తెలంగాణ చాణక్యుడి లెక్క ఎక్కడ తప్పింది?
అప్పట్లో ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకున్న కేసీఆర్;
By : Chepyala Praveen
Update: 2025-05-28 09:03 GMT
బీఆర్ఎస్ ఉరఫ్ టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఎటూచూసిన కష్టాలే. 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర ఓటమితో పార్టీలో సంక్షోభం ప్రారంభం అయింది.
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్ట్ పై వేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ. మరో వైపు కుమారుడిపై ఏసీబీ కేసు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు, ఇప్పుడు కొత్తగా కుమార్తె కవిత సంధించిన లేఖాస్త్రంతో పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
అయితే గులాబీ పార్టీకి సంక్షోభాలు కొత్తకాదు. పార్టీ పని అయిపోయింది.. బలం లేదు అన్నుకున్న ప్రతిసారి అది గోడకు కొట్టిన బంతిలా లేచి నిలబడి తన సత్తాను చాటుకుంది.
పార్టీ చరిత్రను చూస్తే ఈ విషయం చాలా స్ఫష్టంగా అర్థమవుతుంది. సంక్షోభాలను దాటి వాటిని అవకాశాలుగా మలుచుకోవడంలో కేసీఆర్ కు తిరగులేదని చరిత్ర చెబుతోంది.
డిపాజిట్లు వస్తాయా అనుకుంటే..
కేసీఆర్ 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీని హైదరాబాద్ లో స్థాపించారు. మే 17న కరీంనగర్ లో సింహగర్జన పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించి తన సత్తాను చాటాడు. అదే సమయంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో పార్టీ అసలు అంచనాలకు అందకుండా దూసుకుపోయింది.
పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు వస్తాయా అనే అంచనాల నడుమ ఏకంగా వంద ఎంపీటీలు, 85 జెడ్పీటీసీలు, రెండు జిల్లా పరిషత్ చైర్మన్లను సాధించి, అప్పటి ముఖ్యమంత్రికి చంద్రబాబునాయుడుకు షాక్ ఇచ్చారు కేసీఆర్.
ఇదే ఊపుతో తెలంగాణ ఉద్యమాన్ని ఊరువాడా తీసుకెళ్లి, కాంగ్రెస్ పార్టీని తన వైపు తిప్పుకున్నారు. 2004 ఎన్నికల్లో పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని అధికారాన్ని పంచుకున్నారు.
వెన్నుపోటు..
తరువాత వైఎస్సార్ వెన్నుపొటు, ఎంఎస్సార్ సవాల్ తో కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లారు. అఖండ మెజారిటీ సాధించి మరోసారి తన బలాన్ని చాటుకున్నారు.
కానీ రెండోసారి పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ లాక్కోవడం, తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో సగం స్థానాలు కోల్పోవడంతో మరోసారి టీఆర్ఎస్ కు సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి.
2009 ఎన్నికల్లో పార్టీ అనూహ్యంగా ఓడిపోవడంతో ఇక పార్టీ మూసేసుకోవచ్చని ప్రత్యర్థులు సెటైర్లు వేశారు. పార్టీ కేవలం 11 స్థానాలు, రెండు ఎంపీల సీట్లను మాత్రమే గెలుచుకుని దిక్కుతోచని స్థితిలో దానికో సువర్ణ అవకాశం చిక్కింది.
సామాజిక ఉద్యమకారుడు, వర్తమాన రాజకీయాల వ్యాఖ్యాత అయిన కే.రమేష్ ‘ఫెడరల్ తెలంగాణ’ తో మాట్లాడారు. ‘‘కేసీఆర్ తెలంగాణ రాజకీయాలకు కేంద్ర స్థానం. ఆయన ఎత్తులు సాధారణంగా కనిపించిన బలంగా ప్రభావం చూప్తిసాయి. 2009 లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం అయిపోయిందని అంతా అనుకున్నాం.
వైఎస్సార్ మరణించిన తెలంగాణ పై పోరాడటానికి ఎలాంటి అంశం లేని సమయంలో ఫ్రీ జోన్ అనే చిన్న అంశాన్ని పట్టుకుని తిరిగి రాజకీయాలను మలుపు తిప్పారు’’ అన్నారు.
‘‘పడ్డాడు అనుకున్న అనుకున్నా ప్రతిసారి రాజకీయ ప్రత్యర్థులను పడగొట్టి, లేచి నిలబడ్డాడు’’ అని విశ్లేషించారు.
ఫ్రీ జోన్ తీర్పు
2009 లో బొటాబొటి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు రెండోసారి వైఎస్సార్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. కానీ ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తరువాత సుప్రీంకోర్టు ఫ్రీ జోన్ తీర్పు మరోసారి ఆ పార్టీకి తిరిగి ఊపిరిలూదింది.
మొదట తెలంగాణ ఉద్యోగులు, తరువాత టీఆర్ఎస్ మెల్లగా ఉద్యమాన్ని నిర్మించడం ప్రారంభించారు. నవంబర్ 29, 2009 న కేసీఆర్ ప్రారంభించిన అమరణ నిరాహార దీక్షతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే మలుపు తిప్పారు. ఏకంగా ఐదు సంవత్సరాలు విజయవంతంగా ఉద్యమం నడిపి ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నారు.
పది సంవత్సరాల ఉమ్మడి రాజధాని
తెలంగాణ ఏర్పాటు సందర్భంగా పది సంవత్సరాలు హైదరాబాద్ ను ఆంధ్రప్రదేశ్ కు కూడా ఉమ్మడి రాజధానిగా చట్టం అవకాశం కల్పించింది. ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలన పగ్గాలు చేపట్టారు.
కేంద్రంలోనూ అధికార భాగస్వామ్యం పంచుకున్న టీడీపీ, కేసీఆర్ ను కార్నర్ చేయడానికి ప్రయత్నించింది. దానికి కేవలం 63 స్థానాలే రావడం, బీజేపీ- టీడీపీ కూటమికి 20 కి పైగా స్థానాలు రావడంతో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ను, తెలంగాణను రాజకీయంగా సమాధి చేయడానికి చంద్రబాబు తెరవెనక ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు. కానీ కేసీఆర్ వ్యూహాలను తక్కువగా అంచనా వేసిన ఏపీ సీఎంకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
రేవంత్ రెడ్డి డబ్బు సంచులతో రెడ్ హ్యండేడ్ గా దొరకగా, చంద్రబాబు నాయుడు స్టీఫెన్ సన్ తో మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డు బయటపడింది. దాంతో రాత్రికి రాత్రే చంద్రబాబు హైదరాబాద్ నుంచి బిచాణా ఎత్తేసి ఆంధ్రకు పారిపోయాడు. ఇలా కేసీఆర్ ను తక్కువ అంచనా వేసిన, పార్టీ పని అయిపోయిందనుకున్న ప్రతిసారి దానికి మంచే జరిగింది.
అదంతా గతంకానీ.. భవిష్యత్ ఏంటీ..
బీఆర్ఎస్ గతమెంతో ఘనం కానీ.. భవిష్యత్ మాత్రం సందిగ్థంగానే ఉంది. కేసీఆర్ చాలా రోజులుగా రాజకీయాల్లో ఆక్టివ్ గా లేరు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత బాత్రూంలో కిందపడి చాలాకాలం బయటకు రాలేదు. లోక్ సభ ఎన్నికల్లో పార్టీ కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. తరువాత పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు.
కాళేశ్వరం కుంగిపోయిన ఘటనపై పీసీ ఘోష్ కమిషన్, విద్యుత్ విచారణ కమిటీలు, ఏసీబీ కేసులు, ఇప్పుడు కవిత ఇస్తున్న షాక్ లు అన్నీ కూడా పార్టీకి ఊపిరి తీసుకోనివ్వడం లేదు.
ఎల్కతుర్తిలో సభలో ఆయన ప్రసంగంపై యావత్ తెలంగాణ ఉత్కంఠగా చూసింది కానీ.. కానీ ఒకప్పటి కేసీఆర్ లా మాత్రం ఆయన గర్జించలేకపోయారు. ఆయన ప్రసంగంలో వాడీ తగ్గింది. ఈ విషయాన్ని అనేక రాజకీయ విశ్లేషకులతో సహ స్వయంగా కూతురు కవిత కూడా తన లేఖలో ప్రస్తావించారు.
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ పాలనా వైఫల్యాలు అనేకం ఉన్నాయి. కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతగా కేసీఆర్ కానీ పార్టీ గానీ ఒక్క చెప్పుకోదగ్గ ప్రజా పోరాటం ఇంతవరకూ చేపట్టలేదు.
అధికార పార్టీ గ్రాఫ్ పడిపోతున్న అదే స్థాయిలో పార్టీకి బలం పెరగకుండా కాంగ్రెస్ సర్కార్ విచారణల పేరుతో బీఆర్ఎస్ కు బ్రేకులు వేసే ప్రయత్నం చేస్తోంది. ఈ అంశానికి సంబంధించి సీపీఐ రాష్ట్ర నాయకుడు ఆదరి శ్రీనివాస్ ఫెడరల్ తో మాట్లాడారు.
‘‘బీఆర్ఎస్ పార్టీ పీకల్లోతూ అవినీతిలో కూరుకుపోయింది. దానికి భవిష్యత్ అనేది లేదు. ఆ పార్టీ సంక్షోభంలోకి జారుకున్న ప్రతిసారి తెలంగాణ ప్రజలే నిలబెట్టారు. కానీ పదేళ్లు పాటు ఆ పార్టీ చేసిన అరాచకాలు అంతా చూశారు. ఇప్పుడే ప్రజలే కాదు.. కన్నబిడ్డలే కేసీఆర్ మాట వినే పరిస్థితి లేదు’’ అన్నారు. ఆ పార్టీలో మూడు వర్గాలు పవర్ సెంటర్ కోసం ఆరాటపడుతున్నాయని అభిప్రాయపడ్డారు.
కవిత పోరాటం దేనికోసం..
తండ్రి పైనే కవిత పోరాటం జరపడానికి బలమైన కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ముఖ్యంగా బీజేపీ తనను కార్నర్ చేసి జైల్లో పెడితే, ఎల్కతుర్తి సభలో దానిపై ఎదురుదాడికి చేయపోవడం కవితకు నచ్చలేదని బయటకు రావడానికి ప్రధాన కారణంగా కనిపిస్తొంది.
భవిష్యత్ లో రాబోయే కేసులను ఎదుర్కోవడానికి బీజేపీతో లాలుచీ పడాలని పార్టీ నాయకత్వం సంకేతాలు ఇచ్చి ఉంటుందని, ఈ విషయం కవితకు నచ్చకపోవడంతో బయటకు వచ్చినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
కేసీఆర్ కు బీజేపీతో బలమైన సంబంధాలు ఉన్నాయని చాలాసార్లు రుజువు అయింది. ప్రధాని మోదీ వద్దకు కేటీఆర్ ను సీఎం చేయాలనే ప్రస్తావన కేసీఆర్ చేసినట్లు తెలిసింది.
తెలంగాణలో దూకుడు మీదున్న బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా తప్పించడంలో కూడా బీఆర్ఎస్ అధినేత పాత్ర ఉందని అప్పట్లో వార్తలు చక్కెర్లు కొట్టాయి. కవిత లేఖతో ఇప్పుడు మరోసారి ప్రజల నోళ్లలో నానుతున్నాయి.
కవిత మొదట్లో కాంగ్రెస్ లో చేరడానికి ప్రయత్నించిందనే వాదనలు సైతం వినిపించాయి. అవేవి ఫలించకపోవడంతో సొంతంగా పార్టీ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే కవిత పెట్టే పార్టీ రాష్ట్రంలో ఏ మాత్రం ప్రభావం చూపిన అది బీఆర్ఎస్ ఓటు బ్యాంకుపైనే ఉంటుందనేది వాస్తవం. కేసీఆర్ లో తగ్గిన చురుకుదనం, కేటీఆర్- హరీష్ రావు - కవిత మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు దాని భవిష్యత్ ను ఏ తీరానికి చేరుస్తుందో తెలియదు.
పార్టీ ఎదగడానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా?
ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి ఉన్న సంక్షోభం నుంచి బయటపడే అవకాశం ఉంది. అది కూడా దానికి అచ్చివచ్చిన ఉప ఎన్నికల రూపంలో రాబోతున్నాయని కొన్ని పరిణామాలను చూస్తే తెలుస్తోంది.
పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే కేసు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. అయితే ఇప్పటికైతే విచారణ పూర్తి కాకపోయిన అప్పట్లో అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు మరోసారి బీఆర్ఎస్ కు కోరుకున్నది జరిగేలా ఉంది.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హమీలపై ప్రజల నుంచి వ్యతిరేకత క్రమంగా ప్రబలుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే కొనసాగితే ఉప ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించి తను కోల్పోయిన ప్రాభావాన్ని తిరిగి సాధించాలని కలలుకంటోంది.
అయితే దానికి మరో సంవత్సరం దాకా అయిన సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటిదాక విచారణ సంస్థలు, కమిషన్ లు బీఆర్ఎస్ పాలనపై ఎలాంటి రిపోర్టులు ఇస్తాయో, వాటిని ఆ పార్టీ ఎలా డిఫెండ్ చేసుకుంటోందో అన్నదానిపైనే దాని భవిష్యత్ ఆధారపడి ఉంది.