బీహార్ ఎన్నికలు: నామినేషన్ దాఖలు చేసిన తేజస్వి యాదవ్..
హ్యాట్రిక్ కొడతానని ధీమాగా ఉన్న RJC చీఫ్, మాజీ సీఎం లాలూ, రబ్రీదేవి తనయుడు
బీహార్(Bihar) అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రీయ జనతాదల్ (RJD) నాయకుడు తేజస్వి యాదవ్ బుధవారం నామినేషన్(Namination) దాఖలు చేశారు. హాజీపూర్లోని రఘోపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన.. తన తల్లిదండ్రులు లాలూ ప్రసాద్, రబ్రీ దేవితో కలిసి హాజీపూర్లోని కలెక్టరేట్కు చేరుకున్నారు. రాఘోపూర్ నుంచి వరుసగా రెండు సార్లు గెలిచిన తేజస్వి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విల్లూరుతున్నారు. మాజీ సీఎంలయిన తేజస్వి తల్లిదండ్రులు లాలూ ప్రసాద్(Lalu Prasad), రబ్రీ దేవి(Rabri Devi) కూడా గతంలో ఇదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.
రోడ్డుకు ఇరువైపుల భారీగా మద్దతుదారులు..
తేజస్వి కాన్వాయ్ పాట్నా నుంచి 40 కిలోమీటర్ల దూరంలో హాజీపూర్కు బయలుదేరిన సమయంలో పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు రోడ్డుకు ఇరువైపులు నిలుచున్నారు. కొంతమంది తేజస్వికి విక్టరీ సింబల్ చూపుతూ శుభాకాంక్షలు తెలిపారు. కారు దిగి నామినేషన్ పత్రాలతో కలెక్టరేట్ లోపలికి బయలుదేరిన తేజస్విని చూసేందుకు జనం ఒక్కసారిగా గుమిగూడారు. వారిని నిలవరించడం పోలీసులకు కష్టంగా మారింది. తేజస్వి వెంట పాటలీపుత్ర ఎంపీ, తన సోదరి మిసా భారతి, రాజ్యసభ సభ్యుడు సంజయ్ యాదవ్ కూడా ఉన్నారు.