ఈ యువరాజు..మన మహరాజులను అవమానిస్తున్నాడు: ప్రధాని

కాంగ్రెస్ షెహజాదే.. రాజులు, మహరాజులను అవమానిస్తున్నాడని, దేశంలో అత్యాచారాలు చేసిన బాద్షా, నిజాంలు, సుల్తాన్ లను పల్లెత్తు మాట అనడం లేదని ప్రధాని మోదీ..

Update: 2024-04-28 11:02 GMT

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్ ఎంపీ రాహూల్ గాంధీ పై విమర్శలు గుప్పించారు. దేశంలోని రాజులు, మహరాజులను ఈ యువరాజు అవమానించారని, అయితే బుజ్జగింపు రాజకీయాల కోసం నవాబులు, నిజాంలు, సుల్తానులు, బాద్షాలు చేసిన దురాగతాలపై మౌనంగా ఉన్నారని విరుచుకుపడ్డారు.

బెలగావిలో జరిగిన ఒక మెగా బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, “కాంగ్రెస్ బుజ్జగింపులు, ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకుని మన చరిత్ర, మన స్వాతంత్ర్య పోరాట రచనలను నిర్ధారిస్తుంది. నేటికీ, కాంగ్రెస్ షెహజాదే (యువరాజు) ఆ పాపాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు.
కాంగ్రెస్ షెహజాదే ఇటీవలి ప్రకటనను మీరు విని ఉండవచ్చు -- భరత రాజులు, మహారాజులు అత్యాచారాలు చేశారని అన్నారు. 'ప్రజలు, పేదల భూములు, ఆస్తులను వారు (రాజులు, మహారాజులు) ఆక్రమించారని ఆయన (రాహుల్‌గాంధీ) ఆరోపిస్తున్నారు.. పరిపాలన, దేశభక్తి మనకు స్ఫూర్తినిచ్చే ఛత్రపతి శివాజీ మహారాజ్‌, కిత్తూరు రాణి చన్నమ్మ వంటి మహానుభావులను కాంగ్రెస్‌ షెహజాదే అవమానించారు," ప్రధాని కాంగ్రెస్ ఎంపీ రాహూల్ గాంధీపై విమర్శలు గుప్పించారు.
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు అణచివేతలను రాహుల్ గుర్తుపెట్టుకోలేకపోతున్నారని పేర్కొన్న మోదీ, "అతను (ఔరంగజేబ్) మన అనేక దేవాలయాలను అపవిత్రం చేశాడు. చాలా వాటిని ధ్వంసం చేశాడు. ఔరంగజేబును పొగిడే పార్టీలతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్.. మన మత స్థలాలను ధ్వంసం చేసి, గోవుల హత్యలకు పాల్పడిన వారిని పల్లెత్తు మాట అనడం లేదు. దేశ విభజనలో కీలక పాత్ర పోషించి రక్తపుటేర్లు పాలించిన నవాబులను సైతం గుర్తు పెట్టుకోలేదు" అని ప్రధాని అన్నారు.
హిందూవులపై అత్యాచారాలకు పాల్పడిన "మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును పొగిడే వారితో పొత్తు పెట్టుకుంటోందని" ఆరోపించారు. "కాంగ్రెస్ ప్రజల సంపదను స్వాధీనం చేసుకుని, దాని వారి ఓటు బ్యాంకుగా ఉన్న వారికీ పంపిణీ చేయాలని అనుకుంటోంది" అని ఆయన విమర్శించారు.
"దేశంలో ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయడానికి" కాంగ్రెస్ కుట్ర పన్నిందని, అదే సమయంలో ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీ "దేశ ప్రయోజనాల గురించి కనీసం చింతించదని, కేవలం కుటుంబ ప్రయోజనాలను కాపాడటం గురించి మాత్రమే ఆందోళన చెందుతుందని" నిప్పులు చెరిగారు.

భారతదేశం ఆవిర్భవించి, బలోపేతం అయినప్పుడు, ప్రతి ఒక్కరూ గర్వంగా భావిస్తారు. అయితే, కాంగ్రెస్‌కు జాతీయ ప్రయోజనాలతో సంబంధం లేదు, ఎందుకంటే పార్టీ కుటుంబ ప్రయోజనాలను మాత్రమే చూడటంలో ఆసక్తి చూపుతుంది. దేశం సాధించిన విజయాలు పార్టీకి నచ్చవు.. మనం సాధించిన ప్రతి విజయానికి వారు సిగ్గుపడటం మొదలుపెట్టారని అన్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ప్రధాని అన్నారు. ఎంసీఏ విద్యార్థిని నేహా హిరేమత్ హత్య కేసును ప్రస్తావిస్తూ, కాంగ్రెస్‌పై ఆయన విరుచుకుపడ్డారు, “వారు మళ్లీ బుజ్జగింపులకు ప్రాధాన్యత ఇచ్చారు” అని అన్నారు. “నేహా లాంటి మా ఆడపిల్లల ప్రాణాలకు విలువ ఇవ్వరు. వారు పట్టించుకునేది తమ ఓటు బ్యాంకు మాత్రమే” అన్నారాయన
భారత నేర న్యాయ వ్యవస్థలో తన ప్రభుత్వం చేసిన పలు సవరణల గురించి కూడా మోదీ సభలో ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. “బీజేపీ ప్రభుత్వం నేర న్యాయ వ్యవస్థలోని వలస చట్టాలను తొలగించింది. ఇప్పుడు మా 'న్యాయ్ సంహిత'లో, మన పౌరులకు శిక్ష కంటే న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చాము.
ఉగ్రవాదానికి సంబంధించిన చట్టాలను పటిష్టం చేశాం. భారతీయ సాక్ష్యా అధినియం.. ఎలక్ట్రానిక్ సాక్ష్యాల కోసం కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. జులై 1న ఇది అమలులోకి వచ్చిన తర్వాత ప్రతి పౌరునికి ఉపయోగపడుతుంది’’ అని ప్రధాని ఉద్ఘాటించారు.
Tags:    

Similar News