సరిలేదు ఈ ‘వరి’కి.. సేద్యంలో వైవిధ్యం !!
ఆహారం నుంచి ఆరోగ్యవంతమైన సమాజం కోసం ఓ జంట చేస్తున్న ప్రయత్నం.
దేశవ్యాప్తంగా 74 శాతం కంటే ఎక్కువ మంది మహిళలు వ్యవసాయ పనుల్లో ఉన్నారు.
సగటున రెండున్నర ఎకరాల పొలంలో స్త్రీలు 557 గంటలు నాట్లు వేస్తారు. 640 గంటలు కలుపు తీస్తారు. 384 గంటలు నీటి పని చూస్తారు. 984 గంటలు కుప్పలేసి నూర్చుతారని ఒక సర్వే అంచనా. వ్యవసాయ పనులలో, ఆహారోత్పత్తిలోని అన్ని దశల్లోనూ నిత్యం చెమట చిందించే వారంతా మహిళా రైతులే. అయినా వీళ్లను రైతులుగా గుర్తించరు.
ఒక రైతు కుటుంబం దగ్గరకు వెళ్లి, ఈ ఇంట్లో రైతు ఎవరని అడిగితే, ఆ ఇంటామె ఎంత శ్రమ చేసినప్పటికీ మగవాళ్లనే రైతులుగా చూపించడం కామన్.
కానీ, జక్కుల తిరుపతి ఇంటికి వెళ్లి అడిగితే, తన భార్యే రైతు, నేను ఆమె దగ్గర కూలీని అని గర్వంగా చెబుతాడు.
ద్రవ జీవామృతం తయారీలో రేణుక భర్త తిరుపతి
ఏమిటీ ఆమెలో ప్రత్యేకత?
వరి అంటే పచ్చని పైరు, తెల్లని బియ్యమనే అందరికీ తెలుసు. కానీ, నల్లని, ఎర్రని పైరులు కూడా ఉన్నాయి. అరుదుగా పండిస్తున్నారు. ఈ బియ్యం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయట. అందుకే డిగ్రీ వరకు చదివిన జక్కుల రేణుక సిద్ధిపేట జిల్లా, తొగుట మండలం లింగాపూర్లో 3 ఎకరాల్లో నల్ల వరిని సేంద్రియ పద్దతిలో సాగుచేస్తున్నారు.
మహిళా రైతు జక్కుల రేణుక
‘‘ పంటలు వేసే ముందు, మా నేలను ప్రకృతి సాగుకు అనువుగా మార్చాం.
భూమి లోపలి పొరలలో నివసించే వానపాములు, భూమి నుండి 3 మీటర్ల వరకు తొలచుకుంటూ వెళ్ళి, నేలల్లో బొరియలు చేస్తూ, మట్టిని తిరగతోడి నేలను గుల్ల పరుస్తాయి. దీనివల్ల వర్షం పడినపుడు నీరు పల్లానికి జారిపోకుండా పొలంలోనే ఇంకుతుంది. వానపాములు విసర్జించే వ్యర్థాలతో పంటలకు కావాల్సిన పోషక పదార్థాలు సమకూరుతాయి. అయితే రసాయనిక ఎరువులు విచ్చలవిడిగా వాడుతుండడంతో ఇవి కనుమరుగవుతు న్నాయి. భూమిని సారవంతం చేసే ఇతర సూక్ష్మజీవులు కూడా నశించిపోతున్నాయి.
అందుకే, మేం కెమికల్స్ జోలికి పోకుండా, పశువుల పేడ, మూత్రాన్ని సేకరించి అందులో శనగపిండి, బెల్లం కలిపి జీవామృతాన్ని తయారు చేసి, వారానికోకసారి పొలంలో చల్లుతున్నాం. దీని వాసనకు వానపాములు అభివృద్ధి చెందాయి. అవి, 90 శాతం మట్టిని 10 శాతం వ్యవసాయ వ్యర్థ పదార్దాలను ఆహారంగా తీసుకుంటాయి. వర్మీ కంపోస్టు వల్ల మిత్ర సూక్ష్మజీవులు పెరిగి భూమిలో సారం పెరుగుతుంది. దీంతో పంటలకు చీడపీడలను తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది.’’ అని భూసారం ప్రాముఖ్యతను వివరించారు రేణుక. కషాయాలు తయారు చేయడంలో ఆమె భర్త తిరుపతి ఆమెకు సహకరిస్తున్నారు.
మూడు ఎకరాలు 51 రకాలు
ప్రస్తుతం నాలుగైదు రకాల పాలిష్ బియ్యానికే ప్రజలు అలవాటు పడ్డారు. ఫలానా బియ్యంతో వండితేనే ముద్ద దిగుతుందని చాలా మందంటారు. అయితే వరిలో 51 రకాల వంగడాలు పండిస్తున్నారు రేణుక. ఇందులో చాలావరకు నాటు రకం విత్తనాలే. రెండేళ్ల క్రితం ఆమె,‘భారత్ బీజ్ స్వరాజ్’ సంస్థ నుండి, కాలా బట్టి(నల్లబియ్యం), చింతలూరు సన్నాలు, దశుమతి రకం, చిట్టి ముత్యాలు విత్తనాలను సేకరించి పండిరచింది. వాటికి డిమాండ్ ఏర్పడటంతో ప్రస్తుతం 3 ఎకరాలను చిన్న కమతాలుగా మార్చి 51 రకాల వరి విత్తనాలు అభివృద్ధి చేశారు.
ఈ సాగు ఎక్కడ మొదలైంది?
పూర్వం రైతులు, అవసరమైన పోషకాలు, ప్రత్యేక ఔషధ విలువలు కలిగిన ఆహార ధాన్యాలను సంప్రదాయ పద్ధతిలో సంకర పరిచి, తరతరాలుగా కాపాడారు. హరిత విప్లవంతో, అధిక దిగుబడినిచ్చే వంగడాలు అందుబాటులోకి రావడంతో, సంప్రదాయ వంగడాలు కనుమరుగయ్యాయి. అలాంటి వాటిలో ‘నల్లధాన్యం’ ‘ఎర్రధాన్యం’ ముఖ్యమైనవి. కరువు ప్రాంతాల్లో కూడా దిగుబడినివ్వడం వీటి ప్రత్యేకత.
వరి కంకులతో రేణుక
మొక్కలే కాదు, ధాన్యం కూడా కారు నలుపులో, ఊదా రంగులో ఉంటాయి. వండిన అన్నం కూడా అదే రంగులో రుచిగా ఉంటుంది. గంజి వార్చి తాగితే పోషకాలు అధికంగా అందుతాయి. మణిపూర్,బెంగాల్, అసోం, ఒడిశా రాష్ట్రాల్లో స్వల్ప విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేస్తున్నారు. కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణల్లోనూ అక్కడక్కడా వీటిని సాగు చేయనారంభించారు.
నాలుగు నెలల పంట
రెండేళ్ల నుంచి రేణుక ఈ రైస్ను శ్రీవరి విధానంలో సాగు చేస్తున్నారు. సాధారణంగా వరికి ఒక ఎకరానికి 50 నుండి 60కిలోల విత్తనాలు అవసరం. శ్రీ పద్ధతిలో 2 కిలోల విత్తనం సరిపోతుంది. కలుపు నివారణ సులువు. ఎకరానికి 20 బస్తాల (75 కిలోలు) వరకు దిగుబడి వస్తోంది. పంటకాలం 4 నెలలు. సుగంధాన్నిచ్చే రైస్ , రెడ్ రైస్ (నవర)ను కూడా సాగు చేస్తున్నారు.
ఉచితంగా విత్తనాలు
‘‘ సాధారణ వరి రకాలను పోల్చితే సగం దిగుబడి మాత్రమే వచ్చే ఈ వంగడాన్ని అరుదుగా పండిస్తున్నారు. కాబట్టి డిమాండ్ పెరిగి, కిలో బియ్యం రూ.150 కి పైగా ధర పలుకుతున్నది. ఎక్కువ మంది రైతులు పండిస్తే ధర తగ్గుతుంది. ఆరోగ్యవంతమైన సమాజం కోసం అలాంటి వారిని ప్రొత్సాహించడానికి 50రకాల వరి విత్తనాలు ఉచితంగా అందజేస్తాను. 9000269724 నంబర్లో సంప్రదించవచ్చు.’’ అన్నారు రేణుక.
తమతో పాటు ప్రకృతి సాగు చేస్తున్న రైతులతో త్వరలోనే నాటు వరి విత్తనాల జాతరను నిర్వహించాలనుకుంటున్నామని ఆమె అంటారు.
పొలంలో మొలకెత్తిన అక్షరాలు
ఆకుపచ్చని కాన్వాస్ పై నల్లని అక్షరాలు రాసినట్టుగా, వరిసాగులో నల్లవిత్తనాలతో బొమ్మలు వేయడం, పేర్లు రాయడాన్ని టాన్బో ఆర్ట్ అంటారు. ఈ కళను జపాన్ దేశపు రైతులు కనిపెట్టారు.
తెలుగురాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఎవరూ ప్రయత్నించని ఈ కళను మొదటిసారిగా తన భర్త తిరుపతి సహకారంతో రేణుక తన వ్యవసాయ క్షేత్రంలో ప్రదర్శించారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్, పేర్లను వరి పంటలో నల్లవరినారు తో రాశారు. త్వరలో సేంద్రియసాగు సూత్రాలను రాసి రైతుల్లో అవార్నెస్కు తోడ్పతామని అంటున్నారు.
కే సి ఆర్ పేరున నాట్లుతో డిజైన్ చేసిన రేణుక
అరుదైన ఔషధ గుణాలు
మణిపూర్ సంప్రదాయ వైద్యంలో నల్ల బియ్యాన్ని ఔషధంగా వాడతారు. సామూహిక ఉత్సవాల్లో ఈ రైస్తో వండిన ‘చాక్హావో’ అనే వంటకాన్ని వడ్డిస్తారు. బ్లాక్ రైస్లో అనేక పోషక విలువలతోపాటు విశిష్ట ఔషధ గుణాలు ఉన్నట్టు పరిశోధనల్లో తేలింది. రోగనిరోధక శక్తిని పెంచడం, కేన్సర్ను నిరోధించడం ఈ బియ్యం ప్రత్యేకత.
బ్లాక్ రైస్ పండిస్తున్న పొలంలో weeding చేస్తున్న రేణుక
‘‘ బ్రౌన్, రెడ్ రైస్తో పోలిస్తే బ్లాక్రైస్లో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం ,విటమిన్ బీ, విటమిన్ ఈ, కాల్షియం, పీచు పదార్థాలు వంటి పోషకాల మోతాదు అధికంగా ఉంటుంది. నల్లబియ్యం పాలిష్ పడితే తెల్ల గానే ఉంటాయి. పైపొర తీయకుండా వండుకొని తింటే, గ్లైసిడిన్ తక్కువగా ఉండటం వల్ల షుగర్ పేషెంట్లకు కూడా మేలు చేస్తుంది.’’ అంటారు, నల్గొండ జిల్లా, వరి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త, డాక్టర్ సీహెచ్ దామోదర్రాజు.
జీవామృతంతో సాగుచేస్తున్న నల్ల బియ్యం గంజిని ముఖానికి రాసు కుంటే మచ్చలు, మొటిమలు తగ్గుతాయని, తలకు పట్టిస్తే వెంట్రుకలు బలంగా, అందంగా తయారవుతాయని, గుండె సమస్యల పరిష్కారంలో బాగా పనిచేస్తాయని పౌష్టికాహార నిపుణులంటున్నారు.
వీరిని స్ఫూర్తిగా తీసుకొని మరో 50 మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారు. రసాయనాలు లేని పంటలను సాగుచేసి, లింగాపూర్ని ప్రకృతి పంటల గ్రామంగా మార్చడమే లక్ష్యంగా, ప్రకృతి నుంచి అడవి... అడవి నుంచి వ్యవసాయం...అక్కడి నుంచి ఆహారం
ఆహారం నుంచి ఆరోగ్యవంతమైన సమాజం కోసం శ్రమిస్తున్న ఈ జంటకు వరి కంకులు వంగి సలాం చేస్తున్నాయి.