వైద్యరంగంలో సహకారానికి తలుపులు తెరిచిన చైనా పర్యటన

వైద్యులకు, విద్యార్ధులకు, యువజన బృందాలకు ఇతర రంగాల నిపుణులకు చైనా సంస్థలలొ శిక్షణ పొందే అవకాశం ఇచ్చే ఒప్పందం కుదరింది;

Update: 2025-06-18 02:42 GMT

vwభారత- చైనా 7 వ సంయుక్త వైద్య బృందం కార్యక్రమాలలో భాగంగా, చైనా దేశపు ఆహ్వానం పై భారత చైనా మిత్ర మండలి తరఫున ఇటీవల 11 మంది భారతీయ వైద్యుల బృందం ఆ దేశాన్ని సందర్శించి వచ్చింది. 9-06-2025 నుండి 15-06-2025 వరకు ఆ బృందం కున్మింగ్, గుయాంగ్, బీజింగ్ నగరాల లోను, గుయిజౌ ప్రొవిన్స్ లోని షిబింగ్ జిల్లాలోని అనేక గ్రామీణ ప్రాంతాలలోనూ పర్యటించింది.

ఈ బృందం బీజింగ్ లోని భారీ ఆసుపత్రులు, గుయిజౌ రాష్ట్ర రాజధానిలోని మూడువేల పడకల ఆసుపత్రుల నుండి, 600 జనాభా గల గిరిజన గ్రామంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వరకు అనేక స్థాయిలలోని వైద్య సంస్థలను సందర్శించింది. ప్రపంచ స్థాయిలో ఆపరేషన్లు నిర్వహిస్తున్న చెవి ముక్కు గొంతు ఆసుపత్రి నుండి, 60 వేల జనాభాకు బాధ్యత వహించే పట్టణ వ్యాధి నివారణ కేంద్రం వరకు,20 వేల మంది విద్యార్ధులకు శిక్షణ ఇస్తున్న చైనా సంప్రదాయ వైద్య విశ్వ విద్యాలయం నుండి జినోమ్ సీక్వెన్సింగ్ లో అధునాతన పరిశోధనలు సాగిస్తున్న ప్రయోగశాలల వరకు, కృత్రిమ మేధను అభివృద్ధి చేస్తున్ననైపుణ్య కేంద్రాల నుండి ఆరోగ్య రంగం లో డిజిటల్ విప్లవాన్ని సాధిస్తున్నసంస్థల వరకు పరిశీలించి, అక్కడి అభివృద్దిని అధ్యయనం చేయటం జరిగినది. అలాగే రెండు చోట్ల ఉచిత వైద్య శిబిరా లలో పాల్గొని ప్రత్యక్షంగా అక్కడి రోగులను పరీక్షించి మన డాక్టర్లు సలహాలు ఇచ్చారు.

గతంలో డాక్టర్ కోట్నిస్ పేర ఏర్పడిన ఆరు సంయుక్త వైద్య బృందాలు ఈ విధంగా కలిసి కృషి చేశాయి . 2019 లో కోవిడ్, తరువాత సరిహద్దు వివాదాల వంటి అనేక రాజకీయ కారణాల వల్ల వాయిదా పడిన ఈ కార్యక్రమాలను 7 సంవత్సరాల విరామం తరువాత CPAFFC [ విదేశాలతో మైత్రిని నెలకొల్పే చైనా ప్రజా సంస్థ] పూనిక పై తిరిగి ప్రారంభించాము. ఈ పర్యటనలో డాక్టర్లు పరిశీలించిన అంశాలను, వారి అనుభవా లను వివరించటానికి భారత చైనా మిత్ర మండలి 18-06-2025 న ఒక సమావేశం ఏర్పాటు చేసింది.


బీజింగ్ లో CPAFFC( China peoples association for friendship with foreign countries) ఉపాధ్యక్షుడితో భారతీయ వైద్య బందం

ఇరు దేశాల మధ్య అవగాహన, మైత్రి పెంపొందాలనే ఆశయంతో 2010 నుండి మిత్ర మండలి వైద్యులు ఈ కార్యక్రమంలో భాగస్వాము లవుతున్నారు. ఇప్పటికి ఆరు బృందాలు కలిసి ఇరు దేశాలలో పర్యటించా యి. వైద్య రంగంలో రెండు దేశాలలో జరుగుతున్న అభివృద్దిని పరిశీలించటం, అధ్యయనం చేయటం, మేలైన అంశాలను ఒకరినుండి మరొకరు నేర్చుకోవటం, మన ప్రజలకు చక్కని వైద్య విధానాలను అందిం చటం ఈ పర్యటన ఉద్దేశ్యం. అలాగే వైద్య సంస్థల మధ్య అవగాహన కుదుర్చుకుని వైద్య రంగ అభివృద్దికి కృషి చేయటం, అంతకు మించి రెండు దేశాల ప్రజల మధ్య స్నేహ సౌహార్దాలను పెంపొందింప చేయటం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం. భవిష్యత్తులో కూడా ఇలాంటి పర్యటనలు, శాస్త్ర సాంకేతిక మార్పుల్ని అధ్యయ నం చేసే అవకాశాలను కొనసాగించటానికి వీలుగా CPAFFC సంస్థతో ICFA ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. దీనివల్ల వైద్యులకు, విద్యార్ధులకు, యువజన బృందాలకు ఇతర రంగాల నిపుణులకు చైనా సంస్థలతో సమావేశమయ్యే , శిక్షణ పొందే అవకాశం లభిస్తుంది. 

బీజింగ్ లోని ఒక ENT  ఆసుపత్రిలో భారతీయ వైద్య బృందం

జపాన్ ఫాసిస్టులను ఎదిరిస్తూ 1940 లలో చైనా సాగించిన వీరోచిత పోరాటంలో వైద్య సేవలు అందించ టానికి వెళ్ళి అక్కడే ప్రాణాలు కోల్పోయిన భారతీయ వైద్యుడు డా. శాంతారాం కోట్నిస్ జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న ఈ వైద్య బృందాల కార్యక్రమాలు ఆ అంతర్జాతీయ మైత్రీ వారసత్వాన్ని నిలబెట్టటానికి, మంచి ఇరుగు పొరుగుల సంబంధాలు నెలకొల్పటానికి తోడ్పడతాయని మేము భావిస్తున్నాము. . ఇరు దేశాల మధ్య కొన్ని సందేహాలు, సంకోచాలు, సంఘర్షణలు ఉన్నప్పటికీ, అనేక అంతర్జాతీయ సంస్థలలో రెండు దేశాలు కలిసి పని చేస్తున్నాయి. ఇరు దేశాల మధ్య 120 బిలియన్ డాలర్ల పైగా వాణిజ్యం జరుగు తోంది. ఇరు దేశాల ఆర్ధిక వ్యవస్థలు బలపడటానికి ఇది ఎంతో దోహద పడుతున్నది. అయితే ప్రజలు ఆశించిన మేరకు ఈ సంబంధాలు బలపడటంలేదు. పెత్తందారి దేశాల ప్రభావంతో మన ప్రభుత్వాలు తరచుగా చైనా వ్యతిరేక వ్యూహంలో భాగస్వాములవుతున్నాయి. ప్రపంచ ఆధిపత్య శక్తుల నుండి విడివడి, శత్రు భావనలు విడనాడి, ఆసియా దిగ్గజాలుగా ఒకరికొకరు సహకారంతో, ప్రజాతంత్ర పరిరక్షకులుగా అభివృద్ధి పథంలో సాగాలని మిత్ర మండలి కోరుకుంటున్నది.

ప్రజల మధ్య సత్సంబంధాలు, ప్రభుత్వాల మధ్య సదవగాహన నెలకొనడానికి చైనా ప్రభుత్వం ఎంతో ఆసక్తి చూపుతున్నదని మేము గమనించాము. అక్కడి అధికార వర్గాలు ఎంతో స్నేహభావంతో, సహకార వైఖరితో వ్యవహరించటం కళ్ళారా చూడగలిగాము. భారతీయుల పట్ల అక్కడి ప్రజలు కూడా ఎంతో ప్రేమానురాగాలు చూపిస్తున్నారు. మన అధికార వర్గాలు అంత సానుకూలంగా స్పందించ నప్పటికి ప్రజలు, ప్రజాసంఘాలు ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడాలని భావిస్తున్నాయి. చైనా సాధించిన సాంకేతిక, ఆర్ధిక ప్రగతిని భారత ప్రజలు కూడా సాధించాలని, ఇరు దేశాలు స్నేహ సహకారాలతో కలిసి సాగాలని ఈ వైద్య బృందం విజ్ఞప్తి చేస్తున్నది . ఈ స్నేహ యాత్రలు ఆ లక్ష్యానికి మార్గం చూపుతాయని, ఇరు దేశాలను చేరువ చేస్తాయని ఆశించవచ్చు. విజయవంతం గా పర్యటన ముగించుకు వచ్చిన బృందానికి ఈ సందర్భంలో శుభాకాంక్షలు తెలుపుదాము .



Tags:    

Similar News