సీజన్ ముంచుకు వస్తోంది, సర్కార్ నిద్ర లేవాలి...
వరికి బదులుగా ఇతర పంటలకు బోనస్ చెల్లించి కొనుగోలు చేయాల్సిన సమయం ఆసన్నమయింది;
By : కన్నెగంటి రవి
Update: 2025-05-28 05:19 GMT
2024-2025 రబీ సీజన్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంకా నడుస్తున్నాయి. కానీ అకాల వర్షాల వల్ల చాలా చోట్ల ధాన్యం తడిచి పోతున్న వార్తలు కూడా వింటున్నాం.
2023 డిసెంబర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి సారి ఈ రబీ సీజన్ లో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సహాయంగా అందిస్తున్న ఎకరానికి 6 వేల రూపాయల సహాయం కూడా ఇప్పటికీ అనేక మంది రైతులకు అందనే లేదు. రైతు భరోసా కౌలు రైతులకు కూడా అందిస్తామని ఇచ్చిన హామీ అయితే అసలు అమలుకు నోచుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్ లో కూడా ధాన్యం కొనుగోలు చేస్తున్నా, కనీస మద్ధత ధరను మాత్రమే చెల్లిస్తున్నారు తప్ప, రైతులకు హామీ ఇచ్చిన విధంగా సన్న ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ఇప్పటికీ ఒక్కరికీ కూడా అందలేదు.
2025 ఖరీఫ్ సీజన్ ముంచుకు వస్తోంది. ఈ సారి ఋతు పవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి ముందు గానే ( జూన్ 1 నాటికి ) ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా వ్యవసాయ రంగం పై దృష్టి సారించాల్సిన సందర్భం ఇది. కానీ జరుగుతున్న పరిణామాలను గమనిస్తే మాత్రం రాష్ట్ర వ్యవసాయ శాఖ పని తీరు అంచనాలకు అనుగుణంగా లేదు.
రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రతి సంవత్సరం రైతులు పంటలను నష్ట పోతున్నారు. ఈ నష్టాలవల్ల, వ్యవసాయ కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. ఈ అప్పులను తీర్చలేని పరిస్థితిలో రైతులు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు.
2016 ఖరీఫ్ నుండీ 2019 రబీ వరకూ తెలంగాణ రాష్ట్రంలో పంటల బీమా పథకాలు అమలయ్యాయి. ముఖ్యంగా ఎక్కువ పంటలకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) , కొన్ని పంటలకు వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం ( WBCIS) అమలయ్యాయి. కానీ గత ప్రభుత్వం 2020 ఖరీఫ్ నుండీ రాష్ట్రంలో ఈ పథకాల అమలును నిలిపి వేసింది. ఫలితంగా ప్రకృతి వైపరిత్యలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందుతుందన్న భరోసా లేకుండా పోయింది.
2020 లో భారీ వర్షాల కారణంగా నష్ట పోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని రైతు స్వరాజ్య వేదిక , రాష్ట్ర హై కోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై , విచారణ చేసిన రాష్ట్ర చీఫ్ జస్టిస్ బెంచ్ , 2021 సెప్టెంబర్ లో “కౌలు రైతులు సహా , నష్ట పోయిన రైతులకు మూడు నెలల లోపు నష్ట పరిహారం చెల్లించాలని, పంటల బీమా పథకం అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వం అందుకు బాధ్యత వహిస్తూ, నష్ట పోయిన రైతులకు పంటల బీమా పరిహారం కూడా లెక్కించి చెల్లించాలని, భవిష్యత్తులో పంటల బీమా పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని అమలు చేయాలని స్పష్టమైన తీర్పు ఇచ్చింది. కానీ ఈ తీర్పును అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు.పైగా రాష్ట్ర హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు అప్పీల్ కు వెళ్ళింది. సుప్రీం కోర్టులో అది ఇప్పటికీ తేలలేదు.
2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తన అభయ హస్తం మానిఫెస్టో లో రాష్ట్రంలో అన్ని పంటలు కవర్ అయ్యేలా సమగ్ర పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. పైగా రైతులు చెల్లించాల్సిన పంటల బీమా ప్రీమియం కూడా తానే చెల్లిస్తానని కూడా హామీ ఇచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్ 7 న అధికారంలోకి వచ్చినప్పటికీ, 2024 ఖరీఫ్, 2024-2025 రబీ సీజన్ లలో పంటల బీమా పథకాన్ని అమలు చేయలేదు.
2025 ఖరీఫ్ సీజన్ జూన్ 1 నుండీ ప్రారంభం కాబోతున్నది. పంటల బీమా పథకం అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చేసిందని, మీడియా లో వార్తలు వచ్చినప్పటికీ, ఇప్పటి వరకూ ఈ సంవత్సరం పంటల బీమా పథకానికి సంబంధించిన నోటిఫికేషన్ రాష్ట్ర వ్యవసాయ శాఖ విడుదల చేయలేదు. నిజానికి కనీసం ఒక నెల రోజుల ముందే ( అంటే మే 1 నాటికి ) ఈ నోటిఫికేషన్ విడుదల చేసి , పంటల బీమా పథకంపై రైతులలో విస్తృతంగా ప్రచారం చేయాల్సి ఉంది. కానీ ఇప్పటికీ ఇంకా నోటిఫికేషన్ రాలేదు. ఈ నేపధ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ వెంటనే పంటల బీమా పథకం నోటిఫికేషన్ విడుదల చేయాలని, కౌలు రైతులకు కూడా పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని కోరుతున్నాము. జులై 31 వరకూ పంటల బీమా పథకం లో నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది కనుక, రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులు, పోడు రైతులు,అసైన్డ్ రైతులు సహా, వాస్తవ సాగుదారుల పేర్లు ఈ ఖరీఫ్ సీజన్ లో నమోదు చేసి, వారికి పంటల బీమా పథకం వర్తించేలా చేయాల్సిన అవసరం ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక గత 16 నెలలలో భారీ వర్షాలతో పంటలు నష్ట పోయిన రైతులకు మూడు సందర్భాలలో ఎకరానికి 10,000 రూపాయల పరిహారం చెల్లించినా, ఆ పరిహారం కూడా వ్యవసాయం చేయని భూ యజమానులకు అందింది తప్ప, సాగు చేసి నష్టపోయిన కౌలు రైతులకు అందలేదు. ఈ అన్యాయాన్ని సారి చేయాల్సిన అవసరం ఉంది.
రాష్ట్రంలో సన్న ధాన్యం (వరి) సాగు చేసిన రైతులకు క్వింటాలుకు 500 రూపాయల చొప్పున బోనస్ అందిస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం 2024 ఖరీఫ్ లో ఒక మేరకు పథకాన్ని అమలు చేసింది. కానీ అక్కడితో ఆగకుండా రబీ లో సన్న ధాన్యం సాగు చేసిన రైతులకు కూడా కవితాలుకు 500 రూపాయల బోనస్ అందిస్తామని అట్టహాసంగా ప్రకటించింది. రబీ సీజన్ లో వరిని ప్రోత్సహించడం మంచిది కాదని, రైతు స్వరాజ్య వేదిక, ఇతర నిపుణులు కొందరు స్పష్టంగా చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం ముందుకే వెళ్ళింది. ఈ సీజన్ లో సన్న ధాన్యం సాగు భారీగా పెరిగిపోయింది.
బోనస్ లేదు
ఈ సీజన్ లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ చేస్తుంది కానీ, బోనస్ చెల్లించడం లేదు. ఇందుకు కారణం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగా లేకపోవడమే. ఈ విషయం కూడా మేము ఆ రోజే స్పష్టంగా ప్రకటించాము. వరికి బదులుగా ఇతర పంటలకు బోనస్ చెల్లించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశాము. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు మేము హెచ్చరించిన విధంగానే జరిగింది. వరి సాగు చేసిన రైతులు, భూగర్భ జలాలు ఎండిపోయి పంటలు ఎండిపోయి నష్ట పోయారు . ఇప్పుడు అకాల వర్షాలతో పంటలు తడిచిపోయి నష్టపోతున్నారు. మొత్తంగా రైతులకు బోనస్ కూడా అందడం లేదు. ఎప్పటికైనా ఇది రాష్ట్రంలో తీవ్ర సమస్యగా మారే ప్రమాదం ఉంది. రెండు సీజన్ ల లోనూ వరి సాగు తగ్గించుకునే ప్రణాళికా చేయవలసిన అవసరముంది. ప్రణాళిక లేకుండా రైతులతో వరి సాగు చేయించి, పర్యావరణానికి కూడా హాని చేసి, చాలా ఖర్చుతో పండుతున్న వరి ధాన్యాన్ని మిల్లింగ్ చేయించి, ఇతర దేశాలకు ఎగుమతి చేయడం అర్థం లేని పని . ఈ ఖరీఫ్ ప్రణాళిక లో అయినా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా చర్చించాలి.
వ్యవసాయ విధానమేదీ?
ఏ రాష్ట్రానికయినా, రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ఒక సమగ్ర విధానం అవసరం. కానీ ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్రానికి వ్యవసాయ విధానమే లేదు. పంటల ప్రణాళికా కూడా లేదు. పైగా ఒక సంవత్సరానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక కూడా వ్యవసాయ శాఖకు లేదు. 2020 తరువాత రాష్ట్ర వ్యవసాయ శాఖ వార్షిక ప్రణాళికలను కూడా విడుదల చేయడం మానేసింది. గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ గాలిలో నడుస్తున్నది. గత నాలుగేళ్లలో సాగు భూముల విస్తీర్ణం , పంటల దిగుబడి, సగటు ఉత్పాదకత, మొత్తం ఉత్పత్తి అంచనాలు గానీ, వాస్తవ గణాంకాలు కానీ, రాష్ట్ర ప్రజల ముందు ఉంచడం లేదు. ఎరువుల వినియోగం లో వస్తున్న మార్పులు, విత్తన అవసరాలలో వస్తున్న మార్పులు ఏమిటో ఎవరికీ తెలియదు.
పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరు ధాన్యాలు, కూరగాయల సాగు విస్తీర్ణం ప్రతి సంవత్సరం గణనీయంగా పడిపోతున్నా, రాష్ట్రానికి అవసరమైన పంటలను సాగులోకి ఎలా తేవాలి అనేది వ్యవసాయ శాఖకు పట్టడం లేదు.
తెలంగాణ రాష్ట్రంలో కౌలు రైతుల గుర్తింపు విషయంలో తెలంగాణ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ ఎం. కోదండ రెడ్డి గారిని ఇటీవల రైతు స్వరాజ్య వేదిక బృందం కలసి మాట్లాడింది. ఇదే అంశం పై మే 12 వ తేదీన కమిషన్ ఆధ్వర్యంలో కౌలు రైతుల అంశం పై ప్రత్యేక చర్చా సమావేశం ఏర్పాటు చేయడాన్ని మా బృందం స్వాగతించింది. కమిషన్ నిర్వహించిన సమావేశంలో జరిగిన చర్చల సారాంశం, పాల్గొన్న సంఘాల, నిపుణుల అభిప్రాయాల ఆధారంగా రైతు సంక్షేమ కమిషన్ వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి, రెవెన్యూ, వ్యవసాయ శాఖా మంత్రులను కలిసి నిర్దిష్టమైన సూచనలు ఇవ్వాలని మా బృందం కోరింది.
కౌలు రైతులకు గుర్తింపు అవసరం
ఈ విషయంలో రైతు స్వరాజ్య వేదిక నుండి క్రింది సూచనలు కమిషన్ ముందు ఉంచాము. కౌలు రైతులను గుర్తించి, వారికి ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాలు అందించనంత వరకు తెలంగాణలో రైతు ఆత్మహత్యల నివారణ జరగదు. ప్రభుత్వం వ్యవసాయం కోసం ఖర్చు పెడుతున్న వేలాది కోట్ల రూపాయలకు సరైన ఫలితం రావాలంటే, ఆ పథకాలు వాస్తవంగా సాగు చేస్తున్న వారికి అందాలి. ప్రస్తుతం ఆ నిధులలో 30-40 శాతం వ్యవసాయం చేయని భూ యజమానుల ఖాతాల లోకి వెళ్తున్నాయి. ఈ కోణం నుంచి కూడా కౌలు రైతుల గుర్తింపు అత్యవసరం.
2025 ఖరీఫ్ సీజన్ అతి త్వరలో మొదలు కానున్నది. ఈ సీజన్ నుండే 2011 భూ అధీకృత సాగుదారుల చట్టం అమలు చేసి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియ తప్పక మొదలు పెట్టాలి. ఇది రైతు కమిషన్ నుంచి మొదటి సూచనగా ఉండాలి.
2011 చట్టంలో కొన్ని మార్పులు చేసి మెరుగుపరిచే అవకాశం ఉంది కానీ, దానికి కొన్ని నెలల సమయం కనీసం అవసరం అవుతుంది. అప్పటి వరకు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వకపోతే, 2025-26 సంవత్సరం కూడా కౌలు రైతులకు ఎటువంటి మేలు జరగదు. కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో సగం కాలం కౌలు రైతులకు ఇచ్చిన హామీలు అమలు కాకుండానే అయిపోతుంది. కాబట్టి ఉన్న చట్టాన్ని అమలు చేసేందుకు రెవెన్యూ యంత్రాంగం వెంటనే పూనుకోవాలి. అదే సమయంలో చట్ట సవరణలు రూపొందించే ప్రక్రియ మొదలు పెట్టాలి. ఆ ప్రక్రియలో భాగంగా ముఖ్యమైన సూచనలను కూడా రైతు స్వరాజ్య వేదిక ఇస్తుంది.
2011 చట్టం ప్రకారం రుణ అర్హత కార్డుల ప్రక్రియ గురించి గ్రామ స్థాయి ప్రచారం వెంటనే మొదలు పెట్టాలి. ఈ కార్డుల వలన భూ యాజమానులకు తమ భూమి పై ఉన్న హక్కులకు ఎటు వంటి భంగం కలగదు అన్న విషయాన్ని ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేయాలి. అదే సమయంలో వ్యవసాయ అభివృద్ధి కోసం పెట్టిన ప్రభుత్వ పథకాలను వాస్తవ సాగుదారులకు అందించడమే తమ ప్రభుత్వం ఉద్దేశం అని కూడా స్పష్టంగా ప్రచారం చేయాలి. ఈ ప్రచార కార్యక్రమంలో రైతు స్వరాజ్య వేదిక తగిన తోడ్పాటును అందించడానికి సిద్ధంగా ఉన్నది.
గుర్తింపు కార్డు పొందిన కౌలు రైతులను, భూమి లేని వ్యవసాయ కూలీలను కూడా రైతు బీమా పథకంలో నమోదు చేసి, 2025 ఆగస్టు 15 నుండి వారిని కూడా రైతు బీమా పరిధిలోకి తేవాలి. ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల నియంత్రణ కోసం మనీ లెండింగ్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడం మంచి సూచన. అయితే, కౌలు రైతులకు వ్యవస్థాగత రుణాలను కల్పించినప్పుడే వడ్డీ వ్యాపారస్తులపై ఆధారపడడం తగ్గుతుంది. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, బ్యాంకు రుణాలు, పంట బీమా వంటివి అందనంత వరకు వారు తప్పని సరి పరిస్థితులలో అధిక వడ్డీ రేట్లు ఉన్నప్పటికీ వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించవలసి వస్తుంది.
పై అంశాలను సీరియస్ గా పరిశీలించాలని , ఎప్పటికప్పుడు, రాష్ట్రంలో పనిచేస్తున్న రైతు సంఘాల, రైతు సహకార సంఘాల ప్రతినిధులతో చర్చించడం ద్వారా, రాష్ట్రంలో వ్యవసాయ రంగ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కమిషన్ కు మా బృందం సూచించింది.