రేవంత్ కేసీఆర్ నుంచి నేర్చుకున్న విద్య ఏమిటంటే....

బతుకు దెరువు కోసం ఆందోళన చేస్తున్న రైతుల చేతులకు బేడీలు వేయడం;

Update: 2025-06-20 08:13 GMT

 గత మూడేళ్లుగా KCR కుటుంబంపై రోజూ విరుచుకు పడి మాట్లాడే రేవంత్, నిజానికి రోజులు గడిచిన కొద్దీ KCR కు వీరాభిమానిగా మారిపోయినట్లు ఉన్నారు. 2014 జూన్ నుండీ 2023 డిసెంబర్ వరకూ తెలంగాణ ముఖ్యమంత్రిగా పని చేసిన KCR దారిలోనే ప్రస్తుత కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ కూడా నడుస్తున్నట్లు కనిపిస్తున్నది.

KCR అధికారం చేపట్టిన తొలి 7 సంవత్సరాలూ కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి అత్యంత విధేయుడిగా కొనసాగి అన్ని విషయాలలో మద్ధతు ఇచ్చాడు. తన రాజకీయ అవసరాల కోసం అప్పుడప్పుడూ బీజేపీతో, కేంద్రంతో పోరాడినట్లు కనిపించినా, ప్రధానంగా బీజేపీ కి ఎప్పుడైనా సరెండర్ అయ్యే విధంగానే ఈ వ్యవహారాలు సాగాయి.

డిల్లీ స్థాయిలో రాహుల్ గాంధీ సంఘ్ పరివార్ పై, బీజేపీ పై చేస్తున్న విమర్శలు ఎంత సీరియస్ గా ఉన్నా, అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తెలంగాణ లో ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ మాత్రం బీజేపీకి దొరికిన కొత్త స్నేహితుడిగా వ్యవహరిస్తున్నాడు. ముఖ్యమంత్రి మాటలు, చేతలు పైపైన పరిశీలించినా ఈ విషయం రోజురోజుకూ స్పష్టమవుతున్నది.

మరి కొద్ది రోజులాగి దీనిపై మరోసారి లోతుగా ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు కానీ, వ్యవసాయ రంగంలో, విద్యా రంగంలో, మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రజలతో వ్యవహరించ డంలో మాత్రం KCR, రేవంత్ ఒకే విధంగా వ్యవహరిస్తున్నారనడానికి అనేక ఉదాహరణలు బలంగా ముందుకు వచ్చాయి. ముఖ్యంగా పారిశ్రామికాభివృద్ధి, ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో భూ సేకరణ సాగించి, రైతుల నుండీ భూములు గుంజు కోవడంలో వీరిద్దరి వ్యవహార శైలి ఒకే విధంగా ఉంది.

2014 జూన్ 2 నుండీ 2023 డిసెంబర్ వరకూ KCR ప్రభుత్వం రైతుల నుండీ 2,07,824 ఎకరాల 30 గుంటల భూమిని సేకరించింది. ఇందులో 46,920 ఎకరాల 08 గుంటలు అసైన్డ్ భూములు కాగా, 1,60,904 ఎకరాల 22 గుంటల పట్టా భూమిని సేకరించింది. ఆ ప్రభుత్వ గద్దె దిగే నాటికి ఇంకా 14,136 ఎకరాల 05 గుంటల భూమికి రైతులకు పరిహారం అందలేదు. ఇంకా 26,462 మంది రైతులకు పరిహారం అందాల్సి ఉంది. ప్రొఫెసర్ కోదండరాం శాసన మండలి లో అడిగిన ప్రశ్నకు , ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం వ్రాత పూర్వకంగా ఇచ్చిన జవాబు ఇది.

ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా రీజనల్ రింగ్ రోడ్డు , ఫార్మా సిటీ , ఫ్యూచర్ సిటీ, విమానాశ్రయాలు, పారిశ్రామిక అభివృద్ధి పేరుతో, అధికారానికి వచ్చిన మొదటి 16 నెలల లోనే వేలాది ఎకరాల భూ సేకరణ కోసం పదుల కొద్దీ నోటిఫికేషన్ లు విడుదల చేసింది . ఎకరం 30 లక్షల నుండీ ఒక కోటి రూపాయల వరకూ ఉన్న రైతుల పట్టా భూములకు కేవలం 15-20 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించ డానికి సిద్దపడుతూ రేవంత్ ప్రభుత్వం భూముల మీదికి వెళుతున్నది. భూముల కోసం KCR, రేవంత్ కూడా 2013 భూ సేకరణ చట్టాన్ని పక్కన పెట్టి, 2016 లో తెచ్చిన భూ సేకరణ చట్టాన్నే ఉపయోగించుకున్నారు.

KCR పదేళ్ళ పరిపాలనా కాలం లోనూ రాష్ట్ర వ్యవసాయ రంగానికి సమగ్ర విధానం రూపొందలేదు. రేవంత్ కాలంలోనూ ఆ ముచ్చట వినపడడం లేదు. రాష్ట్ర పర్యావరణానికి అత్యంత హాని చేసే విధంగా రెండు సీజన్ ల లోనూ వరి సాగును ఇద్దరూ ప్రోత్సహిస్తున్నారు.

సంక్షోభంలో ఉన్న కౌలు రైతులను ఆదుకోవడానికి నిరాకరించి, రాష్ట్రంలో రైతుల ఆత్మ హత్యలు కొనసాగడానికి KCR కారణమైతే, కౌలు రైతులను గుర్తించి , వారికి కూడా ఎకరానికి 15,000 రూపాయల రైతు భరోసా సహాయం అందిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి, ఆచరణలో తాను కూడా కౌలు రైతులకు అన్యాయమే చేసి, రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నా పట్టించుకోకుండా KCR బాటలోనే నడుస్తున్నాడు.

బీజేపీ నాయకుల కంటే “నేనే పెద్ద హిందువును” అనే మాటను నిరూపించుకోవడానికి KCR యజ్ఞ యాగాదులు చేయడం, దేవాలయాల అభివృద్ధికి నిధులు కేటాయించడం లాంటివి చేస్తే, రేవంత్ కూడా దేవాలయాల అభివృద్ధికి నిధుల కేటాయింపు, సరస్వతి పుష్కరాలు, కొత్త గోశాలల నిర్మాణం లాంటి వాటికి హామీలు గుప్పిస్తున్నారు.

రెండు, మూడు లక్షల మంది విద్యార్ధుల కోసం తెలంగాణలో అద్దె భవనాలలో వందలాది రెసిడెన్షియల్ స్కూల్స్ ఓపెన్ చేసి, 30 లక్షల మంది ఉన్న వేలాది ప్రభుత్వ స్కూల్స్ ను పట్టించుకోకుండా తెలంగాణలో విద్యా రంగాన్ని KCR విధ్వంసం చేస్తే, కేవలం రెండు లక్షల మంది కోసం ప్రతి నియోజక వర్గంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఓపెన్ చేస్తానని ప్రకటించి , కేవలం 20 స్కూల్స్ కోసం 4000 కోట్లు మంజూరు చేసిన రేవంత్ ప్రభుత్వం, రాష్ట్రంలో 24 లక్షల మంది విద్యార్ధులు ఉన్న ప్రభుత్వ స్కూల్స్ అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం మాత్రం కొనసాగిస్తున్నది.

తెలంగాణ లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని, మెగా ఇంజనీరింగ్ గ్రూప్ చేతుల్లో పెట్టి, పార్టీ పరంగా KCR లబ్ధి పొందితే, రేవంత్ రెడ్డి, రాష్ట్ర RTC సంస్థలో ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు ప్రక్రియ పూర్తిగా మెగా కృష్ణారెడ్డి కంపనీ నుండే సాగిస్తున్నాడు.

ఇప్పుడు తాజాగా మరో విషయంలో కూడా KCR బాట లోనే రేవంత్ కూడా నడిచాడు. KCR పాలన కాలంలో ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులు, మార్కెట్ యార్డులో తమకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడితే, వారిని అరెస్టు చేసి, చేతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకు వెళ్ళాడు. ఇసుక మాఫియా దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నేరేళ్లలో దళితులు పోరాడితే వారిని పోలీసులతో చిత్ర హింసలు పెట్టించాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇథనాల్ కంపనీకి వ్యతిరేకంగా పోరాడిన పెద ధనవాడ రైతులను అరెస్టు చేసి చేతులకు బేడీలతో ఆలంపూర్ కోర్టుకు తీసుకు వెళ్ళాడు. కాలుష్య కారక ఫార్మా పరిశ్రమకు తమ భూములు ఇవ్వబోమని పోరాడిన లగచర్ల లంబాడా మహిళలు, పురుషులపై పోలీసులతో దాడి చేయించి కొట్టించాడు.

ఒకప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా KCR రాష్ట్రంలో ఎక్కడికి పర్యటనకు వెళ్ళినా, ఆ ప్రాంతంలో ప్రజా సంఘాల కార్యకర్తలను ముందస్తు అరెస్టులు సాగించేవారు. చివరికి KTR జిల్లాల పర్యటనకు వెళ్ళినా ముందస్తు అరెస్తులు జరిగేవి.పదేళ్ళ కాలం తెలంగాణ ఎంత నిర్బంధాన్ని అనుభవించిందో ఎవరం మర్చిపోలేం.

కానీ విచిత్రం ఏమంటే, ప్రజాస్వామిక పాలన అందిస్తామని 7 వ హామీగా ఇచ్చి అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ పాలన లోనూ ముందస్తు అరెస్టులు చాలా కాలం క్రితమే మొదలయ్యాయి. మైలారం లో మైనింగ్ కు వ్యతిరేకంగా దీక్షలు చేస్తున్న రైతులను పరామర్శించడానికి వెళుతున్నప్రొఫెసర్ హరగోపాల్ ను దారిలోనే అరెస్టు చేయడం, లగచర్ల బాధిత రైతులను పరామర్శించడానికి వెళుతున్న మహిళా సంఘాల నాయకులను అరెస్టు చేయడం,పెద ధనవాడ లో రైతులను కలవడానికి వెళుతున్న CPM పార్టీ కార్యదర్శి జాన్ వెస్లీ ని, రాష్ట్ర పౌర హక్కుల సంఘం బృందాన్ని అడ్డుకోవడం, అందాల పోటీల సందర్భంగా మహిళా సంఘ నాయకురాలు వి. సంధ్య ను గృహ నిర్బంధం చేయడం, ఒక ఎత్తైతే , తాజాగా ఖమ్మం జిల్లాలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన సందర్భంగా విద్యార్ధి సంఘాల నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం మరో వైపరీత్యం. హై కోర్టు చెప్పినా ఫార్మా సిటీ ఏరియా గ్రామాలలో రైతుల సభలకు అనుమతి ఇవ్వక పోవడం కూడా మరో నిర్బంధ రూపమే.

జూన్ 18 న మహారాష్ట్రలో పాలస్తీనాకు సంఘీభావంగా ప్రదర్శనలకు సిద్దమైన ఆయా పార్టీల అగ్ర నాయకులను ఇజ్రాయిల్ కు ఎప్పుడూ అండగా నిలబడే మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం ముందస్తు అరెస్టులు సాగించింది. జూన్ 19 న హైదరాబాద్ లో అమెరికన్ కాన్సులేట్ ముందు ప్రదర్శన చేసిన ప్రజా సంఘాల కార్యకర్తలను రేవంత్ ప్రభుత్వం అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించింది. వాళ్ళు చేసిన నేరమల్లా, అమెరికా సహాయంతో ఇజ్రాయిల్ పాలస్తీనా పై, ఇరాన్ పై చేస్తున్న దురాక్రమణ పూరిత దాడులను ఆపమని అడగడమే. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం పాలస్తీనాకు సంఘీభావం ప్రకటిస్తుంది. ఇజ్రాయిల్ దాడులు ఆపాలని కోరుతుంది. మరి రేవంత్ ప్రభుత్వానికి ఆ స్పృహ ఏమైంది ? అదే రేవంత్ కు ఇష్టమైతే, ముఖ్యమంత్రిగా ఉండి కూడా , కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా హైదరాబాద్ నడి రోడ్డు మీద ప్రదర్శన, ధర్నా చేయడం మనం కళ్ళారా చూశాం.

ప్రతిపక్షంలో ఉన్నంతవరకే ఎవరైనా ప్రజాస్వామిక వాదులుగా ఉంటారు. ఒకసారి అధికారం చేజిక్కితే వారిలో ఉన్న “నిరంకుశుడు”ప్రత్యక్షమౌతాడు. ప్రజల ప్రజాస్వామిక హక్కులపై, జీవించే స్వేచ్ఛపై దాడి చేస్తాడు. ఈ విషయం KCR పాలనలో చూశాం. ఇప్పుడు రేవంత్ పాలనలో చూస్తున్నాం. కేంద్రంలో బీజేపీ పాలన వీటన్నిటికీ పరాకాష్ట గా ఆపరేషన్ కగార్ పేరుతో ప్రజలపై, ముఖ్యంగా ఆదివాసీలపై పెద్ద యుద్ధమే ప్రకటించింది. మావోయిస్టు పార్టీ నాయకులు సహా, వందలాది మందిని హతమారుస్తున్నది. నిజానికి వనరులను, శ్రామికులను దోచుకునే దోపిడీ వర్గాలకు సేవ చేసే పాలక పార్టీల నిజ స్వభావం ఇదే. ప్రజలు, ప్రజా సంఘాలు, పౌర సమాజమే జాగరూకులై ఉండాలి.

Tags:    

Similar News