తెలంగాణలో ముంచుకొస్తున్న కరువు

ప్రభుత్వం వెంటనే కరువు మండలాలను ప్రకటించి రైతులను ఆదుకోవాలి. MCHRD రూపొందించిన కరువు మాన్యువల్ ను అమలు చేసి రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలి

Update: 2024-03-26 07:33 GMT
తెలంగాణలో ఎండిపోతున్న పంటలు

(కన్నెగంటి రవి)

వాతావరణంలో వస్తున్న మార్పుల గురించీ, ప్రతి సంవత్సరం పెరుగుతున్న ప్రకృతి వైపరిత్యాల గురించీ, వీటి కారణంగా సాధారణ ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రజలు ఎదుర్కుంటున్న ప్రత్యేక నష్టాల గురించీ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాతావరణ శాస్త్రవేత్తలు చాలా కాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వాలు అనుసరిస్తున్న అభివృద్ధి నమూనాలోనే, ప్రజల జీవన విధానంలోనే ఇందుకు మూలాలు ఉన్నాయని కూడా ప్రకటిస్తున్నారు.

రకరకాల కాలుష్య కారక ఉత్పత్తి పద్ధతుల వల్ల, గాలిలో ఉద్గార వాయువులు పెరిగి, భూమి, సముద్ర ఉపరితలాలు వేడెక్కడం, మంచు కరిగి సముద్ర మట్టాలు పెరగడం - కరువులు, వర్షాభావ పరిస్థితులు, భారీవర్షాలు, తుఫాన్లు , వరదలు, వడగండ్లు, పిడుగులు పడడం లాంటి ప్రకృతి వైపరిత్యాలన్నీ పెరగడం వీటి ఫలితమే. ప్రకృతి వైపరిత్యాల బారిన పడే వారిలో అన్ని వర్గాల వాళ్ళూ ఉంటారు. కానీ, ఎటువంటి రక్షణా లేకుండా, ఆకాశం క్రింద చేసే ఉత్పత్తి ప్రక్రియ వ్యవసాయంలో ఉన్న రైతులు, కూలీలు, గ్రామీణ పేదలు వీటికి ఎక్కువగా గురై నష్ట పోతుంటారు. తెలంగాణ రైతులు కూడా ఇందుకు మినహాయింపు కాదు.
2020, 2021, 2022 సంవత్సరాలలో భారీ, అతి భారీ వర్షాల వల్ల తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోయారు. కానీ 2023-2024 సంవత్సరంలో వర్షపాత లోటు ఏర్పడింది. ఫలితంగా సాగు నీటి రిజర్వాయర్‌లలో, చెరువులలో నీరు తగ్గిపోతున్నది. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బోరు బావులు, బావులు ఎండి పోతున్నాయి. దీంతో సాగు నీరు అందక, కొన్ని జిల్లాలలో పంటలు ఎండి పోతున్నాయి. మరోవైపు, ఇంత కరువు పరిస్థితుల్లోనే కొన్ని జిల్లాల్లో వడగండ్ల వానలు కురిసి రైతులు తీవ్రంగా నష్టపోయారు.
గత ప్రభుత్వానికి భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వం వడగండ్ల వర్షాలకు నష్ట పోయిన రైతుల వివరాలను సేకరించే బాధ్యత వ్యవసాయ శాఖకు అప్పగించింది. నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 రూపాయల నష్ట పరిహారం అందిస్తామని కూడా ప్రకటించింది. ఇవి తప్పకుండా స్వాగతించాల్సిన చర్యలు.
అయితే వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో నష్టపోయిన రైతుల వివరాలను నమోదు చేసేటప్పుడు, ఇ-క్రాప్ బుకింగ్‌లో నమోదై ఉండే భూమి యాజమానుల పేర్లు రాసుకు రావడం కాకుండా, ఈ సీజన్‌లో సాగు చేస్తున్న కౌలు రైతులు సహా, వాస్తవ సాగు దారుల పేర్లు నమోదు చేయాలని ప్రభుత్వం ఖచ్చితమైన ఆదేశాలు వ్యవసాయ శాఖ సిబ్బందికి ఇవ్వాలి. ఆ మేరకు వివరాలు నమోదు చేసే ఫారంలో ప్రత్యేక కాలమ్ కూడా పెట్టాలి. లేకపోతే నిజమైన రైతులకు సహాయం అందదు. వ్యవసాయం చేయని భూ యజమానులకు కూడా ప్రభుత్వం చెల్లించే నష్ట పరిహారం వెళ్ళే అవకాశం ఉంది.
యాసంగిలో పంటల పొందిక:
2022-2023 యాసంగిలో ప్రధాన పంటలయిన వరి 56,44,800 ఎకరాలలో సాగయితే, 2023-2024 యాసంగిలో 50,69,326 ఎకరాలలో మాత్రమే సాగయింది. మొక్క జొన్న మాత్రం 2022-2023 లో 6,48,112 ఎకరాలు కాగా, 2023-2024 లో సాగు విస్తీర్ణం పెరిగి, 6,59,342 ఎకరాలు సాగయింది. జొన్న విస్తీర్ణం 2022-2023 లో 1,26,784 ఎకరాలు కాగా, 2023-2024 లో 2,30,111 ఎకరాలకు పెరిగింది. పెసర 2022-2023 లో 13,131 ఎకరాలు కాగా, కొద్దిగా పెరిగి, 2023-2024 లో 16,592 ఎకరాలు సాగయింది.
మిగిలిన పంటలలో శనగ, మినుము, నువ్వులు, కుసుమ, వేరుశనగ, ఇతర నూనె గింజ పంటల విస్తీర్ణం గణనీయంగా తగ్గింది.నిజానికి సాగునీటి అవసరాలు ఎక్కువ ఉండే పంటలను యాసంగిలో వేయకూడదని ఒక సాధారణ సూత్రం. కానీ తెలంగాణ ప్రభుత్వమూ, రైతులూ కూడా ఆ విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా, వరి, మొక్క జొన్న లాంటి సాగు నీరు ఎక్కువ అవసరమయ్యే పంటలను సాగు చేయడం ఆనవాయితీగా మారింది.
ప్రాజెక్టులు నిండి, యాసంగిలో కూడా గ్రావిటీ ద్వారా సాగు నీరు ఎక్కువగా పొలాలకు లభ్యమయ్యే పరిస్థితులు ఉన్నప్పుడు, నైరుతి ఋతుపవన కాలంలో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువ నమోదు అయినప్పుడు, ఈశాన్య ఋతుపవనాలు కూడా సాధారణ వర్షపాతం నమోదు చేసినప్పుడు యాసంగిలో వరి, మొక్క జొన్న లాంటి పంటలను వేశారంటే అర్థం చేసుకోవచ్చు.
కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నప్పుడు, వాతావరణ పరంగా వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశాల గురించీ, సాగు నీరు అందుబాటు పరంగా ఎదురయ్యే ఇబ్బందుల గురించీ ప్రభుత్వం యాసంగి సీజన్ ప్రారంభమయ్యే నవంబర్ చివరి లోనే, రాష్ట్ర రైతులనుహెచ్చరించి అందుకు సిద్దం చేయాల్సి ఉంటుంది. సాగు నీరు తక్కువ అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించాల్సి ఉంటుంది.
BRS ప్రభుత్వ తప్పుడు డిజైన్లతో, అవినీతితో నిర్మాణమైన కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం లాంటి ఘటనల వల్ల, అవకాశం ఉన్న కొద్ది పాటి నీళ్ళను కూడా గేట్లు లేపి, క్రిందికి వదిలేయాల్సి రావడం, కొత్తగా నీళ్ళను ఇప్పుడే లిఫ్ట్ చేయలేని పరిస్థితులు ఏర్పడడం కూడా తెలంగాణ యాసంగి రైతులకు శాపంగా మారింది. అన్ని పరిస్థితులూ బాగుండి, ఒక వేళ కొద్దిగా నీళ్ళను లిఫ్ట్ చేసినా, ఆ నీళ్లు ఇప్పుడున్న కరువు పరిస్థితులను మార్చడానికి ఏ మాత్రం పనికి వచ్చేవి కావన్నది వాస్తవం.
వాటిని తప్పకుండా ప్రజల తాగు నీటి అవసరాల కోసమే జాగ్రత్త చేసుకోవాల్సి ఉండేది. కానీ డిసెంబర్ 3 వరకూ తెలంగాణను పరిపాలించిన BRS ప్రభుత్వం కానీ, డిసెంబర్ 7 న అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఎన్నికలలో మునిగి పోయి యాసంగి సీజన్‌కు ఎదురయ్యే పరిస్థితుల గురించి పట్టించుకోలేదు. “ఏది ఆగినా వ్యవసాయం ఆగదు“ అని భారత మొదటి ప్రధాని నెహ్రూ ఒక సందర్భంలో అన్నారు.
ఎలాంటి ప్రత్యేక పరిస్థితులలోనైనా ప్రభుత్వాలు పని చేయాల్సి ఉంటుందని దీని సారాంశం. నిజానికి, వ్యవసాయ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు నిరంతరం దీనిపై దృష్టి సారించి రైతులతో కలసి పని చేయాల్సి ఉంటుంది. మన రాష్ట్రంలో గత ప్రభుత్వం ఈ రెండు వ్యవస్థలనూ పూర్తిగా నిర్వీర్యం చేసింది. 2022, 2023 సంవత్సరాలలో వ్యవసాయ శాఖ, సంవత్సర ప్రణాళికలనే విడుదల చేయలేదంటే, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

2023-2024 లో తగ్గిన వర్షపాతం : 

నెల

సాధారణ వర్షపాతం (మిల్లీ మీటర్లు)

2021-2022 వర్షపాతం (మిల్లీ మీటర్లు)

2022-2023 వర్షపాతం

(మిల్లీ మీటర్లు)

2023-2024 వర్షపాతం (మిల్లీ మీటర్లు)

జూన్

 129.3 

194.5 

150.6

 72.60

జులై 

244.3 

353.0

 539.9

 490.0

ఆగస్ట్ 

 219.6 

185.7

 186.2

 79.90

సెప్టెంబర్

 127.9

 276.2

 222.1 

218.60 

మొత్తం నైరుతి

 721.2 

1009.5

 1098.8

 861.10

అక్టోబర్

 95.5

 66.0

 117.8

 6.50

నవంబర్

 23.9

 26.6 

0.90

 20.60

డిసెంబర్ 

5.50 

0.0 

7.10

 25.60 

మొత్తం ఈశాన్య

 124.90

 86.60 

125.80 

52.70 (లోటు)


జనవరి

 6.80 

0.0

 0.60 

0.0 (వర్షాలు కురవలేదు )

ఫిబ్రవరి

 4.60

 0.0

 0.10

 0.10 (తీవ్ర లోటు)

మార్చ్

 4.90

 0.0 

0.10

 0.10(తీవ్ర లోటు ) 

మొత్తం

 862.40

 1138.60 




ఆధారం: వ్యవసాయ శాఖ వీక్లీ రిపోర్ట్స్ ( 15-03-2023 ,13-03-2024 )
చూడడానికి 2023-2024 లో కూడా సాధారణ వర్షపాతం నమోదైనట్లు కనిపిస్తున్నా, గత రెండు సంవత్సరాలతో పోల్చినప్పుడు ఈ సంవత్సరం వర్ష పాతం గణనీయంగా తగ్గింది. పైగా ఈ సంవత్సరం గత మూడు నెలల్లో వర్షం అసలు లేకపోవడమో, తీవ్ర లోటు ఏర్పడడమో జరిగింది. నవంబర్, డిసెంబర్ నెలల్లో కురిసిన అధిక వర్షపాతం నిజానికి ఆ సమయంలో పత్తి పంటకు నష్టం చేయడమో, కల్లాలపై ఉన్న ధాన్యాన్ని తడపడమో తప్ప, నిజంగా పంటలకు ఉపయోగపడేది కాదు.
పైగా ఈ వ్యవసాయ సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ మధ్య ఈశాన్య ఋతు పవనాల వర్షాలలో కూడా లోటు ఏర్పడింది. ప్రస్తుతం భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోవడానికి ఇవన్నీ కారణమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా ఎదురయ్యే అవకాశం ఉంది కనుకనే, సాధారణంగా యాసంగిలో వరి సాగు చేయకూడదు అని చెబుతారు.
అడుగంటుతున్న రిజర్వాయర్లు : (మార్చి 13 నాటి పరిస్థితి) (నిల్వ TMC లు)

క్రమ సంఖ్య

ప్రాజెక్టు పేరు

2022-2023

2023-2024 

జూరాల 

4.80

 3.82 

2

తుంగ బధ్ర

 20.15

 6.66

3

శ్రీశైలం 

39.85 

35.48

4

నాగార్జున సాగర్ 

185.63

 138.66

5

పులి చింతల

 42.87

 4.86 

6

సింగూర్

 21.01 

19.78

7

నిజాం సాగర్

 8.22

 6.78 

8

శ్రీరామ సాగర్ 

37.61

 23.26 

9

మిడ్ మానేరు

 19.14 

11.41 


10

లోవర్ మానేరు

 12.66 

7.03

11

కడం 

4.60

 3.01

12

ఎల్లమ్ పల్లి

 17.09

 9.50


మొత్తం 

413.63

 270.15

గురువింద గింజలు హరీష్ రావు, KTR :

భారాస ప్రభుత్వంలో కీలక శాఖల మంత్రులుగా పని చేసిన KTR, హరీశ్ రావు ప్రస్తుతం ప్రతిపక్ష నేతలుగా వీరంగం వేస్తున్నారు. తమ పరిపాలనా కాలంలో ఎప్పుడూ పట్టించుకోని రైతుల ఆత్మహత్యల గురించి వాపోతున్నారు. పంటలకు నష్టపరిహారం గురించి డిమాండ్ చేస్తున్నారు. మాట్లాడే విషయాలు న్యాయమైనవైనా, వారి హిపోక్రసీ స్పష్టంగా కనపడుతున్నది.

నీటి పారుదల రంగంలో, వర్షాభావ పరిస్థితులు, కరువు కాటకాలు ఏర్పడినప్పుడు, పంటలు ఎండిపోయి, భారీ వర్షాలకు నష్టపోయిన రైతులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నప్పుడు, తమ పరిపాలనా కాలంలో తాము వ్యవహరించిన తీరు అంతా మర్చిపోయి, ప్రస్తుతం ప్రతిపక్ష నేతలుగా రైతుల పక్షాన మాట్లాడుతున్నట్లుగా ఫోజు పెడుతున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై రాజకీయ విమర్శలు చేయడానికి తప్ప, ప్రాజెక్టుల గేట్లు తెరిచి నీళ్ళు వదలాలనే డిమాండ్‌లో వాళ్ళ నిజాయితీ కనపడడం లేదు.

ప్రభుత్వం తక్షణం ఏమి చేయాలి ?

రాబోయే మూడు నెలల ఎండాకాలంలో ఉండే ఉష్ణోగ్రతలు, వర్షాభావ పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని ఇలాంటి రిజర్వాయర్ లెవెల్స్‌తో ఏ ప్రభుత్వమైనా పంటలకు సాగు నీరు అందిస్తుందని ఆశించడం కష్టమే. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో అత్యవసర సమీక్ష చేసి, ఏ ప్రాజెక్టు క్రింద ఏ మాత్రం అవకాశం ఉన్నా, రిజర్వాయర్ల నుండి సాగునీరు అందించి రైతులను ఆదుకోవడానికి గట్టిగా ప్రయత్నం చేయాలి.

ఎండుతున్న పంటలను రక్షించుకోవడానికి రైతులు ఎప్పుడైనా తాపత్రయ పడతారు. అందుకే లెక్కకు మించి బోర్లు వేయిస్తారు. భూగర్భ జాలాలు వేగంగా అడుగంటి పోతున్నప్పుడు ఇది వృధా ప్రయాసే అవుతుంది. పైగా దీనివల్ల రైతు కుటుంబాలు లక్షల రూపాయల అప్పులో కూరుకు పోతాయి. రైతులకు విచ్చల విడిగా బోర్లు వేయవద్దని అవగాహన కల్పిస్తూనే, రైతులు అప్పులపాలు కాకుండా నీళ్ళు పడే అవకాశం ఉన్న చోట ప్రభుత్యమే రైతులకు ఉచితంగా బోరు బావులు తవ్వించి ఇవ్వాలి.

2023 జూన్ నుండీ 2024 మార్చి 15 వరకూ రెండు జిల్లాలలో వర్షపాతంలోటు ఉంది. మరో 25 జిల్లాల్లో కేవలం సాధారణ వర్షపాతం నమోదైంది. కేవలం 6 జిల్లాలలో మాత్రమే అధిక వర్షపాతం నమోదైంది. ఈ పరిస్థితులే,ఇప్పటి కరువు ఛాయలకు ప్రధాన కారణం. ఇలాంటి స్థితిలో వరి సాగు చేయడం ఎప్పుడైనా రిస్క్ అవుతుంది. పైగా గత ప్రభుత్వం అధిక సాగు నీరు అవసరమయ్యే ఆయిల్ పామ్ సాగును కూడా ప్రోత్సహించి, ఆ రైతులను కూడా సంక్షోభంలోకి నెట్టింది.

సాధారణంగా వర్షాభావ పరిస్థితులు లేదా కరువు ఉన్నప్పుడు, ప్రభుత్వం స్పందించి కరువు మండలాలను ప్రకటించాల్సి ఉంటుంది. కరువు మండలాలను ప్రకటిస్తే, రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందుతుంది. పంట రుణాలు రీ షెడ్యూల్ చేయబడతాయి. పశువులకు మెత్తాను ప్రభుత్వమే సరఫరా చేయాల్సి ఉంటుంది. గ్రామాలకు మంచి నీటి సరఫార చేయాల్సి ఉంటుంది. తీవ్ర కరువు పరిస్థితులు ఉంటే, ప్రజలకు ఉచిత ఆహార సరఫరా కేంద్రాలు తెరవాల్సి ఉంటుంది.

గత పదేళ్ళ KCR పాలనలో కొన్ని సార్లు ఈ పరిస్థితులు ఏర్పడినా, అసలు పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వ కోరిక మేరకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCHRD) తెలంగాణ రాష్ట్రానికి కరువు మాన్యువల్ రూపొందించినా, దానిని KCR ప్రభుత్వం బయట పెట్టి అమలు చేయలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆ మాన్యువల్‌లో చేసిన సూచనల మేరకు, వెంటనే గ్రామీణ రైతులను ఆదుకోవడానికి పూనుకోవాలి.

గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని త్వరగా ప్రారంభించి గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించాలి. సాధారణంగా ప్రకృతి వైపరీత్యాల నుండి రైతులను ఆదుకోవడానికి పంటల బీమా పథకాలు ఉపయోగపడతాయి. కానీ KCR ప్రభుత్వం 2020 ఖరీఫ్ నుండీ ఈ పథకాల అమలును ఆపేసింది. ఆ పథకాలు అమలై ఉంటే, ఈ సంవత్సరం కరువు పరిస్థుతుల కారణంగా పంటల దిగుబడులు తగ్గినప్పుడు, రైతులకు నష్ట పరిహారం అంది ఉండేది.

సీజన్‌లో వ్యవసాయ శాఖ చేపట్టే, పంట కోత పరిక్షల ద్వారా సగటు ఆయా ప్రాంతాలలో దిగుబడులను లెక్కిస్తారు. ఇండెమ్నిటీ లెవల్ కంటే ఏ రైతుకు దిగుబడి తగ్గినా రైతుకు నష్ట పరిహారం అంది ఉండేది. కానీ గత KCR ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, పంటల బీమా పథకాలు అమలు కాక, ఈసారి కరువు వల్ల రైతులు పంట నష్ట పోయినా, పరిహారం వచ్చే అవకాశం లేకుండా పోయింది.

పాత ప్రభుత్వం చేసిన తప్పులనే కొత్త ప్రభుత్వం పునరావృతం చేయకూడదు. కరువు బారి నుండి రైతులను ఆదుకునే అన్ని రకాల చర్యలను వేగంగా అమలు చేయాలి. ఇంకా పెండింగ్‌లో ఉన్న రైతు బంధు సహాయం వెంటనే అందించాలి. వడగండ్ల కారణంగా ప్రస్తుత కరువు పరిస్థితుల కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం అందించడానికి, కేంద్ర ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూడకుండా వేగంగా చర్యలు చేపట్టాలి.

పంట కోతకు వచ్చిన ప్రాంతాలలో ఇంకా ఆగకుండా వెంటనే ధాన్యం సేకరణ కేంద్రాలు తెరిచి కొనుగోళ్ళు ప్రారంభించాలి. ఇతర పంటలను కూడా కనీస మద్ధతు ధరలతో కొనుగోలు చేయాలి. వచ్చే ఖరీఫ్ సీజన్‌లో పంటల బీమా పథకం అమలు కోసం ఇప్పటి నుండే అవసరమైన చర్యలు చేపట్టాలి. కౌలు రైతుల గుర్తింపు, రైతు భరోసా మార్గదర్శకాలు, వ్యవసాయ కూలీలకు రైతు భరోసా, కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు రైతు బీమా పథకం అమలుకు మార్గదర్శకాలు, ఖరీఫ్ పంటల ప్రణాళిక లాంటి అన్ని అంశాలను చర్చకు చేపట్టాలి.

ఈ ప్రభుత్వ కాలంలోనూ కొనసాగుతున్న రైతు ఆత్మహత్యలను, గత పదేళ్ళలో రాష్ట్రంలో జరిగిన రైతు ఆత్మహత్యలను గుర్తించి, ఆయా కుటుంబాలకు పరిహారం అందించే జీవో 193 ని అమలు చేయాలి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా సాధారణ పరిపాలనా ప్రక్రియ క్రింద ఈ చర్యలను తీసుకోవడానికి ఎలక్షన్ కమిషన్‌కు లేఖ రాసి అనుమతి తీసుకోవాలి.

దారి తప్పిన రాష్ట్ర వ్యవసాయం గాడిలో పడాలంటే, రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ విధానం, శాస్త్రీయ పంటల ప్రణాళిక రూపొంది అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల మానిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా వెంటనే రైతు కమిషన్ ఏర్పాటు చేయాలి. ఆ కమిషన్ సిఫారసులకు చట్టబద్ధత కల్పించాలి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా, రాష్ట్ర వ్యవసాయ శాఖ, రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో రైతు సంఘాలతో, రైతు సహకార సంఘాలతో చర్చలు కొనసాగించాలి. కొన్ని తక్షణ చర్యలు చేపట్టాలి.

(రచయిత కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక, హైదరాబాద్)

Tags:    

Similar News