రాష్ట్ర అవతరణ వేడుకలు ఎవరి కోసం?

తెలంగాణ రాష్ట్రం సాధ్యమైనది ఎవరితోనన్నది చెప్పేవారు కరువయ్యారు. ఐదు దశాబ్దాల కాలంలో, ప్రజలు అనేక రూపాలలో సాగించిన అసమాన పోరాటాల చరిత్ర మరుగున పడిపోతున్నది.

Update: 2024-05-29 03:49 GMT

-రమణచారి


ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 న ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం మరో మారు సిద్ధమవుతోంది. రాష్ట్రాన్ని తెచ్చామని కొందరు చెప్పుకుంటుంటే, ఇచ్చామని కొందరు ప్రచారం చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం సాధ్యమైనది ఎవరితోనన్నది మాత్రం చెప్పేవారు కరువయ్యారు. ఐదు దశాబ్దాల కాలంలో, నాలుగున్నర కోట్ల ప్రజలు అనేక రూపాలలో సాగించిన అసమాన పోరాటాల చరిత్ర మరుగున పడిపోతున్నది.


వందలాది ఉద్యమకారుల త్యాగాలు, జరిగిన బలిదానాలకు గుర్తింపు కరువైంది. అమరుల త్యాగఫలమైన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులను ఆహ్వానించకుండా, వారి సంక్షేమం, అభివృద్ధి ఊసే లేకుండా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా నిర్వహించేందుకు పూనుకోవడమన్నది అత్యంత శోచనీయం.


దేశ చరిత్రలో తెలంగాణకు సుస్థిర స్థానం ఉంది. పలు రకాల ఉద్యమాలకు, విప్లవాలకు నాంది పలికి బాటలు వేసిన నేల ఇది. అత్యంత చైతన్యం, త్యాగ గుణం కలిగిన వీరుల కన్న గడ్డ ఇది. స్వాతంత్ర ఉద్యమంలో, విప్లవోద్యమంలో చరిత్ర సృష్టించిన ఘనత దీనికున్నది. దోపిడీ, పీడనలపై తిరుగుబాటుకు స్ఫూర్తి ఈ నేల. దేశ చరిత్రలో సాయుధ పోరాటానికి, నక్సల్బరీ ఉద్యమానికి ప్రేరణ విత్తనాలు పడింది ఇక్కడే. భూమి సమస్య ఇరుసుగా కొనసాగుతున్న ఉద్యమాలకు ఆశాదీపం తెలంగాణ గడ్డ. ప్రజాస్వామిక ఉద్యమాలకు పట్టుకొమ్మ. ఆత్మగౌరవం పోరాటాలకు నిలువెత్తు నిదర్శనం తెలంగాణ.


బాంచన్ దొర అనే దగ్గర నుండి బందూకు ఎత్తి విముక్తి ఉద్యమానికి సాలు పోసిన నేల తెలంగాణ. సాయుధ రైతాంగ పోరాటంతో భారతదేశ చరిత్రలో, ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమంలో కొత్త పొంతలు తొక్కించింది తెలంగాణ. అటు నిజాం ప్రభువును, రజాకార్లను, వారి తాబేదారులైన భూస్వాములను గడగడలాడించి, పల్లెలు వదిలి పట్నాలకు పరిగెత్తేలా చేసిన ఘన చరిత్ర తెలంగాణకే సొంతం.


దేశ స్వాతంత్రం అనంతరం భాషాప్రయుక్త రాష్ట్రాల పేరుతో ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత దగాపడ్డ ప్రాంతం తెలంగాణ. అన్ని రంగాలలో విపక్ష గురై రెండవ శ్రేణి పౌరులుగా మనుగడ సాగించలేక, ప్రత్యేక రాష్ట్రం కోసం వెల్లువలా ఉద్యమించిన చరిత్ర తెలంగాణ. సుమారు అర్థ శతాబ్దం పాటు అలుపెరుగని పోరాటం జరిపి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న ఘనత తెలంగాణది. అనేక పోరాట రూపాలు, వందలాది త్యాగాలు, లెక్కలేనన్ని బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ.


ఉద్యమ జ్వాల రగిలించి అన్ని రాజకీయ పార్టీలను ఏకతాటిపై నిలిపి ఢిల్లీ పాలకుల నిగ్గదీసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న చరిత్ర తెలంగాణది. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షల, అమరుల త్యాగ ఫలమే తెలంగాణ.


మా నీళ్లు, మా నిధులు, మా ఉద్యోగాలు, మా భూములు మాకే కావాలంటూ మమ్మల్ని మేమే పాలించుకుంటామని సాగించిన ఆత్మగౌరవ పోరాటం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం. నీళ్లు, నిధులు, నియామకాలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే స్వపాలకుల ద్వారా సాధ్యమవుతుందని ఆశపడ్డారు. ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే పొలిమేరల దాకా తన్ని తరుముదాం.., ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాతర వేద్దాం... అన్న కాళోజి మాటలు యువతరాన్ని ఉర్రూతలూగించాయి.


తెలంగాణ జన సభ, తెలంగాణ మహాసభ, తెలంగాణ ఐక్య వేదిక, తెలంగాణ ఐక్యకార్యాచరణకమిటీ, తెలంగాణా ప్రజా ఫ్రంట్ వంటి ప్రజా సంఘాలు ప్రజలను కదిలించాయి. మావోయిస్టుల సహకారమే లేకపోతే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమయ్యేది కాదని సీనియర్ జర్నలిస్టు వక్కాణించిన విషయం చారిత్రక వాస్తవం. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు ఉద్యమాలకు ఊపిరిలూదాయి. కవుల రచనలు, కళాకారుల ప్రదర్శనలు, రచయితల రచనలు ఉద్యమానికి చైతన్య రూపాన్ని ఇచ్చాయి. ఉపాధ్యాయులు, మేధావులు, విద్యార్థులు ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. జర్నలిస్టులు, డాక్టర్లు, లాయర్లు అండగా నిలిచారు. కార్మికులు, రైతాంగం తోడవడంతో తెలంగాణ ఉవ్వెత్తున ఎగిసి పడింది. నిరాహార దీక్షలు, రైలు రోకో రాస్తారోకోలు, సకలజనుల సమ్మె, మిలియన్ మార్చ్, సాగర హారాలు, బందులు, వంట వార్పు వంటి ఉద్యమ రూపాలెన్నో తెలంగాణలో నిత్యకృత్యమయ్యాయి.


అంబేద్కర్ రాజ్యాంగంలో పేర్కొన్న మూడవ అధికరణ ఆసరాగా పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టి, రాజకీయ పార్టీలన్నీ తప్పనిసరై ఆమోదించారు. దానితో కేవలం భౌగోళిక తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఏర్పడిందన్నది నిర్వివాదాంశం.


ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమ సమస్యలన్నీ తీరుతాయని ప్రజలు కలలుగన్నారు. కానీ, ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియా, మట్టి మాఫియా, గ్రానైట్ మాఫియా... ఇలా అన్ని రంగాలలో మాఫియా కోరలు సాచింది. తెలంగాణ వనరులన్నీ దోపిడికి గురయ్యాయి. పాలకుల హామీలన్నీ ఎండ మావులయ్యాయి. ఉత్తర తెలంగాణ అంతటా విస్తరించిన సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్ల సమస్యపై ఎలాంటి హామీ లేదు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ సిర్పూర్ కాగజ్ నగర్ కాగిత పరిశ్రమ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, నిజామాబాద్ పసుపు బోర్డు ఏర్పాటు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉండిపోయాయి. ఫార్మాసిటీ రద్దు హామీ నెరవేరలేదు. మహబూబ్ నగర్ లో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతూనే ఉంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందన్న ఆశ ఆచరణకు నోచుకోలేదు.


ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగడం ఇంకెంత మాత్రం సబబు కాదని ప్రభుత్వం గుర్తించాలి. ప్రజల స్థితిగతుల్లో పెద్దగామార్పు లేకుండానే, ఇంతకాలం తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఒక తంతుగా మాత్రమే జరుగుతున్నాయి.


రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎవరికోసం అన్న ప్రశ్న? వివిధ వర్గాల ప్రజలలో తలెత్తింది. తెలంగాణ అవతరణ దినోత్సవం ఒక ప్రహసనంలా మార్చడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజల కలలు కల్లలవడమే ఇందుకు కారణం. ఇలాంటి ప్రత్యేక పరిస్థితులలో అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, బుద్ధిజీవులు మరో స్వతంత్ర పోరాటంలా ప్రజాస్వామిక తెలంగాణ సాధన కోసం ఉద్యమించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికైనా పాలకులు ప్రజల ఆకాంక్షలను గౌరవించి, ఆశయాలను నెరవేర్చలేకపోతే, దేశంలోనే అత్యంత చైతన్యవంతమైన తెలంగాణ ప్రజలు సహించరు. క్షమించరు. ఇది తెలంగాణ చరిత్ర చాటిన సత్యం.


( సీనియర్ తెలంగాణ ఉద్యమకారుడు)


Tags:    

Similar News