అప్పుడు మాట్లాడని కవిత ఇపుడెందుకు మాట్లాడుతోంది:రఘునందన్
మరో ఎపిసోడ్ లో బిఆర్ఎస్ నేతల అవినీతి చిట్టా విప్పాలి;
బిఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కవిత గూర్చి బిజెపి ఎంపీ రఘునందన్ రావు స్పందించారు.
రేవంత్రెడ్డి, హరీశ్రావు కుమ్మక్కయ్యారని తాను గతంలోనే చెప్పానని ఆయన గుర్తు చేశారు. జాగృతి కార్యాలయంలో జరిగిన ప్రెస్మీట్లో కవిత కొత్తగా చెప్పింది ఏం లేదని రఘునందన్ రావు అన్నారు. వాళ్ల పార్టీ అంతర్గత వ్యవహారాల గురించి తాను మాట్లాడదల్చుకోలేదని రఘునందన్ రావు తెలిపారు. కవిత చెప్పిన మోకిల ప్రాజెక్టు అవకతవకల గురించి విచారించాలని చెప్పారు. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, నవీన్రావు చేసిన అక్రమాలపై విచారణ జరపాలన్నారు.
‘‘జడ్పీ అధ్యక్షుడిగా నన్ను ఎవరు ఓడించారో గతంలో కేసీఆర్కు వివరంగా చెప్పాను. ఆరోజు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మెదక్ ఎంపీ ఎన్నికల్లో ఇబ్బందిపెట్టాలని చూసినట్లు గతంలోనే చెప్పా. కవిత ఇంకా కొత్త విషయాలు కూడా మాట్లాడితే బాగుండేది. ఆమె మాటలతో భారత రాష్ట్ర సమితి అవినీతి పునాదుల మీద నిలడబడిందని తేలింది. మళ్లీ వచ్చే ఎపిసోడ్లో బిఆర్ఎస్ పెద్దలు చేసిన అవినీతిని బయటపెడితే బాగుంటుంది. పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, నవీన్రావు చేసిన అక్రమాల మీద పార్టీలో, ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడని కవిత ప్రస్తుతం ఎందుకు మాట్లాడుతుంది’’ అని రఘునందన్రావు కవితను నిలదీశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కలిసి ఒకే ప్లైట్ బిజినెస్ క్లాస్ లో ప్రయాణించి నన్ను ఓడించాలని చర్చించుకున్నారు అని తాను గతంలో ఇదే విషయం చెప్పానని రఘునందన్ రావు గుర్తు చేశారు.