జల సంరక్షణలో తెలంగాణ టాప్
కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ జల సంచాయ్ జన భాగిదారీ అవార్డుల్లో తెలంగాణ పంట పండింది.
By : Saleem Shaik
Update: 2025-09-26 02:17 GMT
వర్షపునీటి సంరక్షణలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జల సంచాయ్ జన భాగీదారీ 1.0 ర్యాంకుల ప్రకారం తెలంగాణకు ఈ ఘనత దక్కింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో 5,20,362 వర్షపునీటి సంరక్షణ పనులు చేపట్టి రికార్డు సృష్టించింది. ఇంకుడు గుంతలు, చెక్ డ్యాములు, సోక్ పిట్స్, రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, బోర్ వెల్ రీఛార్జ్, ఫార్మ్ పాండ్స్ పనులు చేశారు.
8 జిల్లాలకు కేంద్రం రివార్డులు
జల సంచాయ్ జన భాగీదారి 1.0 ర్యాంకుల్లో భాగంగా దేశంలో 67 జిల్లాలను ఎంపిక చేశారు. తెలంగాణ రాస్ట్రంలోని 8 జిల్లాలకు అవార్డులు లభించాయి. జలసంచాయ్ అవార్డుల్లో భాగంగా రూ. 2 కోట్ల రివార్డు విభాగంలో ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాల జిల్లాలు అగ్రస్థానంలో నిలిచాయి. వరంగల్, నిర్మల్, జనగామ జిల్లాలకు కోటి రూపాయల రివార్డులు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్ జిల్లాలకు రూ.25 లక్షల రివార్డులు లభించాయి.
సీఎం ప్రశంసలు
కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసే ప్రతిష్ఠాత్మక జల్ సంచయ్ జన్ భాగీదారి అవార్డులను ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాల జిల్లాలు గెలుచుకోవడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ మూడు జిల్లాలు దక్షిణ భారతదేశంలోనే ఉత్తమ జిల్లాలుగా నిలిచాయని సీఎం ప్రశంసించారు.ఈ అవార్డులు పొందిన ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాల జిల్లాలకు రూ.2కోట్ల నగదును అందిస్తారని సీఎం చెప్పారు. జల్ సంచయ్ జన్ భాగీదారి అవార్డు కింద భద్రాద్రికొత్తగూడెం, మహబూబ్ నగర్ జిల్లాలకు రూ.25లక్షల నగదు అవార్డలు లభించాయని సీఎం పేర్కొన్నారు. కేంద్ర అవార్డులు సాధించిన జిల్లాలు భవిష్యత్తులో గొప్ప మైలురాళ్లను సాధించి మరింత స్ఫూర్తినిస్తాయని సీఎం పేర్కొన్నారు.
ఉపాధి హామిపనుల్లో నీటి సంరక్షణకు ప్రాధాన్యం : మంత్రి సీతక్క
తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ఉపాధి హామి పనుల్లో జల సంరక్షణకు ప్రాధాన్యం ఇచ్చి ఇంకుడు గుంతలు, చెక్ డ్యాములు, సోక్ పిట్స్, రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, బోర్ వెల్ రీఛార్జ్, ఫార్మ్ పాండ్స్ నిర్మించినందువల్లే కేంద్రం అవార్డుల వచ్చాయని తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క చెప్పారు. అవార్డులు, రివార్డులు సాధించిన ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి పాటిల్, నల్లోండ కలెక్టర్ ఇలా త్రిపాఠి ,మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ,జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా, మహబూబ్ నగర్ కలెక్టర్ విజేంద్రబోయి, వరంగల్ కలెక్టర్ సత్యశారదాదేవి, నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ లను మంత్రి సీతక్క అభినందించారు.