కంచ గచ్చిబౌలి భూముల వివాదం.. కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
కంచె గచ్చిబౌలి భూముల వివాదాన్ని పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం నిశ్చయించుకుంది. ఈ మేరకు ముగ్గురు మంత్రులతో కమిటీని నియమిచింది. ఈ కమిటీలో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ ఉన్నారు. వారు హెచ్సీయూ ఎగ్జిక్యూటివ్ కమిటీ, జేఏసీ అండ్ సివిల్ సొసైటీ సంఘాలు, విద్యార్థి సంఘాల నేతలు, భాగస్వాములైన వారితో చర్చించనున్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకించారు. ఈ 400 ఎకరాల భూమిని ప్రభుత్వం టీజీఐఐసీకి అప్పగించింది. దీంతో ఆ భూముల్లో టీజీఐఐసీ అభివృద్ధి పనులను చేపట్టింది. వీటికి వ్యతిరేకంగా హెచ్సీయూ విద్యార్థులు తీవ్ర ఆందోళనలు చేపట్టారు. ఈ భూములు వర్సిటీవి కావని, ప్రభుత్వానివేనని టీజీఐఐసీ వాళ్లు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. కానీ ఈ వివాదం రోజురోజుకు ముదురుతోంది. సుప్రీంకోర్టు వరకు కూడా చేరింది. సుప్రీంకోర్టు, హైకోర్టులలో ఈ వివాదంపై విచారణ నడుస్తోంది. ఈ నేపథ్యంలో కమిటీ ఏర్పాటు చేసి ఈ వివాదాన్ని పరిష్కరించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది.
అదే విధంగా ఈ భూములను అటవీ భూమిగా కూడా ఏనాడూ వర్గీకరించలేదని తెలిపారు. ‘‘ఈ భూమి ఎప్పుడూ హెచ్సీయూలో అంతర్భాగం కాదు. గతంలో ఉన్న వివాదంపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. టీజీఐఐసీ అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఆ భూమిని సదరు సంస్థకు కేటాయించింది. పూర్తిగా ప్రభుత్వానికి చెందిన ఈ భూమిలో భారీ పెట్టుబడులకు అవకాశం ఉంది. ఈ అభివృద్ధి వల్ల 5 లక్షల వరకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి’’ అని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రభుత్వం వివరణ ఇచ్చినప్పటికీ ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే హెచ్సీయూ విద్యార్థులతో కలిసి వట ఫౌండేషన్.. హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. గురువారం సుప్రీంకోర్టు కూడా ఈ భూముల్లో చేపట్టిన చెట్ల నరికివేతపై విచారణ జరిగింది. తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ నుంచి నివేదిక తెప్పించుకుని పరిశీలించింది. అనంతరం అటవీ భూమి కాకపోయినా.. భారీ మొత్తంలో చెట్లు నరికేయాలంటే సీఎస్ నుంచి అనుమతి తీసుకోవాలని, గచ్చిబౌలి భూముల్లో జరుగుతున్న పనులకు సీఎస్ నుంచి అన్ని అనుమతులు వచ్చాయా? అని ప్రశ్నించింది. తదుపరి ఆదేశాల వరకు ఆ భూముల్లో ఎటువంటి పనులు చేపట్టొద్దని ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆరు నెలల్లోనే నివేదిక అందించాలని కూడా అత్యున్నతన్యాయస్థానం ఆదేశించింది. ఈ క్రమంలోనే ఈ వివాదాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.