ఈ పచ్చని పొలాలను చిదిమేయాలను కోవడం న్యాయమా, చంద్రబాబూ!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మాజీ ఐఎఎస్ అధికారి డా. ఇఎఎస్ శర్మ లేఖ;
ప్రభుత్వం, నెల్లూరు జిల్లా,,ఉలవపాడు మండలం, కరేడు పంచాయతీ లో, 16 గ్రామాల్లో, 8,348 ఎకరాలకు పైగా, సస్యశ్యామలమైన వ్యవసాయ భూములే కాకుండా, ప్రకాశం జిల్లాలో, సింగరాయకొండ మండలంలో, సింగరాయకొండ, బింగినిపల్లి గ్రామాల్లో,ఇతర గ్రామాల్లో అదనంగా వ్యవసాయ భూములను, ఇండోసోల్ కంపెనీ వారి 30 GW సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్టు కోసం సేకరిస్తున్నారు. ప్రజల వద్ద నుంచి, వారి ముందస్తు సమ్మతి తీసుకోకుండా బలవంతంగా ఈ భూములను సేకరించాలనుకోవడం బాధాకరమైన విషయం.
రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల శాఖ వారు జారీ చేసిన GOMs No 66 (15-9-2022), GOMs No 4 (19-1-2023), GOMs No112 (9-11-2023), GOMs No 43 (25-3-2025) ద్వారా అధికారులు ఈ భూసేకరణకు పూనుకుంటున్నారు.
కరేడు ప్రాంతంలో, భూగర్భ జలాలు తక్కువ లోతులోనే పుష్కలంగా లభ్యం అవుతాయి. రైతులు, వరి, కూరగాయలు, వేరుశెనగ వంటి పంటలు విస్తృతంగా పండిస్తారు. ఉలవపాడు మామిడి జాతీయస్థాయిలో ప్రసిద్ధి గణించింది. ఆ ప్రాంతంలో, వేలాదిమంది ప్రజలు వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నారు. అదేకాకుండా, వందలాదిమంది సంప్రదాయ మత్స్యకారులు అక్కడ మత్స్య వనరుల మీద ఆధారపడతారు. ఆ ప్రాంతంలో మంచి పశుసంపద ఉంది. ఇండోసోల్ కంపెనీ వారి ప్రాజెక్టు వస్తే, ఆ కార్యక్రమాలు పూర్తిగా ధ్వంసమయ్యే అవకాశం ఉంది.
ఆశ్చర్యకరమైన విషయం, భూములే కాదు, ప్రభుత్వం, ఆ గ్రామాల్లో ప్రజలు ఆధారపడే ఎన్నో చెరువులు, ఉదాహరణకు, చేవూరు, చెన్నపాలయం, కరేడు, రావూరు చెరువులను, కనిగిరి / సంగం / సోమశిల రిజర్వాయర్ ల నుంచి, రోజుకు 115 మిల్లియన్ల లీటర్ల నీటిని, దగ్గర ఖనిజ వనరులను కూడా, కంపెనీకి, రాయితీలతో సహా సమర్పించడం.
ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా అటువంటి ఆదేశాలు ఇచ్చే ముందు, ఆ ప్రాజెక్టు కోసం అంత అధికంగా భూమి అవసరమా కాదా, ఆ ప్రాజెక్టు కారణంగా, అక్కడి ప్రజల జీవితాల మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది, ఆ ప్రాజెక్టు ఆధారంగా స్థానిక ప్రజలకు, ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి, నిర్వాసితులయ్యే కుటుంబాలకు ప్రత్యామ్నాయ మైన ఉపాధులను ప్రభుత్వం కలిగించగలదా, అనే విషయాలను ప్రభుత్వం అధ్యయనం చేసినట్టు కనిపించడం లేదు.
ఉదాహరణకు, అమెరికాలో వాక్కెర్ కంపెనీ వారు, 10 GW సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్టు ను,టెన్నెసీ రాష్ట్రం Charleston లో కేవలం 550 ఎకరాల్లో నిర్మించగ గలిగారు . మనదేశంలో కూడా గుజరాత్ వంటి రాష్ట్రాల్లో, అటువంటి ప్రాజెక్టుల కోసం, అంత అధికంగా భూములను సేకరించడం లేదు. అంటే, మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక గా నిలిచిన కరేడు వ్యవసాయ భూములకు , ప్రభుత్వం దృష్టిలో విలువ లేదా?
2013 భూసేకరణ చట్టంలో , ప్రాజెక్టుల కోసం, భూములను సేకరించే ముందు, ఆప్రోజెక్టుకారణంగా, అక్కడి ప్రజల జీవితాల మీద, వారి ఆర్థిక పరిస్థితి మీద, ఆ ప్రాంతం ఆహార భద్రత మీద, పర్యావరణ మీద, ఎటువంటి ప్రభావం ఉండగలదు అనే అంశం మీద, ప్రభుత్వం నిష్పాక్షికమైన ఏజెన్సీ ద్వారా అధ్యయనం (Social Impact Appraisal & Environment Impact Appraisal) చేయించి, ఆ రిపోర్టును ప్రజల సమ్మతి కోసం, వారి ముందు ఉంచవలసిన అవసరం ఉంది. కాని మీ ప్రభుత్వం ఆ చట్టాన్ని, 2018లో ప్రజలకు వ్యతిరేకంగా సవరించడం జరిగింది. అయినా, ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా ఉండడం అవసరం. అటువంటి విషయాలను కూలంకషంగా పరిశీలించకుండా, ప్రజలను సంప్రదించకుండా, వారి భూములను, ప్రకృతి వనరులను తీసుకోవడం, అదే కాకుండా, ఆ వనరులను, ఒక ప్రైవేటు కంపెనీకి ధారాదత్తం చేయడం, ప్రజాస్వామ్య వ్యవస్థను కించపరిచినట్లు అవుతుంది.
GOMs No 66 (15-9-2022) లో, ఇండోసోల్ కంపెనీ వారు ,మొదటి దశ (రామాయంపేట) లో 5,013 మందికి,రెండవ దశలో 4,072 మందికి, మూడవ దశలో 4,215 మందికి , ఉద్యోగ అవకాశాలు కలిగిస్తామని హామీ ఇచ్చినట్లు ప్రభుత్వం తెలియచేసింది. రామాయంపేటలో, కంపెనీ ఆ హామీని నిర్వర్తించారా లేదా అనే విషయాన్ని, GOMs No 43 (25-3-2025) లో ప్రభుత్వం ప్రస్తావించకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. రామాయంపేట యూనిట్ పనిచేయడం మొదలు పెట్టినప్పుడు వచ్చిన వార్తల ప్రకారం, ఆయూనిట్ లో, హామీ ఇచ్చిన 5,013 మందికి బదులు, కేవలం 800 మందికి మాత్రమే ఉద్యోగాలు లభించాయని స్పష్ఠమైంది. ఆ 800 మంది లో,ఎంతమంది స్థానికులు? ఎంతమంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు? స్థానికులలో, ఎంతమంది సీనియర్ ,సాంకేతిక బాధ్యత లలో నియమించబడ్డారు?
అంటే, కంపెనీవారు మూడు దశల్లో హామీ ఇచ్చిన 11,500 ల ఉద్యోగాలు, సాధ్యం అవ్వని హామీ. కాని మీ ప్రభుత్వం మూడు నెలల క్రింద (25-3-2025) జారీచేసిన GOMs No. 43 లో మాత్రం, కంపెనీ, తన ప్రాజెక్టు ద్వారా, 13,500 మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పడం, అటువంటి ఉత్తర్వులు ఇచ్చే ముందు మీ ప్రభుత్వ అధికారులు, కంపెనీ ఏది చెబితే, అదే మాట ఎటువంటి పరిశీలన చేయకుండా , పలుకుతున్నారని అర్థమవుతున్నది. ప్రభుత్వం, ప్రజల తరఫున పని చేయాలి కాని, కంపెనీ తరఫున పని చేయకూడదు అని గుర్తించాలి. మొదటి దశలోనే హామీని ఉల్లంఘించిన కంపెనీ, 13,500 మందికి ఉద్యోగాలివ్వగలదని ప్రభుత్వం తెలియ చేయడం, ఎంతవరకు సబబు? ఒకవైపు వేలాదిమంది వ్యవసాయాధారిత ఉపాధులకు భంగం కలిగించి, కంపెనీ కేవలం 13,500 ఉద్యోగాలు కలిగిస్తామనడం హాస్యాస్పదంగా ఉంది. స్థానిక ప్రజలకు చిన్నకారు ఉద్యోగాలు (menial jobs) ఇచ్చి, దాంతో సరిపెట్టుకోమనడం, ఇంకా హాస్యాస్పదం.
మీద సూచించిన GOMs ల లో, ప్రభుత్వం విచ్చలవిడిగా, ప్రజల దైనందిక అవసరాలకు తోడ్పడే నీటి వనరులను, ముఖ్యంగా స్థానికంగా ప్రజలు ఆధారప డే చెరువులు, ప్రజాధనాన్ని వ్యయించి కట్టిన కనిగిరి, సంగం, సోమశిల రిజర్వాయర్ ల నుంచి, 115 మిలియన్ లీటర్ల ను, కంపెనీకి, రాయితీలతో సహా సమర్పించడం ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం. సోమశిల రిజర్వాయర్ నుంచి, ఇండోసోల్ కంపెనీకి, అంత అధికంగా నీటిని ఇవ్వడం సాధ్యంకాదని రాష్ట్ర జలవనరుల శాఖ సమాచారం ఆధారంగా స్పష్ఠమవుతున్నది. అంత నీటిని ఇండోసోల్ కంపెనీకి తరలిస్తే, రిజర్వాయర్ క్రింద ఆయకట్టు దారులకు, ప్రజల తాగునీటి అవసరాలకు భంగం కలుగుతుందని ప్రభుత్వం గుర్తించాలి. ఆ విషయంలో రాష్ట్ర జలవనరుల విభాగం అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, ప్రభుత్వం వారి అభ్యంతరాలను తోసిపుచ్చి, కంపెనీ కి అనుగుణంగా ఉత్తర్వులు ఇచ్చింది అని తెలుస్తున్నది.
కెజిఎఫ్
KGF: కరేడు గోల్డ్ ఫీల్డ్స్
ప్రభుత్వం ఇండోసోల్ కంపెనీ వారికి అనుగుణంగా, ఖనిజ నియంత్రణకు సంబంధించిన నియమాలను సడలించి, ప్రాజెక్టుకు కావాల్సిన ఖనిజాల మీద కూడా ఎన్నో విధాలుగా రాయితీలు ఇవ్వడం జరిగింది.
ఇక, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఇండోసోల్ కంపెనీకి, ఉదారంగా ప్రజలనిధులనుంచి ఇచ్చిన రాయితీల విషయం. ఆ కంపెనీ, మనసరిహద్దు దేశమైన చైనా నుంచి, దిగుమతి చేసే 94 ఐటమ్ లలో, 65 ఐటెమ్ లను దిగుమతి చేస్తున్నది . అటువంటి ఐటమ్ లను మనదేశంలోనే తయారుచేసే కార్యక్రమం మీద, కంపెనీ పెద్దగా దృష్టి పెట్టలేదని తెలుస్తున్నది. అటువంటి కంపెనీకి, కేంద్ర ప్రభుత్వం, 5,175 కోట్ల రూపాయలు రాయితీలుగా ఇవ్వడమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం 14,152 కోట్ల రూపాయలు ప్రత్యక్షంగా, అంతకు రెండు రెట్లు అధికంగా పరోక్షంగా, రాయితీలు ఇస్తున్నది.
కంపెనీ ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టే పెట్టుబడి, ప్రభుత్వం, మీద సూచించిన GO ల ద్వారా తెలియజేసే సమాచారం ఆధారంగా, 69,000 కోట్ల రూపాయలు మాత్రమే. అందులో, 50,000 కోట్ల రూపాయలు కేంద్రం, రాష్ట్రం, ప్రజల నిధుల నుంచి ఇచ్చిన రాయితీలు. అదేకాకుండా, కంపెనీ బ్యాంకుల నుంచి, ముఖ్యంగా, ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న బ్యాంకుల నుంచి, రాబట్టుకునే రుణాలు కూడా ఉండవచ్చు. అటువంటి నేపథ్యంలో, కంపెనీ మీద ఖర్చే కాకుండా, నష్టాలు కూడా భరించేది ప్రజలు, లాభాలు గణించేది కంపెనీ, అనే విషయం స్పష్టమవుతోంది.
మన రాష్ట్రంలో పరిశ్రమల వలన కలిగే కాలుష్యాన్ని నియంత్రణ చేయవలసిన వ్యవస్థల బలహీనత కారణంగా, ఇండోసోల్ కంపెనీ ప్రాజెక్టు, ఆ ప్రాంతంలో కాలుష్యం కలిగించే అవకాశం ఉంది. ఆ కాలుష్యం వలన ప్రజల ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది.
2013 భూసేకరణ చట్టం క్రింద ప్రభుత్వం నిష్పాక్షికమైన వ్యవస్థ చేత, ఈ దృక్పథంలో, మీద సూచించిన విధంగా అధ్యయనం చేయించి ఉంటె, ఈ విషయాలే కాకుండా, ఇతర విషయాలు కూడా, ఇంకా స్పష్టంగా బయట పడి ఉండేవి. మీ ప్రభుత్వం, ఆ కారణం దృష్టిలో పెట్టుకునే, ప్రాజెక్టును ప్రజలకు వ్యతిరేకంగా, ఆ సెక్షన్ పరిధి నుంచి మినహాయింపు ఇచ్చింది అని అర్ధమవుతున్నది.
ప్రభుత్వం గెజిట్లో ప్రచురించిన నోటీసులలో, కంపెనీ APIIC కి ఇచ్చిన దరఖాస్తు మీద ఆ సంస్థ ఎటువంటి పరిశీలన చేసింది, APIIC జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చిన లేఖ మీద జిల్లా కలెక్టర్ గారు ఎటువంటి కారణాల ఆధారంగా, ముందస్తు ప్రజల సమ్మతి తీసుకోకుండా నోటీసులు ఇచ్చారు అనే వివరాలు తెలియ చేయకపోవడం బాధాకరం.
ఇన్ని విధాలుగా, నా ఉద్దేశంలో, కరేడు భూసేకరణ ప్రాతిపదిక ఆలోచనా రహితంగా ఉంది. వేలాదిమంది ప్రజల జీవనోపాధులకు నష్టం కలిగించే అటువంటి ప్రోజెక్టులకన్నా, కరేడు ప్రాంతంలో వరి, ప్రసిద్ధి చెందిన మామిడి తోటలు, కూరగాయలు పండించే వ్యవసాయదారులకు, మత్స్యకారులకు, ప్రభుత్వం సరిఅయిన చేయూత ఇస్తే, ఆ ప్రాంత ఆర్థిక పరిస్థితి మెరుగుపడమే కాకుండా, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుంది.
పరిశ్రమాభివృద్ధి ముసుగులో, రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేటు కంపెనీలకు ఇస్తున్న రాయితీలకు అంచనా కట్టడం కష్టం. వ్యవసాయ కార్యక్రమాలు, మత్స్య కారుల కార్యక్రమాలు, పాడి పరిశ్రమ కూడా, మన ఆర్థిక వ్యవస్థను పెంపొందించే ప్రాథమిక పరిశ్రమలని, ఆ మూడు కార్యక్రమాలకు నష్టం కలిగించే బదులు, వారికి చేయూత ఇవ్వవలసిన అవసరం ఉందని, ప్రభుత్వం గుర్తించాలి.
మీద ప్రస్తావించిన విషయాలు, కరేడు ప్రాంత ప్రజలలో, బాధాకరమైన చర్చ అంశాలు అవ్వడం ప్రభుత్వం దృష్టికి కూడా వచ్చి ఉండవచ్చు.
కర్ణాటక రాష్ట్రంలో, దెవనహళ్లి ప్రాంతంలో, 13 గ్రామాల్లో, అదేవిధంగా, అక్కడి ప్రభుత్వం, 1,777 ఎకరాల వ్యవసాయ భూమిని, ఏరోస్పేస్ పరిశ్రమ కోసం, రైతుల వద్ద నుంచి బలవంతంగా సేకరించే ప్రక్రియ చేపట్టిన సందర్భంగా, ప్రజలు, "మమ్మల్ని, మా భూములను వదలండి" అనే నినాదంతో, 1,180 రోజుల పాటు ఉద్యమం చేసిన తదుపరి, రాష్ట్ర ప్రభుత్వం, వారి నినాదాన్ని గౌరవించి, భూసేకరణ ప్రక్రియ ను వెనక్కి తీసుకోవడాన్ని మీకు గుర్తు చేస్తున్నాను ప్రజాస్వామ్య వ్యవస్థలో, ప్రభుత్వాలు, ప్రజల తరఫున పనిచేస్తూ, ప్రజలకు జవాబుదారీగా ఉండడం అవసరం.
మీద సూచించిన విషయాలను ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిశీలించి, అక్కడి ప్రజల ఉద్దేశాలను గౌరవించి, ఇండోసోల్ కంపెనీ ప్రాజెక్టు కోసం చేపట్టిన భూసేకరణ ప్రక్రియ నుంచి విరమించుకుంటారని ఆశిస్తున్నాను.