దేవుడూ, దయ్యాలూ - బిజెపి-బిఆర్ఎస్ మల్లగుల్లాలు
గతంలో కాంగ్రెస్ తో విలీనం అని ఆఖరిలో కెసిఆర్ అడ్డం తిరగడాన్ని బీజేపీ నేతలు చూపిస్తుంటే ఆ పార్టీతో కలిసిన వారెవరు బాగుపడలేదని కవిత తండ్రిని హెచ్చరిస్తున్నారు.;
మే 31వ తేదీన ‘తెలంగాణ జాగృతి’ (Telangana Jagruthi) నూతన కార్యాలయంలో వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntal Kavitha) మాట్లాడిన తీరుకు కొంతమంది ఆశ్చర్యపోయి వుండొచ్చు. నిజంగానే ఆమె తనతండ్రి బిఆర్ఎస్ (బిఆర్ ఎస్) అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (కెసిఆర్) పై తిరుగుబాటుకు ప్రాతినిధ్యం వహిస్తుందని భావించి ‘‘వుయ్ స్టాండ్ బై కవితక్క’(We stand by Kavithakka) అని హ్యాష్ ట్యాగ్ (Hashtag) లతో ఉద్వేగభరితంగా సంఫీుభావం ప్రకటించిన యువత,బుద్ధిజీవులు, ఆ పార్టీ పాతకాపులు నివ్వెరపోయి వుండొచ్చు. కానీ మొదటి నుంచి టఆర్ఎస్/బిఆర్ఎస్ వ్యవహారాలు, ఆ కుటుంబ ప్రముఖుల వ్యూహ ప్రతివ్యూహాలు గమనించేవారు మామూలుగానే తీసుకుంటారు. పదిరోజుల కిందట కెసిఆర్కు కవిత లేఖ (Kavitha Letter) లీకేజీ ప్రహసనం, కెటిఆర్ (KTR) వ్యాఖ్యలు.. ఆ పైన ఆమె దేవుడూ దయ్యాలు (Ghosts in BRS) మాట్లాడి అఖరుకు బిజెపి (BJP) లో కలిపే కుట్ర జరిగిందని ఆరోపించడం వరసగా కదలాడతాయి.
కెసిఆర్ దేవుడనీ, ఆయన చుట్టూ వున్న దయ్యాలే తనపై కుట్ర పన్ని లేఖ లీక్ చేశాయనీ ఆమె అన్నమాటలు కూడా వ్యూహాత్మకమే. ఆ ప్రకారం చూస్తే బిజెపిలో విలీనం కోసం కూడా వారే పథకం వేసి వుండాలి. మరి దేవుడైన కెసిఆర్ దయ్యాలను ఎందుకు చుట్టు పెట్టుకున్నారు? ఆ దయ్యాలు దేవుడు కంటే శక్తివంతమైనవా? ఇంతకు ఎవరు ఆ దయ్యాలు? ఇంకా వున్నాయా లేక పోయాయా? వాటి నుంచి దేవున్ని కాపాడాలని కవిత ఇప్పుడు ప్రకటిస్తున్నారా? దేవుడు నిస్సహాయుడై పోయారని ఆమె అంటున్నారా? ఇవన్నీ వింతగా తోచినా విస్మరించలేని ప్రశ్నలు.
రజతోత్సవ సభలో కెసిఆర్ ప్రసంగంలో లోపాలోపాల గురించి , పార్టీ రాజకీయ విధానం గరించి తన అభిప్రాయాలు చెప్పడానికి తను కేసిఆర్ కు రాసిన లేఖ లీక్ పై కోపం కన్నా తర్వాత చేసిన వెల్లడి చేసింది మరింత తీవ్రమైన విషయం. లిక్కర్ కుంభకోణంలో తాను జైలులో ఉన్నప్పుడే ఈ విషయం దృష్టికి వచ్చిందని, తన అడ్డుకున్నానని ఆమె చెబుతున్నారు. రజతోత్సవ సభలో కెసిఆర్ బిజెపి పైన ఎలాంటి రాజకీయ విమర్శలు చేయకపోవడం,రెండు నిముషాలు మాత్రమే దానిపై చెప్పి కాంగ్రెస్ ఏకైక విలన్ అని ప్రకటించడం ముందే రాజకీయ సందేహాలు పెంచింది. మునుగోడు ఉపఎన్నికకు ముందు బిజెపి మత రాజకీయాల పైన, మోదీ నిరంకుశత్వం పైన నిప్పులు జరిగిన కేసీఆర్ ఎందుకు ఇంతగా మారిపోయారు? ఈ మార్పు ఓటమి తర్వాత మరింత తీవ్ర రూపం దాల్చి,2024 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో టిఆర్ఎస్ ఒక స్థానం కూడా తెచ్చుకోలేని పరిస్తితి.
తమ ఓట్లను బదలాయించడం వల్లనే ద్వారా బిజెపికి సహకరించారనే ఆరోపణ బిఆర్ఎస్ఎదుర్కొన్నది. శాసనమండలి ఎన్నికల్లోను బిజెపితో టిఆర్ఎస్ పోటీ పడకపోవడం బిజెపి కి మేలు చేసింది.ఈ పూర్వ రంగంలో కెసిఆర్ రజతోత్సవ సభలో బీజేపీపై రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడటం ఈ ఆరోపణలకు బలం చేకూర్చిందని కవిత విమర్శించారు.
కవిత దాడి యావత్తు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న అన్న కేటీఆర్ పైనే ఉద్దేశం ఎక్కువ పెట్టబడిరదనిసన్నిహిత వర్గాలు చెబుతూ వచ్చాయి. కేటీఆర్ హరీష్ రావుల మధ్య వైరుధ్యాల గురించి చాలా ప్రచారం జరుగుతూ వచ్చింది. కానీ వాస్తవానికి అన్నాచెల్లెళ్ల మధ్య ఎక్కువ వైరుధ్యం ఉంటుందని ఉందని ఎప్పుడూ వింటున్న మాటే. కుటుంబం ప్రాబల్యం కలిగిన ప్రాంతీయ పార్టీల్లో ఇలాంటివి సర్వసాధారణం. కవితను కేసుల నుంచి కాపాడుకోవడానికి కేసీఆర్ బిజెపి పట్ల మెతక వైఖరి అనుసరిస్తున్నారని ఒక దశలో చాలామంది అభిప్రాయంగా ఉండేది. అయితే ఇప్పుడు ఆమే ఆ అంశాన్ని ప్రశ్నించటం కొత్త మలుపు. అయితే ఈ మధ్య కాలంలో కవిత మాటలు చేతలు కూడా బిజెపికి వ్యతిరేకంగా నడిచింది పెద్దగా చూడలేదు. ఇప్పుడు కూడా బిజెపితో కలిస్తే లిక్కర్ వ్యవహారంలో తను దోషినని ఒప్పుకున్నట్టు అవుతుందని ఆమె వాదన చేస్తున్నారు.
రాజకీయంగా దాని మతతత్వం, కేంద్ర నిరంకుశత్వం ,తెలంగాణకు అన్యాయం వంటి అంశాలు ప్రధానంగా ముందుకు తేవడం లేదు. లేఖ లీక్ తర్వాత కూడా బిజెపి విధానాలపై పాలనపై ఆమె పెద్దగా విమర్శించింది లేదు. ఆపరేషన్ కగార్ ను కెసిఆర్ వ్యతిరేకించటం గొప్ప ప్రజా స్వామిక చర్య గనుక ఆ పేరుతో ఆయన తప్పిదాలను పక్కనపెట్టి మళ్లీ టిఆర్ఎస్ ను బలోపేతం చేద్దాం అన్నది కొంతమంది గత మద్దతుదారుల, మేధావి వర్గాల వాదన, ఎన్కౌంటర్ల విషయంలో కెసిఆర్ ప్రభుత్వం కూడా ముద్దాయి గానే ఉంది. పైగా మొన్నటి సభలో ఆయన కేంద్రాన్ని గాని హోం మంత్రి అమిత్ షాను కానీ ప్రత్యేకించి విమర్శించింది లేదు. అటువంటప్పుడు ఈ ఒక్క అంశం ఆధారంగా తీసుకొని కెసిఆర్ కు బి ఆర్ ఎస్ కు వంత పాడటం సరైన అవుతుందా?
ఇప్పుడు కవిత కూడా కగార్ కేంద్రం బాధ్యత అంటున్నారు కానీ ఇతర అంశాలు ప్రస్తావించలేదు. సామాజిక న్యాయం అన్న నినాదంతో ఆమె ఈ ప్రత్యేక ప్రయాణం ప్రారంభించినట్లు కనిపిస్తుంది. సామాజిక న్యాయం అంటున్నారు కనుక కవితను బలపరచాలని ఒక వర్గం వాదనగా ఉంది. మొదట ఆమె తెలంగాణలో గత చాలా ఏళ్లుగా సామాజిక న్యాయం జరగలేదని అన్నప్పుడు కెసిఆర్ను కూడా విమర్శించినట్టు వ్యాఖ్యలువచ్చాయి. అయితే ఆయనను మినహాయిస్తున్నట్టు ఆమె చూచాయగా తర్వాత మాట్లాడారు,ఈ నినాదంతో ఆమె కొంతమంది రాజకీయ పార్టీల నేతలను కూడా కలిసి సహాయం అభ్యర్థించారు.అప్పుడే బిఆర్ఎస్ వర్గాలు సంఘాల నుంచి సంఫీుభావ ప్రకటనలు వచ్చాయి, కొత్త పార్టీ పెట్టడం ఖాయమంటూ తేదీలు పేర్లు కూడా వచ్చాయి, కవిత అంతర్గత కుటుంబ వివాదం ఏమైనాపటికి రాజకీయంగా ఆమె ఆలోచనలేంటన్నది ఆచరణలో చూడాలి. ఇప్పటికైతే తాను వేరే పార్టీ పెట్టడం లేదని కేసీఆర్ నాయకత్వాన్నిబిఆర్ఎస్ ను కాపాడుకోవడమే ముఖ్యమని ఆమె చెబుతున్నారు.
నిజానికి ఈ వ్యాస రచయిత గత నెలరోజుల కాలంలోనూ రజతోత్సవ బిఆర్ఎస్ పరిణామాలు, ఆ పార్టీ ప్ర్రథమ కుటుంబంలో వైరుధ్యాలపై వరుసగా ఫెడరల్ తెలంగాణలో వరుసగా రాశారు. రజతోత్సవ సభలో హరీష్ రావును దూరం పెట్టడం, కవితకు ప్రాధాన్యత లేకపోవడం రాజకీయ కారణాల వల్లనే జరిగిందని కూడా ఇప్పుడు అర్థమవుతుంది.. కెసీఆర్ ఆదేశిస్తే కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని హరీష్ రావు ఈమధ్య చెప్పడంపై మొదట చర్చ సాగింది. అదే సమయంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగానే ఘనంగా రాజకీయ జీవితం విరమించాలని హరీష్ రావు అంతర్గత సమావేశంలో చెప్పినట్టు సన్నిహితులు బహిరంగంగానే ప్రకటించారు.
అంటే ఇక్కడ హరీశ్, కవిత ఇద్దరి మాటలూ అటే చేరడం గమనిస్తాము.మొత్తానికి ఇప్పటికైతే కేటీఆర్ చొరవకు పగ్గాలు పడొచ్చు. కవిత లేఖ లీక్ కూ ఆమె వ్యాఖ్యలకూ ప్రాధాన్యత నివ్వకుండా ‘నేషనల్ హెరాల్డ్’ వివాదంపైకి చర్చ మరల్చడానికి ప్రయత్నించిన కెటిఆర్కు కెసిఆర్ ఏమీ మాట్లాడొద్దని ఆంక్షలు పెట్టేశారు.
కెటిఆర్ అమెరికా నుంచి వచ్చాక ఆయన ఏం అంటారన్నది ఒకటైతే హరీష్ రావు వరకు కాలేశ్వరం అవకతవకలపై కమిషన్ ముందు హాజరు గురించి ఎక్కువగా చర్చలు చేస్తున్నారని సమాచారం.అంతర్గతంగా ఈ మల్ల గులాలు బిఆర్ఎస్ అధినేత ఎలా ముగిస్తారు అన్నది ఆయన తీసుకునే రాజకీయ వైఖరి ద్వారానే తేలుతుంది. ఇంత వివాదం తర్వాత కూడా కెసిఆర్ గనక బిజెపి పట్ల మెతక వైఖరితో ఇతరులపైనే దాడి కొనసాగించేట్లయితే విశ్వసనీయత కోల్పోవడం అనివార్యం. అది అస్తిత్వ సమస్య కూడా.
కవిత బిజెపితో చెలిమి వద్దంటున్నప్పటికీ ఈ వివాదం ద్వారా టిఆర్ఎస్ ను బలపరచడం బలహీనపరచడంతో వారికే మేలు జరిగిందనే భావన బలంగా వుంది. ఇందుకు ప్రోద్బలం కాంగ్రెస్ నుంచి వచ్చిందని ఒక పత్రిక కథనాలు ఆమె ఖండిస్తున్నా ఆ పార్టీ మాత్రం ఈ వివాదాన్ని వినోదంగా ఆస్వాదిస్తున్నది.అలాగే బిజెపి ఎంపీ రఘు నందన్ రావు ఈ విషయంలో అత్యుత్సాహంతో చేస్తున్న వ్యాఖ్యలు చెబుతున్న జోస్యాలు కూడా వివాదాస్పదమయ్యాయి. టీ బీజేపీ అధ్యక్షుడైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తమ పార్టీ వారిని అతిగా స్పందించవద్దని హెచ్చరించాల్సి వచ్చింది. నిజానికి బిజెపి లో కూడా అంతర్గత ఐక్యత పెద్దగా లేదు. తమ పార్టీ వారు కొందరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చేతులు కలిపారని గతంలో ఆరోపించిన వివాదాస్పద ఎమ్మెల్యే రాజాసింగ్ విలీనం ప్రయత్నాలు కూడా తోసిపుచ్చలేనని సందేహం ప్రకటించారు. గతంలో కాంగ్రెస్ తో విలీనం అవుతామని ఆశపెట్టి ఆఖరిలో అడ్డం తిరిగిన కేసీఆర్ ను నమ్మవద్దని అటు బీజేపీ నాయకులు చెప్తుంటే ఆ పార్టీతో కలిసిన కలిసిన వారెవరు బాగుపడలేదని కవిత తన తండ్రిని హెచ్చరిస్తున్నారు.
వేరే పార్టీ యోచన లేదని కవిత పదేపదే చెప్పడం,తెలంగాణ జాగృతి వేదికగా తండ్రినే కీర్తించడం ఇందుకు అనుగుణంగానే వుంది. ఇదంతా టీ కప్పులో తుఫాను వంటిదేనని తమ వైఫల్యాలు నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి అంతర్గత విభేదాలను అతిగా ముందుకు తేవడం కేసీఆర్ కు అలవాటైన ఎత్తుగడ అని కొందరు విమర్శకులు మాట మొదట్లోనే గతంలోనే చెప్పుకున్నాం. కానీ ఈ కథ ఇంత దూరం రావడం వెనక బిజెపి అదృశ్యహస్తం ఏ మేరకు పనిచేస్తున్నది? ఆ ప్రభావం ఏ కొత్త పరిణామాలకు దారితీస్తుంది? ఎవరు ఎటు ఎవరితో ఎలా మిగులుతారు?రాష్ట్రావతరణ సందర్భంలో ఈ ప్రశ్నలకు సమాధానం వస్తుందని అంటున్నారు కానీ చూడాలి. అంత తేలిగ్గా అప్పుడే ఈ ట్విస్టులు ఆగకపోవచ్చు. పారదర్శకత స్థానంలో అవకాశవాదం, ప్రజాస్వామిక చర్చల స్థానంలో నిగూఢ రాజకీయాలు నడుస్తున్న చోట ఏదైనా సంభవమే.