పచ్చని తెలంగాణ ఎక్కడ?

జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం. తెలంగాణలో జరుగుతున్న పర్యావరణం విధ్వంసం మీద డాక్టర్ బి కేశవులు ఏమంటున్నారంటే....;

Update: 2025-06-05 06:22 GMT

ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూన్ 5 ను పర్యావరణ దినోత్సవం (World Environment Day)గా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 1972లో స్టాక్‌హోం (స్వీడన్)లో జరిగిన ప్రపంచ పర్యావరణ సదస్సు సందర్భంగా యునైటెడ్ నేషన్స్ (యు.ఎన్) ఈ రోజును అధికారికంగా ప్రకటించింది. అప్పటినుంచి ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక థీమ్‌తో ప్రపంచ దేశాలు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి.ఈ ఏడాది 2025 పర్యావరణ దినోత్సవం యొక్క థీమ్ — "Beat Plastic Pollution". అంటే ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ఏర్పడుతున్న పరిణామాలను అరికట్టే దిశగా చర్యలు తీసుకోవడమే ముఖ్య ఉద్దేశ్యం.

తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడినప్పటి నుంచి అభివృద్ధి నినాదంతో ముందుకు సాగుతోంది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులతో నీటి, వ్యవసాయ రంగాల్లో పురోగతి సాధించామని చెప్పుకుంటున్నప్పటికీ — అదే అభివృద్ధి పేరుతో జరుగుతున్న పర్యావరణ నాశనం రాష్ట్రాన్ని ఆర్థికంగా, ఆరోగ్యంగా, జీవన నాణ్యత పరంగా తీవ్రంగా దెబ్బతీస్తోంది. 2025 నాటికి తెలంగాణలో పర్యావరణ నష్టం ఎంత, దాని ఆర్థిక విలువ ఎంత, దాని ప్రభావం ఏమిటి? అనే అంశాలను విశ్లేషిద్దాం.

అరణ్యాలు తగ్గిపోవడం :

తెలంగాణ ఏర్పడిన నాటికి రాష్ట్రంలో 24% అటవీ ప్రాంతం ఉండేది. కానీ గత పది సంవత్సరాల్లో అధికారికంగా 21% కి తగ్గింది.12 లక్షల చెట్లు ప్రతి ఏడాది నరికివేతలు, కారణాలు అనేకం,అభివృద్ధి పేరుతో రోడ్లు, ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ జోన్‌లు, అక్రమంగా గుట్ట చెట్లు నరికి భూములు ఆక్రమణ, నగర విస్తరణ, రియల్ ఎస్టేట్ మాఫియా.. ఫలితంగా వన్యప్రాణుల వలసలు, మరణాలు,పౌరుషవంతమైన వర్షాలు తగ్గిపోవడం.భూఉష్ణోగ్రత పెరగడం,ప్రతి సంవత్సరం నష్టం = ₹1,200 కోట్లు , హిమయత్ సాగర్, శ్రీశైలం లాంటి రిజర్వాయర్లలో నీటి నిల్వల తగ్గుదలలు చూస్తున్నాం

నీటి వనరుల కాలుష్యం :

నీటి వనరుల నష్టం, 1500 చెరువుల ఆక్రమణలు, హుస్సేన్ సాగర్, దుర్గం చెరువు కాలుష్యం, ప్లాస్టిక్ వ్యర్థాలు, డ్రైనేజీ వల్ల నీటి శుద్ధికి ₹500 కోట్లు ఖర్చు, హుస్సేన్ సాగర్, దుర్గం చెరువు, మణైర డ్యామ్, వేములవాడ, నాగార్జునసాగర్ వంటి జల వనరులు కెమికల్ వ్యర్థాలు, డ్రైనేజీ, ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కలుషితమవుతున్నాయి. ఫలితంగా తాగునీటి కొరత, చేపల మరణాలు, నీటి సంబంధిత వ్యాధులు (డెంగ్యూ, టైఫాయిడ్, కాలరా), భూగర్భజలాల నాణ్యత దెబ్బతినడం లాంటివి ఉదాహరణలు.నీటి వనరుల నష్టం.

వాయు కాలుష్యం :

హైదరాబాద్‌, వరంగల్, సిద్దిపేట, రామగుండం లాంటి పట్టణాల్లో వాహనాలు, పరిశ్రమలు, నిర్మాణ పనుల వల్ల వాయు కాలుష్యం మోతాదు అధికమవుతోంది.ఫలితంగా శ్వాస సంబంధిత వ్యాధులు (ఆస్తమా, అలర్జీ), వేసవిలో ఉష్ణోగ్రత 45°C దాటడం,మానవుల జీవన నాణ్యత దిగజారడం ...వాయు కాలుష్య ఆరోగ్య ఖర్చు ₹1000 కోట్లు.

భూగర్భ జలాల తగ్గుదల :

ప్రతి ఏటా 2-3 మీటర్లు భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. కారణం, బోర్ల అనియంత్రిత తవ్వకం. వర్షజల నిల్వ చర్యల మూడో స్థాయిలో అమలు, చెరువులు, నాళాలు కబ్జాలకు గురి కావడం తెలిసిందే కాదా !

ఫలితంగా సాగునీటి సమస్య,తాగునీటి కొరత, ఎండాకాలంలో గ్రామాల్లో ‘ట్యాంకర్’ నీటి డిపెండెన్సీ విపరీతంగా పెరిగిపోతోంది.

ప్లాస్టిక్ కాలుష్యం :

తెలంగాణలో రెగ్యులేషన్ ఉన్నప్పటికీ, పట్టణాల్లో రోజుకి 1500 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు, ఫలితంగా,నేల నాణ్యత తగ్గిపోవడం,పంటల దిగుబడి తగ్గడం,పశువులు ప్లాస్టిక్ తినడం వల్ల మరణాల రేట్ లో పెరుగుదల,పంటలకు, పశువులకు హానికర ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల చెరువులు, వాగులు మూసుకుపోవడం.ప్లాస్టిక్ వ్యర్థాల నష్టంశుద్ధి ఖర్చు : ₹219 కోట్లు

వాతావరణ మార్పులు :

తెలంగాణలో గత 15 ఏళ్లలో పగటి ఉష్ణోగ్రత 2°C పెరిగింది, దీని ప్రభావం వల్ల గ్రీష్మంలో తీవ్రమైన పొడి గాలులు, భూగర్భజలాల తగ్గుదల : 3 మీటర్లు, మానవ మరణాలు (హీట్ స్ట్రోక్)లు, హైదరాబాద్ PM2.5 స్థాయి WHO పరిమితికి 2 రెట్లు అధికం, వర్షాకాలం మార్పు, పంటల దెబ్బతినడం.హీట్ స్ట్రోక్స్ వల్ల జీవన నష్టం, పనిదినాలు కోల్పోవడం,పంట దిగుబడులు 15% తగ్గిపోవడం → ₹18,000 కోట్లు నష్టం.

పర్యావరణ నష్టం విలువ - 2025 అంచనా :

ప్రపంచ బ్యాంక్, CPCB (Central Pollution Control Board), Telangana State Pollution Control Board (TSPCB), Forest Department, మరియు UN Environment Programme డేటాల ఆధారంగా పర్యావరణ నష్టాన్ని రెండు విధాలగా అంచనా వేయవచ్చు:

ప్రత్యక్ష ఆర్థిక నష్టం (Direct Economic Loss) :

వృక్ష నష్టం వల్ల నష్టము,ప్రతి ఏటా 12 లక్షల చెట్లు కోతకు గురవుతున్నాయి. ఒక్క చెట్టు జీవితకాలం (50 సంవత్సరాలు) విలువ ₹1,00,000 అంటే→ ₹1,200 కోట్లు (ప్రతి సంవత్సరం).

ప్లాస్టిక్ వ్యర్థాల శుద్ధి ఖర్చు,రాష్ట్ర వ్యాప్తంగా రోజుకి 1500 టన్నులు ప్లాస్టిక్ వ్యర్థాలు. శుద్ధికి ప్రతి టన్ను ₹4000 ఖర్చు.→ 1500 × 365 × ₹4000 = ₹219 కోట్లు (ప్రతి సంవత్సరం).

వాయు కాలుష్యం వల్ల ఆరోగ్య నష్టం, శ్వాసవ్యాధులు, హీట్ స్ట్రోక్ వల్ల ప్రభుత్వానికి, ప్రజలకు ఆరోగ్య ఖర్చులు→ ₹1000 కోట్లు (ప్రతి సంవత్సరం).

నీటి కాలుష్యం వల్ల నీటి శుద్ధి ఖర్చు , తాగునీటి శుద్ధి, చెరువుల పునరుద్ధరణ→ ₹500 కోట్లు, భూగర్భ జలాలు పడిపోవడం వల్ల సాగునీటి సమస్య, బోర్లు ఎత్తివేత ఖర్చు దాదాపుగా → ₹700 కోట్లు. ఈ రకంగా మొత్తం ప్రత్యక్షంగా ప్రతి ఏడాది కనీసం ₹3600 కోట్ల ఆర్థిక నష్టం.

ప్రత్యక్షంగా కనిపించని (Indirect Losses) నష్టం:

పంట దిగుబడుల తగ్గుదల, వాతావరణ మార్పుల వల్ల పంట దిగుబడి 15% తగ్గుముఖం. రాష్ట్రం వ్యవసాయ GDP ₹1.2 లక్షల కోట్లు — అంటే→ ₹18,000 కోట్లు నష్టం. మానవ జీవన నాణ్యత తగ్గుదల, వలసలు, వర్షాభావం, నీటి కొరత, కాలుష్యం వల్ల గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు→ ఆర్ధికంగా ₹2000 కోట్లు వ్యయ భారం. పర్యాటక ఆదాయం తగ్గుదల, అరణ్యాలు, చెరువులు కాలుష్యంతో పర్యాటక ఆకర్షణ తగ్గిపోవడం→ ₹800 కోట్లు, ప్రత్యక్షంగా కనిపించని నష్టం = ₹20,800 కోట్లు (ప్రతి సంవత్సరం). మొత్తం బారీ నష్టం (2025 అంచనా) : మొత్తం ప్రత్యక్షంగా ప్రతి ఏడాది కనీసం ₹3600 కోట్లు మరియు ప్రత్యక్షంగా కనిపించని నష్టం = ₹20,800 కోట్లు (ప్రతి సంవత్సరం) = మొత్తం ₹24,400 కోట్లు..

భవిష్యత్తు.... ఆర్థిక విపత్తు :

2024-25 గణాంకాల అంచనాల ఆధారంగా , ఇంకా పర్యావరణ పరిరక్షణ చర్యలు లేకపోతే ఇది 2030 నాటికి ₹35,000 కోట్లు దాటి పోవచ్చన్న చేదు నిజం తెలియ చేస్తున్నదేమిటంటే తెలంగాణకు ఒక స్పష్టమైన హెచ్చరిక.తెలంగాణ పర్యావరణ నష్టం —ధనంగా, జీవంగా, భద్రతగా రాష్ట్రాన్ని హానిచేస్తోంది. అభివృద్ధి ముసుగులో పర్యావరణాన్ని త్యాగం చేస్తే ప్రతి ఏటా ₹24,400 కోట్ల నష్టం వస్తోంది. ఇది కేవలం డబ్బే కాదు — జీవితం, ఆరోగ్యం, భవిష్యత్ భద్రత దెబ్బతింటోంది. పర్యావరణ పరిరక్షణ అనేది ఓ ప్రభుత్వం ఓ కార్యక్రమం కాదు — ఇది ప్రతివ్యక్తి, ప్రతి కుటుంబం, ప్రతి తరానికి చేయవలసిన ప్రాణపణమైన బాధ్యత. మన పర్యావరణాన్ని మనమే రక్షించుకోకపోతే భవిష్యత్తు తరాలకు మిగిలేది భూతాపం, నీటి కొరత, కాలుష్యం, రోగాలు మాత్రమే.మన భవిష్యత్ మన చేతుల్లోనే ఉంది.ఇప్పుడైనా చైతన్యంతో, వ్యూహాత్మక చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇది ఒక ఆర్థిక విపత్తుకి దారితీస్తుంది.

Tags:    

Similar News