ఈ ఏడాది కేంద్రం ప్రకటించిన MSP రైతులకు లాభమేనా?
రాష్ట్రంలో ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్నా జాతీయ సగటు ఖర్చులతో MSP నిర్ణయించడం సబబా?;
2025 ఖరీఫ్ సీజన్ కు కేంద్ర ప్రభుత్వం కనీస మద్ధతు ధరలను (MSP) ఇటీవల ప్రకటించింది. 2021-2022,2022-2023, 2023-2024 – మూడు సంవత్సరాల సగటు ఖర్చుల ఆధారంగా ఈ ధరలను ప్రకటించింది. డాక్టర్ ఎం. ఎస్ . స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం సమగ్ర ఉత్పత్తి ఖర్చు ( C2) కు 50 శాతం కలిపి (C2 + 50 శాతం) కనీస మద్ధతు ధరలను ప్రకటించాలని దేశ వ్యాపితంగా సుదీర్ఘ కాలంగా రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం కనీస మద్ధతు ధరలను ప్రకటించి అమలు చేస్తామని హామీ ఇచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం అందుకు భిన్నంగా కేవలం పాక్షిక ఉత్పత్తి ఖర్చులకు (A 2 +FL ) 50 శాతం కలిపి కనీస మద్ధతు ధరలను ప్రకటిస్తున్నది. ఈ కనీస మద్ధతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నా పట్టించుకోకుండా, మరో సంవత్సరం గడిపేసింది.
కేంద్ర ప్రభుత్వం వివిధ పంటలకు ప్రకటించిన కనీస మద్ధతు ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
వరి సాధారణ ధాన్యానికి క్వింటాలుకు 2369 రూపాయలు( గత సంవత్సరం కంటే కేవలం 3 శాతం- క్వింటాలుకు 69 రూపాయలు ఎక్కువ), వరి A గ్రేడ్ ధాన్యానికి క్వింటాలుకు 2389 రూపాయలు ( గత సంవత్సరం కంటే మూడు శాతం ఎక్కువ), జొన్న హైబ్రిడ్ కు క్వింటాలుకు 3699 రూపాయలు(గత సంవత్సరం(3371) కంటే 9.7 శాతం ఎక్కువ) , జొన్న మల్దండి కి క్వింటాలుకు 3749 రూపాయలు( గత సంవత్సరం(3421) కంటే 9.6 శాతం ఎక్కువ),సజ్జ క్వింటా లుకు 2775 రూపాయలు ( గత సంవత్సరం (2625)కంటే 5.7 శాతం ఎక్కువ),రాగి క్వింటాలుకు 4886 (గత సంవత్సరం(4290)కంటే 13.9 శాతం ఎక్కువ),మొక్క జొన్న క్వింటాలుకు 2400 రూపాయలు( గత సంవత్సరం (2225)కంటే 7.9 శాతం ఎక్కువ ),కండి క్వింటాలుకు 8000( గత సంవత్సరం(7550) కంటే 6 శాతం ఎక్కువ),పెసర క్వింటాలుకు 8768 రూపాయలు( గత సంవత్సరం (8682) కంటే 1 శాతం ఎక్కువ ) గా కనీస మద్ధతు ధరలను కేంద్రం ప్రకటించింది.
మినుము క్వింటాలుకు 7800 రూపాయలు( గత సంవత్సరం (7400) కంటే 5.4 శాతం ఎక్కువ), వేరుశనగ క్వింటాలుకు 7263 రూపాయలు (గత సంవత్సరం (6783) కంటే 7.1 శాతం ఎక్కువ) ,పొద్దు తిరుగుడు క్వింటాలుకు 7721 రూపాయలు(గత సంవత్సరం (7280) కంటే 6.1 శాతం ఎక్కువ),సోయాబీన్ క్వింటాలుకు 5328 రూపాయలు ( గత సంవత్సరం(4892) కంటే 8.9 శాతం ఎక్కువ),నువ్వులు క్వింటాలుకు 9846(గత సంవత్సరం(9267)కంటే 6.2 శాతం ఎక్కువ), పత్తి క్వింటాలుకు 8110 రూపాయలు ( గత సంవత్సరం (7521) కంటే 7.8 శాతం ఎక్కువ గా కనీస మద్ధతు ధరలను ప్రకటించింది.
ఒక పంట సాగులో సమగ్ర ఉత్పత్తి ఖర్చు రావాలంటే స్వంత భూమికి కౌలు విలువ కూడా కలప వలసి ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం కనీస మద్ధతు ధరల నిర్ణయం సమయంలో రైతు సాగు భూమికి ఎలాంటి విలువా కట్టడం లేదు. ఫలితంగా రైతుకు కనీస మద్ధతు ధరలు ఎక్కువగా పెరగడం లేదు.
ఉదాహరణకు పంట ఉత్పత్తి ఖర్చుల లెక్కింపు సమయంలో రైతు స్వంత భూమికి కౌలు విలువ అంచనా వేస్తున్నారు. కేంద్ర ధరల నిర్ణాయక కమిషన్, రైతు స్వంత భూమికి వరికి 12,372 రూపాయలు, మొక్కజొన్నకు11,038 రూపాయలు, కందికి 6435 రూపాయలు, వేరుశనగ కు 10,503 రూపాయలు , సోయాబీన్ 5436 రూపాయలు , పత్తికి 10,153 రూపాయలుగా ఒక సీజన్ కు తెలంగాణ రాష్ట్ర సగటు కౌలు విలువగా అంచనా వేసింది. “మా భూమి విలువ కోటి రూపాయలు, 50 లక్షలు” అని రైతులు చెప్పుకుంటారు కానీ, ఆ భూమిలో పండించే పంటలకు ధరలు నిర్ణయించే సమయంలో ధరల నిర్ణాయక కమిషన్ ఆ భూమికి ఎకరానికి వేస్తున్న కౌలు విలువ అతి తక్కువగా ఉంది. కనీసం భూమిని అమ్మి బ్యాంకులో దాచుకుంటే వచ్చే బ్యాంక్ డిపాజిట్ వడ్డీ విలువ కూడా వేయడం లేదు. పైగా ఈ కౌలు విలువను పంటలకు ధరల నిర్ణయం సమయంలో ఖర్చుల ఖాతాలో అసలు కలపడం లేదు.
అలాగే స్థిర పెట్టుబడిపై వడ్డీ రూపంలో వరికి ఒక సీజన్ కు 808 రూపాయలు, మొక్క జొన్నకు 1100 రూపాయలు, కందికి 743 రూపాయలు, వేరు శనగకు 520 రూపాయలు, సోయాబీన్ 710 రూపాయలు, పత్తి 548 రూపాయలు గా అంచనా వేశారు. అంటే రైతులు తన సాగు భూమిలో బోరు వేయించినా, ట్రాక్టర్ కొనుగోలు చేసినా, డ్రిప్ పెట్టించినా, పొలంలో షెడ్డు నిర్మించినా, సాగు నీటి కోసం దూరం నుండీ పైప్ లైన్ వేసుకున్నా- వీటి కోసం లక్షల రూపాయలు అప్పు తెచ్చి ఖర్చు పెట్టినా, వాటికి ప్రతి ఎకరానికి ఖర్చు లెక్కింపు సమయంలో ఎక్కువ విలువ ఇవ్వడం లేదని పై గణాంకాలు నిరూపిస్తున్నాయి.
అలాగే వ్యవసాయ సీజన్ లో కూలీల ఖర్చులు బాగా పెరిగినట్లు తెలంగాణ లో అన్ని జిల్లాల రైతులు చెబుతారు. కానీ ధరల నిర్ణాయక కమిషన్ , పంట ఉత్పత్తి ఖర్చుల లెక్కింపులో భాగంగా కూలీల ఖర్చు క్రింద ఎకరం వరి సాగుకు 6979 రూపాయలు, మొక్క జొన్న కు 5377 రూపాయలు, కందికి 3536 రూపాయలు, వేరు శనగ కు 10,645 రూపాయలు, సోయా బీన్ కు 3296 రూపాయలు, పత్తికి 13,137 రూపాయలు అంచనా వేశారు. నిజంగా రైతులు ఈ సీజన్ లో కూలీ ఖర్చు ప్రతి ఎకరానికి ఇంతే పెడతారా , ఇంకా ఎక్కువ అవుతుందా అంది సీజన్ ముగింపులో కానీ తేలదు.
చాలా మంది సన్న ,చిన్న కారు రైతు కుటుంబాల సభ్యులు స్వయంగా వ్యవసాయ సీజన్ లో పొలంలో పనులు చేస్తుంటారు. సీజన్ లో ప్రతి రోజూ వెళ్ళి , రోజంతా అక్కడే ఉండి శరం చేసుకునే కుటుంబాలు కూడా ఉన్నాయి. అన్ని పనులూ స్వయంగా చేసుకోలేక , కూలీలను పెట్టుకున్నా, తాము కూడా స్వయంగా కష్ట పడుతుంటారు. కానీ పంటల ధరల నిర్ణాయక కమిషన్ కుటుంబ సభ్యుల శ్రమకు ఎలాంటి విలువ కడుతుందో చూస్తే ఆశ్చర్యం వస్తుంది.
కమిషన్ అంచనా ప్రకారం ఒక 6 నెలల సీజన్ కు, ఒక ఎకరానికి కుటుంబ సభ్యుల శ్రమ విలువ, వరి లో 6,244 రూపాయలు( నెలకు 1000 రూపాయలు),మొక్క జొన్నలో 6,141 రూపాయలు, కంది లో 2577 రూపాయలు, వేరుశనగ లో 5709 రూపాయలు, సోయాబీన్ లో 2,627 రూపాయలు, పత్తిలో 5838 రూపాయలు గా అంచనా వేశారు.
వ్యవసాయంలో ఉన్న కొందరు రైతులైనా ఇప్పటికీ పశువులను (ఎడ్లను, దున్నపోతులను) పోషిస్తుంటారు. కానీ పంటల ధరల నిర్ణాయక కమిషన్ ఈ పశువులకు కట్టే విలువ మరీ దారుణంగా ఉంటుంది. ఒక సీజన్ కు, ఒక ఎకరానికి వరిలో స్వంత పశువుల విలువ 73 రూపాయలుగా, కిరాయి పశువుల విలువ 59 రూపాయలు గా అంచనా వేశారు. మొక్క జొన్నలో స్వంత పశువుల విలువ 486 రూపాయలు, కిరాయి పశువుల విలువ 422 రూపాయలుగా , కంది లో స్వంత పశువుల విలువ 307 రూపాయలుగా, కిరాయి పశువుల విలువ 697 రూపాయలుగా అంచనా వేశారు. పత్తి లో స్వంత పశువుల విలువ 1599 రూపాయలుగా, కిరాయి పశువుల విలువ 809 రూపాయలుగా అంచనా వేశారు. వ్యవసాయంలో రైతులు స్వయంగా దుక్కి పశువులను పోషించక పోవడమే మేలుగా పరిస్థితి దిగజారింది.
వ్యవసాయంలో వినియోగించే యంత్రాలకు ధరల నిర్ణాయక కమిషన్ కట్టే విలువలు కూడా అతి తక్కువగానే ఉంటున్నాయి. ఒక ఎకరానికి, సీజన్ కు వరిలో స్వంత యంత్రాలు వినియోగిస్తే వాటికి విలువ 870 రూపాయలు, కిరాయికి వినియోగిస్తే 8,046 రూపాయలు, మొక్క జొన్నలో స్వంత యంత్రాల విలువ 1602 రూపాయలు, కిరాయి యంత్రాల విలువ 4682 రూపాయలు, వేరుశనగ లో స్వంత యంత్రాల విలువ 1384 రూపాయలు, కిరాయి యంత్రాల విలువ 5639 రూపాయలు , సోయా బీన్ లో స్వంత యంత్రాల విలువ 547 రూపాయలు, కిరాయి యంత్రాల విలువ 3508 రూపాయలు, పత్తిలో స్వంత యంత్రాల విలువ 10,14 రూపాయలు, కిరాయి యంత్రాల విలువ 3362 రూపాయలుగా అంచనా వేశారు.
ఒక వేళ దుక్కి దున్నడానికి, దమ్ము చేయడానికి , కలుపుకు , స్ప్రే చేయడానికి, పంటల క్లీనింగ్ కు, గ్రేడింగ్ కు, పంటలను ఎండ బెట్టడానికి, పంటల రవాణా కు, పొలం దగ్గరకు ఎరువులు, పురుగు మందుల రవాణాకు, పొలం దగ్గరకు కూలీలను తీసుకు వెళ్ళడానికి, రైతు స్వయంగా బైక్ తీసుకుని పొలం వెళ్ళడానికి ఉపయోగించే అన్ని యంత్రాల విలువలుగా మనం వీటిని పరిగణించాలి. నిజంగా రైతుకయ్యే స్వంత యంత్రాల ఖర్చు ( డీజిల్, పెట్రోల్, డ్రైవర్ కూలీ లేదా నెల వేతనం, యంత్రాల రిపేర్లు, మెయింటెనెన్స్, యంత్రాల అరుగుదల - ధరల నిర్ణాయక కమిషన్ వేసే ఈ అంచనా విలువలో కవర్ అవుతాయా అన్నది పెద్ద ప్రశ్న. ఒక వేల కవర్ కాకపోతే, రైతులు ఆ మేరకు నష్టపోతారు అన్నది నిజం .
తెలంగాణ రాష్ట్రంలో రసాయన ఎరువుల వినియోగం భారీగా పెరిగింది. ఎరువుల భారీ వినియోగం తో పొలాలు కూడా పాడయి పోతున్నాయి. ధరల నిర్ణాయక కమిషన్ అంచనా ప్రకారం 2025 ఖరీఫ్ లో సీజన్ కు, ఎకరానికి వరిలో 3619 రూపాయల, మొక్క జొన్న లో 3,051 రూపాయల, కందిలో 1112 రూపాయల , వేరు శనగ లో 2657 రూపాయల, సోయాబీన్ లో 1028 రూపాయల, పత్తిలో 3409 రూపాయల విలువైన రసాయన ఎరువులు వాడనున్నట్లు అంచనా వేశారు. నిజంగా ఈ మోతాదులో రైతులు రసాయన ఎరువులు వాడితే , ఉత్పత్తి ఖర్చులో లెక్క వేశారు కనుక, ఆర్ధికంగా నష్టం లేదు. కానీ ఇంతకు మించి వాడితే ఆర్ధికంగా నష్టమే. ఎక్కువ ఎరువుల వినియోగం వల్ల భూసారనికి వాటిల్లే నష్టం దీనికి అదనం.
వ్యవసాయంలో సేంద్రీయ ఎరువులు వాడాలని ప్రభుత్వాలు ప్రచారం చేస్తుంటాయి. వ్యవసాయ ఉత్పత్తి పద్ధతులలో మార్పులు రావాలని కోరుకునే ఎవరైనా , ఈ మాటే చెబుతారు, కానీ ఉత్పత్తి ఖర్చులను లెక్కించే ధరల నిర్ణాయక కమిషన్ కు ఆ విషయంలో ఏకీభావం లేనట్లు కనిపిస్తుంది. ఉత్పత్తి ఖర్చుల లెక్కింపులో సేంద్రీయ ఎరువులకు అతి తక్కువ విలువలు వేసింది. కనీసం ఎరువు పొలానికి తోలే రవాణా ఖర్చు కూడా వేయలేదు. సీజన్ కు, ఎకరానికి వరిలో సేంద్రీయ ఎరువు ఖర్చు అంచనా 40 రూపాయలుగా , మొక్క జొన్న లో 9 రూపాయలుగా, పత్తిలో 110 రూపాయలుగా, వేరు శనగ లో 8 రూపాయలుగా అంచనా వేసిన కమిషన్ , కంది ,సోయా, లో వేసే సేంద్రీయ ఎరువులకు అసలు విలువే ఇవ్వలేదు.
తెలంగాణ లో పురుగు విషాల వినియోగం కూడా భారీగా పెరిగింది. అన్ని పంటల లోనూ రైతులు విచ్చలవిడిగా పురుగు విషాలు వాడుతున్నారు. కానీ ధరల నిర్ణాయక కమిషన్ తాను పురుగు విషాల వినియోగానికి తీసుకునే ఖర్చు అంచనా తక్కువగానే ఉంటున్నది. సీజన్ కు, ఎకరానికి వరిలో 2,111 రూపాయలు, కంది లో 1488 రూపాయలు, మొక్క జొన్న లో 1631 రూపాయలు, వేరు శనగ లో 1751 రూపాయలు, సోయాబీన్ లో 895 రూపాయలు, పత్తిలో 2348 రూపాయలు ఖర్చు అంచనా వేస్తున్నారు. ఈ మొత్తాలను దాటి, ఒక వేళ రైతులు ఎక్కువ పురుగు విషాలను వినియోగిస్తే, ఆ మేరకు రైతులకు ఆర్ధికంగా నష్టమే. పైగా వీటి వల్ల నే లలు, గాలి, సాగు నీరు, ఆహారం కూడా విష పూరితమై పోతున్నాయి.
నిర్వహణ పెట్టుబడిలో భాగంగా ఖర్చులను లెక్కించేటప్పుడు కూడా వివిధ అంశాలకు చాలా తక్కువ ఖర్చులు అంచనా వేసింది. కౌలు భూమికి కౌలు చెల్లింపు క్రింద ఎకరానికి, సీజన్ కు వరి పంటకు 1288 రూపాయలు, మొక్క జొన్నకు 1542 రూపాయలు, కంది పంటకు 15 రూపాయలు, వేరు శనగ పంటకు 1466 రూపాయలు, సోయాబీన్ పంటకు 288 రూపాయలు , పత్తి పంటకు 1552 రూపాయలు అంచనా వేసింది. నిజానికి వరి, పత్తి పంటల కౌలు బాగా పెరిగింది. కౌలు ధరలు కూడా బాగా పెరిగిపోయాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎకరానికి, సీజన్ కు ఈ రెండు పంటల లో కనీసం 7500-నుండీ 15,000 రూపాయల వరకూ కౌలు ధరలు ఉన్నాయి. కానీ ధరల నిర్ణాయక కమిషన్ కు అది కనిపించక పోవడానికి కారణం, కౌలు రైతుల సాగు ఖర్చులను ప్రత్యేకంగా లెక్కించే ప్రయత్నం చేయక పోవడమే.
తెలంగాణ లో బోర్ల క్రింద పత్తి, వరి సాగు చేస్తున్నారు. ఉచిత విద్యుత్ బోరు బావులకు అందుతున్నా, కనీస విద్యుత్ ఛార్జీలు, మోటార్లు కాలిపోతే రిపేర్ లు, ట్రాన్స్ ఫారం రిపేర్లు , లాంటి వి రైతులపై భారం మోపుతాయి. ఉచిత విద్యుత్ సరఫరా చేసిన విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం చెల్లించే విద్యుత్ సబ్సిడీ మొత్తాలను ధరల నిర్ణాయక కమిషన్ అసలు లెక్కలోకే తీసుకోదు . 2025 ఖరీఫ్ సీజన్ కు కమిషన్ సాగు నీటి చార్జీల క్రింద వరికి ఎకరానికి, సీజన్ కు 826 రూపాయలు , మొక్క జొన్నకు 325 రూపాయలు, పత్తికి 19 రూపాయలు , కందికి 23 రూపాయలు, సోయాబీన్ కు 45 రూపాయలు అంచనా వేసింది. ఉత్పత్తి ఖర్చులలో ఇంత తక్కువ లెక్కిస్తే, ధరల నిర్ణయం కూడా తక్కువే ఉంటుంది. అందువల్లే రైతులకు నికర మిగులు తక్కువగా ఉంటుంది. ప్రభుత్వం పై అధిక భారం పడుతుంది.
ఉత్పత్తి ఖర్చులను లెక్కించే విషయం లో ధరల నిర్ణాయక కమిషన్ చాలా అన్యాయంగా వ్యవహరిస్తున్నది. పైగా మన రాష్ట్రంలో ఉత్పత్తి ఖర్చులు ఎక్కువ అవుతున్నా, ఖర్చుల జాతీయ సగటును బట్టి మాత్రమే ధరలను నిర్ణయిస్తున్నది. దీనివల్ల రాష్ట్ర రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది.