అడ్రస్ లేని లేడీ అమితాబ్ ?

తొందరలోనే ఆమెకు సినిమా జీవితంవేరు నిజజీవితం వేరని అర్ధమైపోయింది. సినిమాల్లో ప్రత్యర్దులను దుమ్మురేపిన విజయశాంతి రాజకీయాల్లో మట్టికరిచారనే చెప్పాలి.

Update: 2024-04-21 05:44 GMT
Congress leader Vijaya santhi

పోలీసు అధికారిగా సంఘవిద్రోహుల ఆటకట్టించారు. కాలేజీ లెక్షిరర్ గా పెడదోవ పడుతున్న యువత మనసును మార్చారు. ఎంఎల్ఏగా సమాజహితం కోసం ఎన్నోమంచి పనులు చేశారు. ఇవన్నీ ఎవరిగురించి ? ఎక్కడ జరిగిందని అనుకుంటున్నారా ? సినిమాల్లో లేడీ అమితాబచ్చన్ అనిపించుకున్న ఫైల్ బ్రాండ్ విజయశాంతి గురించే. పై పాత్రలన్నీ సినిమాలో విజయశాంతి వేసినవే. తనకొచ్చిన ఇమేజితో సినిమా జీవితం నుండి రాజకీయాల వైపు వచ్చి ఇక్కడ కూడా దుమ్ముదులిపేయాలని అనుకున్నారు. అయితే తొందరలోనే ఆమెకు సినిమా జీవితంవేరు నిజజీవితం వేరని అర్ధమైపోయింది. సినిమాల్లో ప్రత్యర్దులను దుమ్మురేపిన విజయశాంతి రాజకీయాల్లో మట్టికరిచారనే చెప్పాలి.

ఇంతకీ విషయం ఏమిటంటే మూడు ప్రదాన పార్టీల మధ్య హోరాహోరీగా జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో విజయశాంతి ఊసే కనబడటంలేదు, గొంతు వినబడటంలేదు. ఏమైందా అని విచారిస్తే ప్రచారంలో ఎక్కడా కనబడటంలేదని అర్ధమైంది. బీజేపీ మీద అసంతృప్తితో ఈమధ్యనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫైర్ బ్రాండ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హస్తంపార్టీలో చేరిన రెండుమూడురోజులు వార్తల్లో వ్యక్తిగా నిలిచారు కాని తర్వాత మాయమైపోయారు. ఆమె పార్టీలోనే ఉన్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కారణం ఏమిటంటే బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్ధుల తరపున పార్టీ అధినేతలు, పెద్దలు ఉధృతంగా బహిరంగసభలు, రోడ్డుషోలు, ర్యాలీలు, కార్నర్ మీటింగుల్లో పాల్గొంటున్నారు. మరి తనకు స్టార్ డమ్ ఉందని భావిస్తున్న విజయశాంతి మాత్రం ఇప్పటివరకు ఒక్కరంటే ఒక్క అభ్యర్ధి తరపున ఎక్కడా ప్రచారంలో పాల్గొనలేదు. పార్టీ పెద్దలు ఆమెను పట్టించుకోవటంలేదా ? ప్రచారం చేయమని అడగలేదా ? లేదా అడిగినా ఆమే అలిగి ప్రచారానికి దూరంగా ఉంటున్నారా అన్నదే తెలీదు.

సినిమాల్లో నుండి వచ్చినవారితో ఒక సమస్యుంటుంది. అదేమిటంటే రాజకీయ వేదికలపై తమకు పెద్దపీట వేయాలని బలంగా కోరుకుంటారు. వీళ్ళకి సినిమా గ్లామర్ తప్ప మరో అర్హత ఏమీ ఉండకపోయినా తమను అందరు గుర్తించి ప్రాధాన్యతివ్వాలని అనుకుంటారు. అయితే సినిమాల్లో జరిగినట్లే రాజకీయాల్లో జరగవని అర్ధమయ్యేటప్పటికి రాజకీయాల్లో కూడా మరుగనపడిపోతారు. ఇపుడు విజయశాంతి విషయంలో జరుగుతున్నదిదే. సినిమాల్లో నుండి రాజకీయాల్లోకి రాగానే తల్లి తెలంగాణా అనే పార్టీ పెట్టారు. ఆ పార్టీని ఎవరు పట్టించుకోకపోవటంతో టీఆర్ఎస్ లో విలీనంచేసి కేసీయార్ ఆశీస్సులతో 2009 ఎన్నికల్లో మెదక్ ఎంపీగా పోటీచేసి గెలిచారు. తర్వాత కేసీయార్ తో విభేదించి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో మెదక్ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్ధిగా పోటీచేసి ఓడిపోయారు. ఇక్కడితో ఆమె ఎన్నికల జీవితం ముగిసింది.

ఆ తర్వాత కాంగ్రెస్ లో నుండి బీజేపీలోకి వెళ్ళారు. అక్కడ ఇమడలేక మళ్ళీ కాంగ్రెస్ లో చేరారు. సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన ఈమెను రాజకీయాల్లో ఏ పార్టీ కూడా పెద్దగా పట్టించుకోలేదు. పార్టీలనుండి ఆమె ఆశిస్తున్న ప్రాధాన్యత ఆకాశమంత ఎత్తున ఉంటే పార్టీలు ఇస్తున్న ప్రాధాన్యత భూమిపైనే ఉండిపోయింది. రాజకీయాల్లో ఎవరూ ఎవరికీ ప్రాధాన్యత ఇవ్వరని ఎవరికి వాళ్ళుగా తామే అవకాశాలను సృష్టించుకుని ఎదగాలన్న సూత్రాన్ని విజయశాంతికి వంటపట్టలేదో లేకపోతే మరచిపోయారో తెలీదు.

బీజేపీలో నుండి కాంగ్రెస్ లోకి చేరేటపుడు మెదక్ ఎంపీగా టికెట్ హామీతోనే పార్టీలో చేరినట్లు అప్పట్లో బాగా ప్రచారమైంది. తీరా ఇపుడు మెదక్ సీటులో నీలం మధు పోటీచేస్తున్నారు. ఈ విషయంలో కూడా లేడీ సూపర్ స్టార్ బాగా హర్టయ్యారని సమాచారం. టికెట్ ఇవ్వకపోవటం లాంటి అనేక కారణాలతో పార్టీపైన అలిగి ప్రచారంలో ఎక్కడా కనబడటంలేదని పార్టీలో చెప్పుకుంటున్నారు. లేడీ అమితాబ్ కే కాంగ్రెస్ లో దిక్కులేకపోతే ఇక మరో స్టార్ దివ్యవాణిని ఎవరు పట్టించుకుంటారు. విజయశాంతి లేదా దివ్వవాణిని చూసి జనాలు ఓట్లేయరన్నది వాస్తవం. ప్రభుత్వ పనితీరు, అభ్యర్ధులు, నేతల ఎలక్షీనీరింగ్ వల్లే సభలకు జనాలు రావటం, ఓట్లేయటం ఆధారపడుంటుంది. ఈ విషయాలు అర్ధంకాక వచ్చిన జనాలంతా తమను చూడటానికే వచ్చారనే భ్రమల్లో సినీతారలు ఉంటారు. ఇక్కడే భ్రమలకు, వాస్తవానికి లింకు కుదరటంలేదు. మరి లేడీ అమితాబ్ బచ్చన్ మనసులో ఏముందో చూడాలి.

Tags:    

Similar News