ఇరాన్ నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న భారతీయ విద్యార్థులు
110 మందితో ఢిల్లీలో ల్యాండయిన భారత విమానం..;
ఇజ్రాయేల్- ఇరాన్ (Iran-Israel conflict) దేశాల మధ్య యుద్ధం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇరాన్లో చదువుతున్న భారతీయ విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఇరాన్ నుంచి అర్మేనియా చేరుకున్న 110 మంది భారతీయ విద్యార్థులు భారత ప్రత్యేక విమానంలో గురువారం తెల్లవారుజామున ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారంతా భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మరికొంతమంది విద్యార్థులను తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ తెలిపారు.
"ఇరాన్లో పరిస్థితిలు దారుణంగా ఉన్నాయి. కాల్పులు, విస్పోటనాలతో భయాందోళన నెలకొంది. ప్రాణాలతో బయటపడితే చాలనుకున్నాం. మమ్మల్ని ఇక్కడికి సురక్షితంగా తీసుకువచ్చిన భారత ప్రభుత్వానికి, భారత రాయబార కార్యాలయానికి మా కృతజ్ఞతలు’’ అని భారత్కు విమానంతో తిరిగివచ్చిన కాశ్మీర్కు చెందిన విద్యార్థి వర్త తెలిపారు.
ఢిల్లీలో అడుగుపెట్టిన MBBS విద్యార్థి మీర్ ఖలీఫ్ ఇరాన్లో మాట్లాడుతూ.. "మేం క్షిపణుల దాడికి ప్రత్యక్షంగా చూశాం. మా పొరుగున బాంబు దాడి జరిగింది. పరిస్థితి చూసి చాలా భయపడ్డాము. కన్నవారిని మళ్లీ చూస్తామనుకోలేదు," అని పేర్కొ్న్నారు. "ఇరాన్లో ఇంకా చాలా మంది భారత విద్యార్థులున్నారు. వారిని కూడా సురక్షితంగా తీసుకువస్తారని ఆశిస్తున్నాము" అని చెప్పాడు.
భారత విద్యార్థులను (Indian Student) స్వదేశానికి తీసుకురావడంపై విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు.