స్నేహితుడు అత్యాచారం చేసి ఉంటే ఏం చేసేవారు?

బీజేపీ నేతలను ఎదురు ప్రశ్నించిన టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ;

Update: 2025-06-28 09:54 GMT
Click the Play button to listen to article

కోల్‌కతాలో లా విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన రాజకీయ రంగు పులుముకుంది. బీజేపీ(BJP), టీఎంపీ నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. నిందితుల్లో ఒకరికి టీఎంసీతో సన్నిహిత సంబంధాయలంటూ.. ఆ పార్టీ నేతలతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు కాషాయ పార్టీ నేతలు. ఈ పోస్టులపై టీఎంసీ(TMC) శ్రీరామూర్ నియోజకవర్గం ఎంపీ కళ్యాణ్ బెనర్జీ(Kalyan Banerjee) స్పందించారు. విలేఖరులు అడిగిన ప్రశ్నలకు కౌంటర్ ఇచ్చారు. ‘‘ఒక స్నేహితుడు తోటి స్నేహితురాలిపై అత్యాచారం చేసి ఉంటే ఇంత రాద్దాంతం చేసేవారా?. లా కాలేజీ క్యాంపస్ లోపల నేరం జరిగింది కనుక క్యాంపస్ లోపల పోలీసులను మోహరించాలా? భద్రతా ఉన్న చోట కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. పురుషుల మనస్తత్వంలో మార్పు రావాలి.’’ అని అన్నారు.

ఎవరి తప్పు ?

నిందితుడు మాజీ విద్యార్థి కదా అని విలేఖరి అడిగిన ప్రశ్నకు..‘‘ అవును. అతను కాలేజీ మాజీ స్టూడెంటే. మాజీ విద్యార్థి క్యాంపస్‌లోకి ఎలా ప్రవేశించాడని అడుగుతున్నారు? కాలేజీలోకి రానివ్వకుండా కళాశాల సిబ్బంది అడ్డుకోవాలి. కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు ఉన్న సంబంధాల వల్లే అతను లోపలికి ప్రవేశించాడు." అని బెనర్జీ అన్నారు.

‘2019 నుంచి TMCP యూనిట్ పనిచేయడం లేదు’

ఈ కేసులో పోలీసులు మొత్తం నలుగురిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు మావోజిత్ మిశ్రా లా కళాశాల పూర్వ విద్యార్థి. తృణమూల్ కాంగ్రెస్ ఛత్ర పరిషత్ (TMCP) లా కాలేజీ యూనిట్ మాజీ అధ్యక్షుడు కూడా. ప్రస్తుతం TMC విద్యార్థి విభాగానికి సంస్థాగత కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. అయితే మిశ్రాకు TMCPతో సంబంధం లేదని రాష్ట్ర అధ్యక్షుడు త్రినంకుర్ భట్టాచార్య పేర్కొ్న్నారు. ‘‘లా కాలేజీలో TMCP యూనిట్ 2019 నుంచి పనిచేయలేదు. 2022, 2023లో ఏ కమిటీల్లోనూ లేడు. అతను ఏ పార్టీ వాడనేది ముఖ్యం కాదు. అతను ఒక రేపిస్ట్. చట్టం ముందు నిలబడాలి, " అన్నారు భట్టాచార్య.

బెంగాల్ చీఫ్ సెక్రటరీకి NCW చీఫ్ లేఖ

రేప్ ఘటనను సుమోటోను తీసుకున్న జాతీయ మహిళా కమిషన్.. బాధితురాలిని, ఆమె కుటుంబాన్ని కలుసుకోవడానికి NCW సభ్యురాలు డాక్టర్ అర్చన ముజుందార్‌కు పోలీసులు సహకరించాలని సూచించింది. ఈ మేరకు కమిషన్ చైర్‌పర్సన్ విజయ రహత్కర్ పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శికి లేఖ కూడా రాశారు. పూర్తివివరాలతో 3 రోజుల్లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని కమిషన్ పోలీసులను ఆదేశించింది.

Tags:    

Similar News