కష్టాలు...
బాస్మతి బియ్యం ఉడికేటప్పుడు ఎంతటి సువాసన వస్తుందో తాండూరు కందిపప్పు ఉడికించేట్టప్పుడు అలాంటి సువాసనే వస్తుంది;
మనం నిత్యం తినే ఆహారంలో కొన్ని ప్రాంతాలను బట్టి ప్రాంతాల పేర్లతోనే ఆహారం చాలా పాపులరవుతాయి. ఉదాహరణకు మామిడిపండ్లు, బియ్యం, కారం. ఇలాంటి పాపులర్ ఆహారం లాగే కందిపప్పు కూడా అదేపద్దతిలో ఫేమస్ అయ్యింది. మామిడిపండ్లు తెలుగురాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో పండుతున్నా నూజివీడు రసాలంటే చాలా ఫేమస్. అలాగే వరి రెండు రాష్ట్రాల్లో చాలా చోట్ల పండిస్తున్నా నెల్లూరు మొలకొలుకులు, కర్నూలు సోనా మసూరి అంటే చాలా పాపులర్. అలాగే వేసవికాలంలో పెట్టుకునే ఆవకాయ, మాగాయలో వాడే కారం తెలుగురాష్ట్రాల్లో దొరకని ప్రాంతం అంటు ఉండదు. కాని చాలామంది ఏరికోరి గుంటూరు కారం, భద్రాచలం కారాన్నే ఎంచుకుంటారు. అదేపద్దతిలో కండిపప్పు(Tandur Red gram)కు తాండూరు చాలా ఫేమస్. వికారాబాద్ జిల్లా తాండూరులో పండే కందిపప్పంటే తెలుగురాష్ట్రాల్లో చాలా పాపులర్. కారణం ఏమిటంటే రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో పండే కందిపప్పుతో పోల్చితే తాండూరులో పండే కందిపప్పు చాలా ప్రత్యేకంగా ఉంటుంది.
తాండూరు కందిపప్పు అంత పేరు ఎందుకు వచ్చింది ? ఎందుకంటే మిగిలిన ప్రాంతాల్లో పండే కందిపప్పుతో పోల్చితే తాండూరు కందిపప్పు చాలా తొందరగా ఉడుకుతుంది. పప్పు వండేటప్పుడు మంచి సువాసన వస్తుంది. బాస్మతి బియ్యం ఉడికేటప్పుడు ఎంతటి సువాసన వస్తుందో తాండూరు కందిపప్పు ఉడికించేట్టప్పుడు అలాంటి సువాసనే వస్తుంది. తాండూరు కందిపప్పులో 24 శాతం ప్రొటీన్లుంటాయి. మిగిలిన ప్రాంతాల్లో దొరికే కందిపప్పులో 19-22 శాతం ప్రొటీన్లుంటే తాండూరు కందిపప్పులో మాత్రం 24 శాతం ప్రొటీన్లుంటాయి. మాంసాహారం(చికెన్)లో దొరికేంత ప్రొటీన్లు తాండూరు కందిపప్పులోనూ దొరుకుతాయి. అందుకనే తాండూరు కందిపప్పు ఉడికేటప్పుడే కాదు తినేటప్పుడు కూడా చక్కటి రుచుని కలిగుంటుంది. అందుకనే తాండూరు కందిపప్పు అంత ఫేమస్ అయ్యింది. కాబట్టే కేంద్రప్రభుత్వంలోని పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వశాఖ తాండూరు కందిపప్పుకు 2022లో జీఐ ట్యాగ్ ఇచ్చింది. అప్పటినుండి తాండూరు కందిపప్పు మరింత పాపులర్ అయిపోయింది. రుచి, వాసనలో ఇంత పేరు తెచ్చుకున్న తాండూరు కందిపప్పు ధర మిగిలిన ప్రాంతాల్లో పండే కందిపప్పుకు తేడా ఉండాలి. ఏ తేడా లేకపోతే ఇక అంత ఫేమస్ అయికూడా ఉపయోగం ఏముంటుంది ?
జీఐ ట్యాగ్(Geographical Index) వచ్చిన తాండూరు కందిపప్పును పండిస్తున్న రైతులకు ప్రతి సీజన్లో ఎంత సంపాదిస్తున్నారో అనుకుంటే పొరబాటు పడినట్లే. సమస్యంతా ఇక్కడే వస్తోంది. విషయం ఏమిటంటే మిగిలిన ప్రాంతాల్లో పండించే కందులకు తాండూరులో పండే కందులకు ధరలో ఎలాంటి తేడా ఉండటంలేదు. మిగిలిన ప్రాంతాల్లో పండే కందులు క్వింటాలుకు రు. 7200 ఉంటే తాండూరు కందులు కూడా క్వింటాలు ధర రు. 7200 ఉంది. నాగర్ కర్నూలు, ఖమ్మం, జడ్చర్ల మార్కెట్లతో పోల్చితే తాండూరు కందులకు ధర కాస్త ఎక్కువే అయినా అదేమంత చెప్పుకోదగ్గ ఎక్కువకాదు. మిగిలిన ప్రాంతాల్లో పండే కందులు క్వింటాలు రు. 7600 ఉంటే తాండూరు కందులు క్వింటాలు ధర కనీసం 1500 అదనంగా అంటే రు. 9 వేలు ఉండాలని ఇక్కడ రైతులు కోరుకుంటున్నారు. కందులకు గిట్టుబాటు ధరలు లేనికారణంగా కొందరు రైతులు కందుల నుండి పత్తిసాగువైపు మొగ్గుచూపుతున్నారు. తాండూరు ఏరియాలో ప్రతిసీజన్లోను సుమారు 2 లక్షల ఎకరాల్లో కందులు పండిస్తారు. వీళ్ళల్లో కొందరు రైతులు పత్తిసాగు చేస్తున్నారు. కారణం ఏమిటంటే కందులకన్నా పత్తి ధరలు ఎక్కువగా ఉండటమే.
కందులు-పత్తి ఏదైనా ఒకటే : సుధాకర్
తాండూరులో కందులు పండించే రైతులు పత్తిసాగువైపు మొగ్గుచూపుతున్న విషయం వాస్తవమే అని తాండూరు వ్యవసాయ పరిశోధన సంస్ధ ప్రిన్సిపుల్ సైంటిస్ట్ డాక్టర్ చేరత్ సుధాకర్ ‘తెలంగాణ ఫెడరల్’ కు చెప్పారు. ‘కందులు, పత్తి పంటకు అవసరమైన భౌగోళిక, వాతావరణ పరిస్ధితులు ఒకటి కావటమే కారణమ’న్నారు. ‘రెండు పంటలకు నల్లరేగడి నేలలు, నీటి సౌకర్యం, పంట కాలం ఒకటే’ అన్నారు. ‘తాండూరు ప్రాంతంలోని భూములు బాగా సారవంతమైనవి కావటంతో కందులు, పత్తి బాగా పండుతాయ’ని చెప్పారు. ‘2024-25 సీజన్లో కందులు బాగా ఎక్కువగా పండటంతో ఉత్పత్తి పెరిగిపోయి ధరలు పడిపోయాయ’న్నారు. కందుల పంట విస్తీర్ణం కొంత తగ్గినా ఉత్పత్తి మాత్రం గణనీయంగా పెరిగిందన్నారు.
‘తాండూరు నియోజకవర్గంలోని యాలాల, పెద్దెముల్, బషీరాబాద్, తాండూరు మండలాల్లోని 70 వేల ఎకరాల్లో 2.5 లక్షల క్వింటాళ్ళ కందులు పండి’నట్లు సుధాకర్ తెలిపారు. ‘కందుల ఉత్పత్తి బాగానే ఉన్నా ధరలే రైతులు ఆశిస్తున్నట్లు లేద’న్నారు. ‘మిగిలిన ప్రాంతాల్లో పండే కందులతో పోల్చినపుడు తాండూరు కందుల ధరలు కనీసం రు. 1500 ఎక్కువుండాల’ని సుధాకర్ చెప్పారు. ‘ధరలో తేడా లేకపోతే మిగిలిన ప్రాంతాల్లో పండే కందులకు తాండూరు కందులకు తేడా ఏముంటుంది’ ? అని అన్నారు. జీఐ ట్యాగ్ వల్ల తాండూరు కందులు చాలా స్పెషల్ అన్నారు. ‘తాండూరు కందులు ఉడికించేటప్పుడు మంచి సువాసన వస్తుంద’న్నారు. ‘తొందరగా ఉడకటంతో పాటు 24 శాతం ప్రొటీన్లను అందిస్తుంద’న్నారు. ఇపుడు కందులకు కనీస మద్దతు ధర రు. 7600 ఉందన్నారు. తాండూరు రైతులు తాము పండించే కందులకు ఇంకా ఎక్కువ ధరలు ఆశిస్తున్నట్లు శాస్త్రవేత్త తెలిపారు.
‘నారాయణపేట్, సంగారెడ్డి, సూర్యాపేట, ఖమ్మం, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో కందులు ఎక్కువగా పండుతాయ’ని చెప్పారు. ‘యాలాల ఫార్మర్ ప్రొడ్యూసర్స్ కంపెనీ పేరుతో తాండూరు కందిపప్పుకు కేంద్రంలోని పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ జీఐ ట్యాగ్ ఇచ్చింద’న్నారు. ‘తెలుగురాష్ట్రాల్లో తాండూరులో పండించే కందులకు మాత్రమే జీఐ ట్యాగ్ ఉంద’న్నారు. మిగిలిన ప్రాంతాల్లో పండించే కందులను సేకరించినట్లు కాకుండా విడిగా సేకరించాలన్నారు. అలాగే ‘కనీస మద్దతు ధర కూడా ఇతర ప్రాంతాల్లో పండే కందులకన్నా తాండూరు కందులకు ఎక్కువగా ఉన్నపుడే తాండూరు కందులకు ప్రత్యేకత ఉంటుంద’న్నారు. ‘కందిబోర్డు ఏర్పాటు వల్ల సేకరణ, ధరల్లో తేడాలు ఉండే అవకాశముంద’న్నారు. ‘కందిబోర్డును కేంద్రప్రభుత్వమే ఏర్పాటు చేయాల్సిన అవసరంలేదని, రాష్ట్రప్రభుత్వం కూడా ఏర్పాటు చేయచ్చ’ని తెలిపారు. మహారాష్ట్ర, కేరళలో పండే కందులకు కూడా కేంద్రప్రభుత్వం జీఐ ట్యాగ్ ఇచ్చినట్లు డాక్టర్ సుధాకర్ చెప్పారు.
జీఐ ట్యాగ్ ఉన్నా లాభంలేదు : నరసింహులు
ఇదే విషయమై తాండూరు రైతు గుండ్ల నరసింహులు మాట్లాడుతు ‘ఇపుడు తాము పండిస్తున్న కందులకు జీఐ ట్యాగ్ ఉన్నా పెద్ద ఉపయోగం కనబడటంలేద’న్నారు. ‘కందుల సేకరణ ధరల విషయంలో ఇతర ప్రాంతాల్లో పండే కందులకు తాండూరు కందులకు తేడా ఉన్నపుడే దీని ప్రత్యేకత జనాలందరికీ తెలుస్తుంద’న్నారు. ‘ఇతర ప్రాంతాల్లో పండే కందులు క్వింటాలుకు కనీస మద్దతు ధర రు. 7600 ఉంటే తాండూరు కందుల ధర కూడా అంతే ఉంద’న్నారు. ‘తమ ప్రాంతంలో పండే కందులకు తక్కువలో తక్కువ 1500 రూపాయలన్నా ఎక్కువగా ఉండల’న్నారు. ‘కనీస మద్దతు ధరను నిర్ణయించేది కేంద్రప్రభుత్వమే అయినా రాష్ట్రం తనవంతుగా మరికొంత మార్జిన్ ధరను కలిసి కనీస మద్దతు ధరను పెంచాల’ని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
పత్తి వైపు మళ్ళుతున్నారు : గొల్ల లక్ష్మణ్
కందులకు తాము ఆశించినంత ధరలు రాకపోవటంతో కొందరు రైతులు పత్తిసాగువైపు మళ్ళుతున్నట్లు గొల్ల లక్ష్మణ్ చెప్పారు. ఆరునెలలు కష్టపడి పండించిన కందులకు ధరలు రానపుడు రైతులు మాత్రం చేయగలిగేది ఏముంటుందని ప్రశ్నించారు. తమ సమస్యలను ఎన్నిసార్లు చెప్పుకున్నా ఏ ప్రభుత్వమూ పట్టించుకోవటంలేదన్నారు. కందులకన్నా పత్తిపంటకు కనీస మద్దతుధర ఎక్కువగా ఉంటోంది కాబట్టే రైతులు పత్తిసాగు వైపు మొగ్గుచూపుతున్నట్లు లక్ష్మణ్ తెలిపారు.
ధర రు. 10 వేలుండాలి : విజయనిర్మల
‘తాండూరు కందులకు కనీస మద్దతు ధర రు. 10 వేలుండాల’ని విజయనిర్మల చెప్పారు. ఈమె 2014లో ఉత్తమ రైతు అవార్డును కూడా అందుకున్నారు. కందుల దిగుబడి పెంచటంలో చేసిన కొత్త పద్దతుల కారణంగా ఉత్తమ రైతు అవార్డు అందుకున్నారు. నర్సరీల్లో కందుల విత్తనలు చల్లి, మొక్కలొచ్చిన తర్వాత వాటిని పొలాల్లో నాటి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అదనపు దిగుబడిని విజయనిర్మల సాధించారు. ‘అప్పటివరకు తమ పొలంలో పండుతున్న 4 క్వింటాళ్ళ కందులకుబదులు 8 క్వింటాళ్ళ దిగుబడిని అదనంగా సాధించాన’ని విజయనిర్మల చెప్పారు. ‘నేరుగా పొలంలో పండించే కందులకన్నా నర్సరీల్లో విత్తనాలు నాటి మొలకలైన తర్వాత కూడా 45 రోజులుంచి వాటిని పొలాల్లో నాటితే ఎక్కువ దిగుబడి సాధించినట్లు’ ఉత్తమ రైతు చెప్పారు. ‘మిగిలిన ప్రాంతాల్లో పండించే కందులతో సమానంగా కాకుండా తాండూరు కందులను ప్రభుత్వం ప్రత్యేకంగా సేకరించాల’న్నారు. అలాగే కనీసమద్దతు ధర తాండూరు కందులకు రు. 10 ఉండాలని డిమాండ్ చేశారు.
పత్తికి గ్యారెంటీ ఉంది : కన్నెగంటి
కందిరైతులకు ఆదాయం లేదని వ్యవసాయ నిపుణుడు కన్నెగంటి రవి చెప్పారు. ‘ఎకరానికి 4 క్వింటాళ్లు సగటు దిగుబడి వస్తోంద’ని చెప్పారు. ‘ప్రభుత్వం పంటను పూర్తిగా సేకరించడంలేదని, కేంద్ర ప్రభుత్వం ఎంత సేకరిస్తే అంతే అన్నట్లుగా ఇపుడు పరిస్ధితి ఉంద’ని ఆవేధన వ్యక్తంచేశారు. ‘పత్తిలో కనీస ఆదాయానికి గ్యారంటీ ఉంది కాబట్టే రైతులు కందుల సాగు నుండి పత్తిపంట వైపు మొగ్గుచూపుతున్న’ట్లు రవి చెప్పారు. ఇంటి పేరు ఎంత గొప్పది అని కాదు, దానివల్ల వాళ్ళ జీవనోపాధి మెరుగు పడిందా లేదా అన్నది ముఖ్యమని కన్నెగంటి రవి అభిప్రాయపడ్డారు.