ఉన్నవాటికే దిక్కులేదు.. మళ్ళీ కొత్త పాఠశాలలా..!

నిధులను వేరే అవసరాలకు వాడాలని ప్రభుత్వం భావించిందా? లేదా వాడేసిందా?;

Update: 2025-06-14 08:00 GMT

ఉట్టికి ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతా.. అన్నట్లు ఉంది విద్యారంగం విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరి. ఉన్న గురుకులాలను సవ్యంగా నడిపించడానికే నానా అవస్థలు పడుతుంటే తాజాగా సీఎం కొత్త పాఠశాలలను ప్రారంభించారు. ‘మీ పాఠశాలలు మా భవనాల్లో వద్దు.. మా అద్దె మాకు ఇచ్చి వెళ్లిరండి సామీ’ అంటూ భవనాల యజమానులు దండాలు పెడుతున్నారు. అయినా బకాయిలు చెల్లించే పరిస్థితి ఇప్పుడప్పుడే కనిపిస్తలేదు. అలా చేసే అనేక మైనార్టీ గురుకులాలకు తాళాలు వేసే వరకు వచ్చింది. చివరకు కొంత నిధులను విడుదల చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.. కానీ ఎలాగూ విడుదల చేసే నిధులను తాళాలు పడకముందే ఎందుకు చేయలేదు? ఆ నిధులను వేరే అవసరాలకు వాడాలని ప్రభుత్వం భావించిందా? లేదా వాడేసిందా? చిన్నారులకు అందించాల్సిన విద్య కన్నా ఇంపార్టెంట్ అంశం ఏముంది? ఏదైనా ప్రాజెక్ట్ కాస్తంత ఆలస్యమైతే వచ్చే నష్టం ఏముంటుంది? అదే ఒక విద్యార్థికి చదువు ఆలస్యం అయితే ఆ లోటు జీవితాంతం పూడ్చలేకుండా మిగిలిపోతుంది కదా? ఇలా ప్రజల్లో అనేక ప్రశ్నలు మెదులుతున్నాయి. సరే ఇది పక్కనబెడితే అద్దెలు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొత్త పాఠశాలలు ప్రారంభించడం ఏంటి? అన్న ప్రశ్న కూడా ఉద్భవిస్తోంది.

గురుకులాల పరిస్థితి ఇది..!

వేసవి సెలవులు ముగిసిన అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులు అంతా తిరిగి బడిబాట పట్టారు. కొత్త విషయాలు నేర్పించాలని టీచర్లు, కొత్తగా నేర్చుకుందామని విద్యార్థులు ఉత్సాహంగా వస్తే.. వారికి తాళాలు వేసిన గురుకులాలు దర్శనం ఇచ్చాయి. దీంతో వారంతా గేటు బయటే నిలబడి ఏం అర్థంకాక బిక్కచూపులు చూసుకున్నారు. అసలు విషయం తెలిసిన తర్వాత తిరిగి ఇంటిబాట పట్టారు. అయితే 10 నెలలుగా ప్రభుత్వం అద్దె బిల్లులు చెల్లించనందుకే తాళాలు వేసినట్లు భవన యజమానులు తెలిపారు. ఈ బిల్లుల మొత్తం రూ.215 కోట్లుగా ఉంది. అంటే ప్రతి నెలా ప్రభుత్వం సుమారు రూ.20కోట్ల అద్దె చెల్లించాలి. కొన్ని నెలల క్రితమే అద్దె బకాయిల గురించి గురుకులాల భవన యాజమాన్యాలు ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశాయి. కొన్ని ప్రాంతాల్లో తాళాలు వేశారు, మరికొన్ని చోట్లు పెద్దపెద్ద ఫ్లెక్సీలు కూడా కట్టారు. దాదాపు 63 గురుకులాలను ఖాళీ చేయాలని నోటీసులు కూడా ఇచ్చారు. ఇప్పుడు తాళాలు వేశారు. భవన యజమానుల్లో చాలా మంది బకాయి వచ్చేవరకు తాళాలు తీయమని తేల్చి చెప్పారు. ఇంకొందరు అసలు తాళాలు తీసుడు కాదు.. మీరు ఇప్పటికిప్పుడే ఖాళీ చేయండి అని పట్టుబట్టారు.

రాష్ట్రంలో మొత్తం 1,023 గురుకుల పాఠశాలలు ఉంటే వాటిలో 662 పాఠశాలలను అద్దె భవనాల్లోనే కొనసాగిస్తున్నారు. విద్యాశాఖ పరిధిలోని జనరల్ గురుకులాలు మాత్రం శాశ్వత భవనాల్లో ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన దాదాపు 662 గురుకులాల అద్దెభవనాల్లోనే కొనసాగుతున్నాయి. తాళాలు వేయడంతో మేల్కొన్న ప్రభుత్వం ఎస్, ఎస్టీ, బీసీ గురుకులాల కోసం 3-4 నెలల బకాయిలకు ఆగమేగాలపై నిధులు విడుదల చేసింది. మిగిలిన బిల్లులను జూలై చివరిలోపు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితులు ఉంటే ఉన్నవాటిని సరిచేయాల్సింది పోయి.. తాళాలు వేసిన మరుసటి రోజే సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా 571 పాఠశాలలను ప్రారంభించడం విచిత్రంగా ఉంది.

ఎంత ఖర్చయినా పర్లేదు: రేవంత్

తెలంగాణలో పిల్లలకు అందించే విద్య ప్రమాణాలను మరింత పెరుగుపరచాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా విద్యను అందించాలని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడం అందుకు తొలిమెట్టు అని పేర్కొన్నారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో విద్యా ప్ర‌మాణాల పెంపే త‌మ ల‌క్ష్య‌మ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌తి విద్యార్థికి నాణ్య‌మైన విద్య అందాల‌ని... ఇందుకు అవ‌స‌ర‌మైన మౌలిక వ‌స‌తులు, ఉపాధ్యాయుల‌కు శిక్ష‌ణ‌, ఇత‌ర స‌దుపాయాల క‌ల్ప‌నకు ఎంత వ్య‌య‌మైనా వెనుకాడేది లేద‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలో 20 మంది కన్నా ఎక్కువ పిల్ల‌లున్న గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఈ ఏడాది కొత్తగా 571 పాఠ‌శాల‌లు ప్రారంభిస్తున్నామ‌ని సీఎం వెల్ల‌డించారు. పాఠ‌శాల‌లు పునః ప్రారంభ‌మైన నేప‌థ్యంలో ఐసీసీసీలో విద్యా శాఖ అధికారుల‌తో సీఎం సమీక్షించారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చేరిన ప్ర‌తి విద్యార్థికి నాణ్య‌మైన విద్య అందేలా వ్య‌వ‌స్థ‌ను తీర్చిదిద్దాల‌ని సీఎం ఆదేశించారు.

ఒక్కో స్కూల్‌కు రూ.100కోట్లపైనే ఖర్చు..!

రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మించడానికి ప్రభుత్వం ఒకవైపు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వీటికి సంబంధించి అనేక వివరాలను గతంలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క షేర్ చేసుకున్నారు. తమ ప్రభుత్వం అన్ని నియోజకవర్గాల్లో రూ.125 కోట్ల నుంచి రూ.150 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తుందని, వీటిలో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య, సౌకర్యాలు కల్పించనున్నామని చెప్పారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పారు. అదే విధంగా 11 అక్టోబర్ 2024న హుస్నాబాద్ నియోజకవర్గం, కోహెడ్ మండలం, తంగలపల్లి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు భూమి పూజ చేసిన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 25వేల పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం రూ.1100 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ‘‘రాష్ట్రంలో ఇంటిగేట్రెడ్ పాఠశాలల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.5వేల కోట్లు వెచ్చించనుంది. దీని ప్రకారం ఒక్కో పాఠశాల నిర్మాణ నిర్వహణల కోసం రూ.180 కోట్లు అందించనుంది ప్రభుత్వం. గురుకులాల్లో ఉన్న అన్ని బకాయిలను కూడా అతి త్వరలో చెల్లించనున్నాం. ముందుగా మెస్ బకాయిలు, ఆ తర్వాత అద్దె అకాయిలు ఇస్తాం’’అని ఆయన వెల్లడించారు. ఈ పాఠశాలలను వచ్చే విద్యాసంవత్సరానికి పూర్తి చేస్తామని చదవుకునేలా విద్యార్థులను ప్రోత్సహించే వాతావరణాన్ని కూడా కల్పించనున్నట్లు చెప్పారు పొన్నం ప్రభాకర్.

గురుకులాల్లోని అన్ని బకాయిలు చెల్లిస్తామని ఆయన చెప్పి ఎనిమిది నెలలు దాటినా ఇప్పటికీ బకాయిలు చెల్లించలేదు. అందువల్లే గురుకులాలకు తాళాలు కూడా వేశారు. అయితే ప్రతి నియోజకవర్గంలో నిర్మించే ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు రూ.100కోట్లకు పైనే ఖర్చు చేయాలనుకుంటున్న ప్రభుత్వం గురుకులాల అద్దెలను ఎలా విస్మరించింది. నిజంగానే మర్చిపోయిందా? కావాలనే ఆపిందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

ఖాజానా ఖాళీ అని చూపడానికా..!

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏం ప్రశ్నించినా గత ప్రభుత్వం చేతకాని తనమే కారణమని చెప్తుంది. ఖాజానా ఖాళీ చేసి బీఆర్ఎస్ సర్కార్ చేతులు దులుపుకుందని ఆరోపిస్తోంది. సంక్షేమ పథకాలను అమలు చేయడానికి కూడా సరైన నిధులు లేవని మంత్రులు, సీఎం సైతం అనేక సమావేశాల్లో, సభల్లో చెప్పారు. కానీ కనీసం పిల్లలకు చదువును అందించే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేదని మాత్రం ఎవరూ ఊహించలేదు. అద్దెలు చెల్లించలేక గురుకులాలకు తాళాలు వేయడం జరిగిందంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇదంతా కూడా కాంగ్రెస్ సర్కార్ ప్లాన్ అన్న వాదన కూడా వినిపిస్తోంది. అధికారంలోకి వచ్చి 18 నెలలు నిండినా ఇప్పటికి కూడా 662 గురుకులాలు అద్దె భవనాల్లోనే ఎందుకు నడుస్తున్నాయి? వాటికి శాశ్వత భవనాలు ఎందుకు లేవు? వాటిలో మెజారీ గురుకులాలలు మైనార్టీ సామాజిక వర్గాలవే ఎందుకు ఉన్నాయి? ఇలా విశ్లేషకులు అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. అదే విధంగా గత ప్రభుత్వం ఖాజానాను ఖాళీ చేసింది, ప్రస్తుతం ఖజానాలో ఏం లేదు అని నిరూపించాలన్న ప్రయత్నంలోనే ప్రభుత్వం ఈ బిల్లులను పది నెలలుగా ఆపిందని కూడా అభిప్రాయపడుతున్నారు.

నిజంగా అదే పరిస్థితి అయితే.. ఉన్న విషయాన్ని చెప్పి పలానా సంక్షేమ పథకం అమలును వాయిదా వేస్తున్నాం.. ఆ డబ్బును గురుకులాల అద్దెకు వాడుతున్నామని చెప్తే ప్రజలు కాదనరన్న విషయాన్ని ప్రభుత్వం ఎందుకు గుర్తించడం లేదు? అసలు ఆ దిశగా ఆలోచన చేసిందా? ఏకాడికి తమ ఓటు బ్యాంకును పెంచుకోవడం కోసం ఓటు పడే, వేసే వారికి అందించే సంక్షేమ పథకాలపైనే ఖర్చు చేస్తుందా ఈ ప్రభుత్వం? అని ప్రశ్నలు సంధిస్తున్నారు.

ఇప్పటికైనా కళ్లు తెరవాలి..

గురుకులాలకు తాళలు పడటం అనేది చాలా దారుణమైన పరిస్థితి. ఇలాంటివి మరోసారి పునరావృత్తం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది బహిర్గతం చేస్తే ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలను పంపడానికి తల్లిదండ్రులు ఆలోచనలో పడరు. ఇలాంటివి మళ్ళీమళ్ళీ జరిగితే కొన్నాళ్లు పోతే ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పుడున్నంత మంది విద్యార్థులు కూడా కనిపించకపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని విశ్లేషకులు అంటున్నారు.

Tags:    

Similar News