రేవంత్ను నమ్మినందుకు చేతికి చిప్పొచ్చింది: కేటీఆర్
ఒక్కసారి మోసమోతే అది మోసగాడి తప్పు. కానీ పదేపదే మోసపోతే అది మన తప్పు అవుతుందని కేటీఆర్ అన్నారు.;
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. రేవంత్ లాంటి మోసగాడిని నమ్మినందుకు రాష్ట్రం ఏడుస్తుందన్నారు. రేవంత్ లాంటి మోసపూరిత, చేతకాని నేత వల్ల రాష్ట్రానికి మిగిలింది చిప్పే అంటూ విమర్శలు గుప్పించారు. మల్కాజ్గిరిలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన రేవంత్ రెడ్డి, ఆయన పాలనపై విమర్శలు గుప్పించారు. ‘‘ఒక్కసారి మోసమోతే అది మోసగాడి తప్పు. కానీ పదేపదే మోసపోతే అది మన తప్పు అవుతుంది. కాబట్టి ఈసారి ఎలాంటి ఎన్నికల వచ్చినా కాంగ్రెస్ను తిప్పికొట్టాలి’’ అని ప్రజలను కోరారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన అబద్ధపు వాగ్దానలు, అసంబద్ధ హామీల వల్ల ప్రజలు ఇప్పుడు సంక్షోభంలో పడిపోయారని అన్నారు కేటీఆర్.
కాంగ్రెస్కు గుణపాఠం చెప్పండి..
రాష్ట్రం మొత్తం దారుణంగా వెనుకబడుతున్నా, ఒక్క రేవంత్ రెడ్డీయే ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ‘‘ఒకే తప్పును మళ్లీ చేయొద్దు. GHMCతో పాటు రానున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ను తిరస్కరించండి. రెవంత్ పాలన వలన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలే అసంతృప్తిగా ఉన్నారు. ఇక ప్రజల పరిస్థితి చెప్పనవసరం లేదు. ఇది వాళ్ల విఫల పాలన ఫలితమే’’ అని అన్నారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ప్రజల మధ్య తిరుగుతూ సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేస్తారని కేటీఆర్ ప్రశంసించారు. ‘‘డంపింగ్ యార్డ్ వంటి కీలక సమస్యలపై పోరాడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంచి నాయకుడిని గెలిపిస్తే, మంచి మార్పు సాధ్యమవుతుందని ఆయన నిరూపించారు’’ అన్నారు.
కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధిచెప్పాలి
ఎన్నిక ఏదైనా, సందర్భం ఏదైనా – ఈసారి ప్రజలు కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఆత్మ, తెలంగాణ స్వభిమానం కాపాడాలంటే, భరోసా నలుగురికీ కలిగించగల పార్టీ ఒక్కటే ఉందని, అదే బీఆర్ఎస్ అని పేర్కొన్నారు. అనంతరం సిల్వర్ జూబ్లీ ఉత్సవాల విజయవంతానికి కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘‘ఈ నెల 27న పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందాం. ఒక పార్టీగా 25 సంవత్సరాల ప్రయాణం ఎలాంటి మైలురాయో ప్రతి కార్యకర్తకు అర్థమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇది రెండవ ఘనత సాధించిన పార్టీగా మన గర్వం’’ అని కేటీఆర్ తెలిపారు.