అమ్మ వాడే భాషే అమర భాష

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా రాసినది;

Update: 2025-02-24 05:07 GMT

-డాక్టర్ కొవ్వలి గోపాలకృష్ణ 

బంగ్లాదేశ్ ఏర్పాడ్డాక, ఆ దేశంలో అధిక శాతం ప్రజలు మాట్లాడే బెంగాలీ భాషని కూడా అధికార భాషగా ప్రకటించాలని చేసిన ఉద్యమం గుర్తుగా 25 సంవత్సరాల క్రితం 21 ఫిబ్రవరిని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించారు. ఇక్కడ గమనించాల్సినది ఏమంటే ఒకే మతానికి చెందిన దేశం నుంచి విడిపోయిన ప్రజలు మతపరమైన హక్కుల కోసం కాకుండా, తాము మాట్లాడే భాష ఉనికిని రక్షించుకోవడం కోసం ఉద్యమం చేశారు.
మనుషులు పాటించే ఆచార వ్యవహారాలు, అవలంబించే మతాలూ ఊహ తెలిసాక అవగాహనకి వస్తాయి. కానీ, భావ వ్యక్తీకరణకి అవసరమైన భాష అమ్మ ఒడిలోనుంచే, ఇంకా చెప్పాలంటే అమ్మ గర్భంలోనుంచే శిశువుకి అబ్బు తుంది. అభిమన్యుడు పద్మవ్యూహ రహస్యాలు గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే నేర్చుకున్నాడని కదా భారతం చెబుతోంది! ఈ సందర్భంగా గమనించవలసిన ఇంకో విషయం ఏమంటే, మన పొరుగు రాష్ట్రాలయిన కేరళ, తమిళ నాడులలో ప్రజలు అవలంబించే మతాలు ఏమైనా దాదాపుగా రాష్ట్ర ప్రజలందరూ వారి రాష్ట్ర భాష మాట్లాడతారు; అది గర్వకారణంగా భావిస్తారు. ఇప్పటికీ కేరళ, తమిళనాడులలో ఆయా భాషలలో వచ్చే దినపత్రికలూ, వారపత్రికలతో సహా సాహిత్య పత్రికలని కొని చదువుతారు.
దురదృష్టవశాత్తూ, ఈ విషయాలు ఉభయ తెలుగు రాష్ట్రాల విషయంలో నిజమని చెప్పలేను. ప్రాంతీయ భాషలో మాట్లాడడం కన్నా వారి వారి మత భాషలో మాట్లాడే ప్రజలు ఎక్కువ మందే ఉన్నారు తెలుగు రాష్ట్రాలలో. ఇది తప్పా, ఒప్పా అనేది ఇక్కడ చర్చ కాదు. ఒక దృగ్విషయాన్ని ఆవిష్కరించడమే ఉద్దేశం. భాష వ్యక్తి ఉనికికే కాదు, సమాజ ఉనికికి కూడా ఆయువుపట్టు. సమాజ, జాతి ఏకతకి భారతీయ భాషల ఆలంబన అవసరం. మిగతా దేశాలలో లేని క్లిష్టత భారత దేశంలో ఉన్నది – అది బహుభాషా సౌరభం.
మాతృభాషలో మాట్లాడడం వల్ల బుద్ధి బాగా వికశిస్తుందని, పిల్లలు మాతృభాషలో ప్రాధమిక విద్య అభ్యసిస్తే భవిష్యత్తులో బాగా రాణించగలరని, మాతృభాషలో ప్రావీణ్యం ఉన్నావారు వేరే భాషలు సునాయాసంగా నేర్చుకోగలరని, ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలలో తెలినట్టు చదువుతున్నాం, వింటున్నాం. ఇవన్నీ ముంజేతి కంకణానికి అద్దం ఎందుకన్న సామెతని గుర్తు చేస్తాయి. 
భారత రాజ్యాంగం మాతృభాషలో ప్రాధమిక విద్యా బోధన జరగాలని నిర్దేశించినా కొన్ని రాష్ట్రాలు ఆంగ్ల మాధ్యమంలో ప్రాధమిక విద్యాబోధనకే మొగ్గు చూపుతున్నాయి. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే, పరిస్థితి అగమ్యగోచరమని చెప్పాలి. తెలుగు మాధ్యమంలో బోధించే పాఠశాలలు మరుగవుతుండడం ఒక విపత్కర పరిణామాన్ని సూచిస్తోందని చాలామంది విద్యావేత్తలు, భాషాభిమానులు ఆందోళన చెందుతున్నా, ఆంగ్ల విద్య, ఆంగ్ల మాధ్యమంలో బోధించే చదువులు ఉన్నత సామాజిక వర్గ పురోగతికి కారణమని చెప్పే ఒక తప్పుడు ప్రచారం జరగడం దురదృష్టకరం; ఇది రాజకీయ కోణంలో ఆలోచించి సమాజాన్ని చీల్చే ప్రయత్నంలో భాగమని కొందరు భావించడం తప్పుకాదేమో అనిపిస్తుంది.
తెలుగు మాధ్యమంలో డిగ్రీ వరకూ చదువుకుని, తెలుగు సాహిత్యంలో ఉన్న ఎన్నో అపురూపమైన పాఠ్యాంశాలని చదువుకునీ, ఉన్నత విద్యనభ్యసించి, వేర్వేరు రంగాలలో నిష్ణాతులుగా రూపొంది ప్రపంచంలో వెలుగొందుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఇంకా చెప్పాలంటే, ఎంతోమంది ప్రవాసులు, వారి వృత్తి ఏదైనాకానీ, తెలుగు సాహిత్య అధ్యయనంతో పాటు రచనా వ్యాసంగాన్ని కూడా అభిరుచిగా ఎంచుకుని కొనసాగిస్తున్నారు. 

           డాక్టర్ కొవ్వలి గోపాలకృష్ణ

అన్నీ మనకి అందుబాటులో ఉంటే వాటి విలువ మనకి తెలియదు కదా ! కూటి కోసం, ఉన్నత విద్య, ఆశయాలు నెరవేర్చుకోవడం కోసం ఎంతో మంది గత మూడు, నాలుగు దశాబ్దాలుగా భారత దేశం దాటి వేరువేరు దేశాలకు వలస వెళ్ళడం ఒక చారిత్రక పరిణామం. ఏదో కోల్పోతున్నామెమో అనే బాధ, ఆతృతతోనూ, సహజమైన భాషా సంస్కృతుల పట్ల ఉన్న ప్రేమ, మక్కువ కారణంగా కొంతమంది నాయకత్వంలో తెలుగు సంఘాలు ఏర్పడి, తెలుగు వారు వారి ఆహార వ్యవహారాలని మరవకుండా, పండగలకీ, పబ్బాలకీ కలుస్తూ బాషా సంస్కృతులను పరిరక్షించుకునే ప్రయత్నం చేయడం అభినందనీయం. ఇళ్లలోనో, గుళ్ళలోనో నడిపే తెలుగు బడులకి వారాంతంలో వానలో, ఎండలో, మంచులో, మైళ్ల కొద్దీ ప్రయాణించి పిల్లలని తెసుకువెళ్ళి తెలుగు నేర్పించే ప్రయత్నం చేసిన తెలుగు ప్రవాసులు ఎందరో ఉన్నారు.

అప్రస్తుతం అనిపిస్తున్నా, సందర్భం కోసం ఒక విషయం చెప్పాలి. మా అమ్మాయి చిన్నప్పుడు ‘బాలభారతి’ అనే పేరుతో సంస్థాగతమైన తెలుగు బడిని స్థాపించి సుమారు ఆరు సంవత్సరాలు అరుణ గురజాడ, నేను నిర్వహించాము. ఈ సంస్థ ద్వారా శ్రీమతి సావిత్రి గారి హరి కథ, కార్టూనిస్ట్ మల్లిక్ గారి కార్టూన్ workshop (పిల్లల కోసం), గరికిపాటి నరసింహారావు గారి పిల్లలనుద్దేశించిన ఉత్తేజపూరిత ప్రసంగం (అప్పటికి ఆయనకి అంత పేరు లేదు!, నా సూచన మేరకు ఇచ్చిన ఆ ప్రసంగం ఆయన సామాజిక వ్యాఖ్యతో కూడిన ప్రవచనాలకి తొలి అడుగు! ), ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసి పిల్లలకి భాష పట్ల అబిరుచిని కలిగించే ప్రయత్నం చేశాము.
కొందరు తలిదండ్రులు పని ఒత్తిడి, అనాసక్తిలాంటి కారణాల వల్ల ఇంట్లో పిల్లలకి తెలుగు భాష పట్ల ఆసక్తి కలిగించలేకపోవడం బాధాకరం అయినా, చాలామంది తెలుగు వారు ఇంట్లో తెలుగు మాట్లాడడంవల్ల వారి పిల్లలకి తెలుగు నేర్చుకునే అవకాశం కలిగించారు, కలిగిస్తున్నారు. ఈ సందర్భంగా ‘మాతృ భాష’ అనే కంటే, ‘ఇంటి భాష’ అనడం సబబు. కానీ, భాషాంతర వివాహాలు ఎక్కువ అవుతున్న ఈ రోజుల్లో ఆంగ్ల భాష అమ్మ భాషగా అలరారుతుండడం గమనించదగ్గ విషయం. భారత దేశంలో కూడా ఈ పరిస్థితి అరుదు కాదు. కాబట్టి, అమ్మ భాష ఏదైనా, బిడ్డ నేర్చే భాష అమ్మ సంస్కారం మీదే ఆధార పడి ఉంటుంది. అందుకే, అమ్మకి మాతృభాష పట్ల మక్కువ చెక్కుచెదరకుండా ఉండాలి.
తెలుగు రాష్ట్రాల విషయానికి, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం విషయానికి వస్తే, తెలుగు భాష మనుగడ గురించి ఆందోళన కలగక మానదు. తెలుగు మాధ్యమంలో ప్రాధమిక విద్య స్థాయిలో బోధనకి ప్రభుత్వమే అననుకూలత సృష్టించడం, తలిదండ్రులు, కొంతమంది మేధావులు, అన్నప్రాశన నుండీ ఆంగ్ల మాధ్యమంలో బోధనకి మొగ్గు చూపడం అంత శుభపరిణామం కాదు. నేను గమనించిన విషయం, ఇంతకుముందు సూచనప్రాయంగా చెప్పిన విషయం, ఏమంటే ఏ భాషా మాధ్యమంలో చదివినా, మాతృభాషపై గౌరవం, మక్కువ, మాతృ భాషలో ప్రావీణ్యం, మాతృ భాషలో ఉన్న సాహిత్యాన్ని, సారస్వతాన్నీ అధ్యయనం చేసే అవకాశం, అభిరుచి కలిగి ఉండడం చాలా అవసరం. ఈ అవసరాన్ని తలిదండ్రులు, ప్రభుత్వాలు గుర్తించకపోవడం, ఇంకా చెప్పాలంటే, నిర్లక్ష్యం చేయడం, చారిత్రక తప్పిదమవుతుంది.
ఈ నాటి సమాజంలో మాట్లాడే అవసరం, రాసే అవసరం అంతగా లేదు. సాంకేతికత, సాంకేతిక పరికరాల అందుబాటు కారణంగా ఏమి చెప్పాలన్నా, ఏమి రాయాలన్నా మౌఖికంగా కన్నా, పరోక్షంగా whatsapp లాంటి మాధ్యమాలలో ఏమోజీలనే బొమ్మల రూపంలో తెలియచేయడం సాధారణం అయిపోయింది. ఇంకొంత కాలానికి భాషకి బదులు బొమ్మల ద్వారా జరిపే సంభాషణే ప్రాధమికంగా కొనసాగే అవకాశం ఉంది, ఆదిమ మానవుడిలా.
ఈ పరిస్తితి చక్కపడాలంటే చేయవలసిన పనులు, కార్యక్రమాలు సూచిస్తూ పండంటి భాషకి పదహారు సూత్రాలనో, పన్నెండు సూత్రాలనో కొందరు విద్యావేత్తలు రాసిన వ్యాసాలు చూస్తుంటాం. కానీ, చిత్త శుద్ధితో కూడిన కార్యాచరణ లేకపోతే చిత్త శుద్ధ్ది లేని శివ పూజలా, గట్టిమేల్ తలపెట్టని వట్టి మాటల నీటి మూటలులా ఆలోచనలు అక్షరాలకే పరిమితం అవుతాయి.
తెలుగువారికి మాతృభాషకి సంబంధించిన సంకటంతోపాటు, వ్యవహారిక భాషా సంకటం కూడా తోడయింది. నన్నయ నుంచి నేటి వరకూ, గ్రాంథిక భాషలో రచనలు చేయాలా, లేక వ్యావహారిక భాషలో చేయాలా అన్న చర్చ కొనసాగుతూనే ఉంది. చదివేవారు, రాసేవారూ ఉన్నత సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్న కాలంలో వ్యవహారిక భాష నీచభాష అనే భావన నుంచి, సామాన్యులకి సహితం అర్ధం అయ్యే భాషలా రూపాంతరం చెంది, ఎన్నో కవితా ప్రక్రియలకీ, కథా రూపాలకీ, నవలల ఆవిర్భావానికీ ఆలంబననిచ్చిన గురజాడ, గిడుగుల విశేష కృషి మరువరానిది. పండిత భిషక్కుల భాషా వైద్యం వికటించకముందే తెలుగు భాషను సామాన్య ప్రజల భావ ప్రకటనా పరికరంగా మార్చిన “వాడుక భాషా ప్రయోక్త ద్వయా”నికి తెలుగు జాతి ఋణపడి ఉంటుంది.


(డాక్టర్ కొవ్వలి గోపాలకృష్ణ, ఎడిటర్ , ప్రకాశిక, అమెరికా)

Tags:    

Similar News