‘కొడంగల్ అభివృద్ధి నా బాధ్యత’
కొడంగల్ను 16 నెలల్లో అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.
కొండగల్ను కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు సోమవారం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పలు కీలక అంశాలను లేవనెత్తారు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్కు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యాత ఇస్తుందని చెప్పారు. అదే విధంగా మహిళలను అన్ని రంగాల్లో ఆర్థిక సాధికారత సాధించేలా చేస్తామన్నారు. ఇప్పటికే వారి సాధికారత కోసం తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, రానున్న రోజుల్లో మరిన్ని తీసుకుంటుందని అన్నారు. ఎడ్యుకేషన్ విషయంలో తమ ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు, వారు ఆరోగ్యంగా ఉండటానికి పోషకాలు నిండిన ఆహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే మధ్యాహ్న భోజన పథకంలో చికెన్, మటన్తో పాటు చేపను కూడా యాడ్ చేశామని అన్నారు.
‘‘ఆడబిడ్డలు సంతోషంగా ఉంటేనే ఆ రాష్ట్రంలో ఆర్ధిక అభివృద్ధి ఉంటుంది. ఆడబిడ్డల ఆత్మగౌరవంతో బ్రతికేలా ఉండాలని ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ప్రతీ పేద తల్లి కళ్లల్లో ఆనందం చూడాలని సన్నబియ్యం పంపిణీ చేపట్టాం. రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం.. వారిని ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశాం. అదానీ అంబానీలతో పోటీ పడేలా సోలార్ ప్లాంట్స్ నిర్వహణ మహిళలకు అప్పగించాం. మహిళలకు ఆర్ధిక స్వాతంత్ర్యం కల్పించాం. హైటెక్ సిటీ శిల్పారామంలో మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు స్టాల్స్ ఏర్పాటు చేశాం’’ అని తెలిపారు.
‘‘ఆడబిడ్డలు తయారు చేసిన ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్ లో అమ్ముకునేందుకు అమెజాన్ తో సంప్రదింపులు జరుపుతున్నాం. మీ జీవితాల్లో వెలుగులు నింపేందుకు మంచి చదువు అందించడం ఒక్కటే మార్గం. మీ పిల్లలు గొప్పగా చదువుకుంటేనే మీ జీవితాల్లో మార్పు సాధ్యమవుతుంది. అందుకే అక్షయ పాత్ర ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 312 ప్రభుత్వ పాఠశాలల్లో 28 వేల మంది విద్యార్థులకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్నాం. ఏ విద్యార్థి కూడా ఆకలితో ఇబ్బంది పడకుండా చేస్తున్నాం’’ అని వెల్లడించారు.
‘‘సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా మధ్యాహ్న భోజనాన్ని అందించే కార్యక్రమం తీసుకున్నాం. బిడ్డల గురించి కన్నతల్లి ఆలోచించినట్లుగా… మా ప్రభుత్వం ఆలోచించి వారి ఆకలి తీరుస్తోంది. ఎడ్యుకేషన్, ఇరిగేషన్ మా మొదటి ప్రాధాన్యత. కొడంగల్ నియోజకవర్గానికి మెడికల్, వెటర్నరీ, అగ్రి, పారామెడికల్, నర్సింగ్, ఇంజనీరింగ్ కళాశాలలు , ఏటీసీలను, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్, డిగ్రీ కళాశాలలు, సైనిక్ స్కూల్ తీసుకొచ్చాం. విద్య ఒక్కటే తరగని ఆస్తి’’ అని అన్నారు.
‘‘రాష్ట్ర నలుమూలల నుంచి గొప్ప చదువులకోసం కొడంగల్ కు వెళ్లాలి అనేలా కొడంగల్ ను ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతున్నాం. 16 నెలల్లో అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషన్ హబ్ గా కొడంగల్ ను మార్చాలని ప్రయత్నిస్తున్నాం. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నారు. మూడేళ్లల్లో ప్రాజెక్టు పూర్తి చేసి కొడంగల్ భూములు కృష్ణా జలాలతో తడుపుతాం. లగచర్ల పారిశ్రామిక వాడను అంతర్జాతీయ పారిశ్రామిక వాడగా తీర్చి దిద్దుతాం. త్వరలోనే కొడంగల్ ప్రజలు రైలు కూత వినబోతున్నారు’’ అని పేర్కొన్నారు.
‘‘కొడంగల్ ప్రజల డెబ్బై ఏళ్ల కల నెరవేరబోతుంది. మరో తొమ్మిది నెలల్లో రైల్వే లైన్ ఏర్పాటు పనులు మొదలు కాబోతున్నాయి. కొడంగల్ నియోజకవర్గంలో సిమెంట్ పరిశ్రమలు ఏర్పాటు చేసుకోబోతున్నాం. అభివృద్ధిలో కొడంగల్ నియోజకవర్గాన్ని రాష్ట్రానికి ఒక మోడల్ గా మారుస్తాం. సర్పంచ్ ఎన్నికల్లో మంచి వ్యక్తులను ఎన్నుకోండి. ఆడబిడ్డలకు ప్రభుత్వం అందిస్తున్న సారె ఇందిరమ్మ చీరలు. అధికారులు ప్రతీ ఆడబిడ్డకు చీర చేరేలా చూడాలి. పదేళ్లు రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం అధికారంలో ఉంటుంది’’ అని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా కొడంగల్ ను అభివృద్ధి చేసుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అభివృద్ధికి మా ఆడబిడ్డలు అండగా ఉండాలని కోరారు.