బాలికల రక్షణపై మంత్రి సీతక్క స్పెషల్ ఫోకస్..
త్వరలో ప్రత్యేక కమిటీకి ప్రణాళికలు రెడీ. బాలికలతో స్నేహ కమిటీలను ఏర్పాటు చేస్తాం.;
రాష్ట్రంలో మహిళలు, బాలికలు, శిశువుల సంక్షేమంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ఇందుకోసం కొత్త ఆలోచనలకు మేధోమధన సద్దస్సు నిర్వహిస్తున్నారు. రెండు రోజులుగా జరుగుతున్న ఈ సదస్సులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో మంత్రి సీతక్క కూడా పాల్గొన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇలాంటి సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాల స్థాయిలో ఇలాంటి సదస్సులు నిర్వహించడం ద్వారా అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చని చెప్పారు. ఈ సదస్సులో మహిళా, శిశు సంక్షేమంపై పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, మేధావులు అనేక సూచనలు చేశారని చెప్పారు. అతి త్వరలోనే మహిళా శిశు సంక్షేమం కోసం నిపుణులతో ఒక అడ్వైజరీ కమిటీని నియమిస్తామని చెప్పారు. వారి సలహాలు సూచనలతో శాఖ ద్వారా అందుతున్న సేవలను మరింత పటిష్టం చేస్తామని తెలిపారు.
అనేక ప్రాంతాల్లో ముళ్ల పొదల్లో, చెత్తకుప్పల్లో శిశువులు లభిస్తున్నాయని గుర్తు చేశారు. చీమలు కుట్టి, కుక్కలు కరిచి, ముళ్లు గుచ్చుకుని ఇన్ఫెక్షన్లు వచ్చి శిశువులు ప్రాణాలు కోల్పోతున్నారని, దీనిని నివారించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తెలంగాణ ఏర్పాటై పదేళ్లు అయినా ఇప్పటికీ బాల్య వివాహ నిరోధక చట్టం నిబంధనలను అవలంబించకపోవడం బాధాకరమన్నారు. త్వరలోనే వీటిని అవలంబించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఆకాశాన్ని చీల్చుకొని అమ్మాయిలు అంతరిక్షానికి వెళ్లినా భూమి మీద కొన్నిసార్లు రక్షణ కరువవుతుందన్నారు. అందుకే అమ్మాయిల స్వీయ రక్షణ కోసం బాలికా రక్షక టీంలను ఏర్పాటు చేస్తామన్నారు. అమ్మాయిలను వేధిస్తే సంఘ బహిష్కరణకు గురవుతారని హెచ్చరించారు. అమ్మాయిలను ముట్టుకుంటే కఠిన శిక్షలు తప్పవన్నారు. అమ్మాయిల పట్ల చెడుగా ప్రవర్తిస్తే ఇలాంటి శిక్షలు అనుభవించాల్సి వస్తుందో అబ్బాయిలకు అవగాహన కల్పించాలని మంత్రి సీతక్క వెల్లడించారు.