ఈసీ అనుమతి లేక తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా

తెలంగాణలో రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు,రైతులకు సంబంధించిన కీలకమైన విషయాలపై చర్చించాల్సిన కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈ భేటీకి ఈసీ రెడ్ సిగ్నల్ ఇచ్చింది.

Update: 2024-05-18 14:44 GMT
తెలంగాణ మంత్రివర్గ సమావేశం వాయిదా

తెలంగాణలో శనివారం నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి రాకపోవడంతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది.

- శనివారం మధ్యాహ్నం కేబినేట్ సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. కానీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున తెలంగాణ కేబినేట్ సమావేశానికి ప్రభుత్వం ఈసీ అనుమతి కోరింది. కానీ శనివారం రాత్రి వరకు ఈసీ నుంచి అనుమతి రాలేదు.
- ఈసీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవటంతో శనివారం జరగాల్సిన కేబినేట్ భేటీ నిలిచిపోయింది. ఈసీ నుంచి ఏ క్షణమైన అనుమతి వస్తుందని తెలంగాణ మంత్రులు అందరూ శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సచివాలయంలో వేచి ఉన్నారు.
- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ శాంతికుమారితో పాటు అన్ని విభాగాల ఉన్నత అధికారులు కేబినేట్ భేటీకి హాజరయ్యేందుకు సచివాలయానికి చేరుకున్నారు.
- కానీ  శనివారం రాత్రి 7 గంటల వరకు ఈసీ నుంచి స్పందన లేకపోవటంతో కేబినేట్ భేటీ జరగలేదు. కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేసి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు వెనుతిరిగి వెళ్లారు.

కేబినెట్ భేటీ కోసం ఎజెండా సిద్ధం
రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతులకు సంబంధించిన పలు కీలకమైన విషయాలపై ఈ భేటీలో చర్చించాలని ఎజెండాను సిద్ధం చేసుకున్నారు. కానీ ఈసీ నుంచి స్పందన లేకపోవటంతో రైతుల సంక్షేమం, అత్యవసరమైన అంశాలపై చర్చించలేకపోయామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.

పునర్విభజన చట్టంలో పెండింగ్ అంశాలపై...
జూన్ 2వతేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం జరగనుంది. దీనికి సంబంధించిన వేడుకల నిర్వహణతో పాటు పునర్విభజనకు పదేళ్లు పూర్తి కావటంతో ఇప్పటివరకు రెండు రాష్ట్రాల మధ్య పెండింగులో ఉన్న అంశాలు, పునర్విభజన చట్టంలో పెండింగులో ఉన్న కీలకమైన అంశాలను కేబినేట్ భేటీలో చర్చించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కానీ కేబినేట్ భేటీ వాయిదా పడటంతో ఇవేవీ చర్చ జరగలేదు.
- కేబినెట్ సమావేశానికి ఈసీ నుంచి అనుమతి ఎప్పుడు వస్తే.. అప్పుడే కేబినేట్ భేటీ జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. సోమవారం లోపు కేబినెట్ సమావేశానికి ఈసీ నుంచి అనుమతి రాకపోతే, అవసరమైతే మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి అనుమతి కోరుతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.


Tags:    

Similar News