135 మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు పూర్తి
101 మృతదేహాలను బంధువులకు అప్పగింత..;
గుజరాత్ రాష్ట్రం (Gujarat) అహ్మదాబాద్(Ahmedabad) విమాన ప్రమాద మృతులకు డీఎన్ఏ పరీక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. టేకాఫ్ అయిన నిముషాల వ్యవధిలోనే విమానం మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలిపోవడంతో 270 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో విమాన ప్రయాణికులు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విమాన శకలాల నుంచి మృతదేహాలను సివిల్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ‘‘ఇప్పటివరకు 135 మంది మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాం. గుజరాత్, మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్, డయ్యూ రాష్ట్రాలకు చెందిన 101 మంది మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించాం,’’అని అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ జోషి తెలిపారు.
అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు టేకాఫ్ అయిన బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం కొద్ది నిముషాల్లోనే బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలిపోయింది. ఈ ఘటన జూన్ 12న మధ్యాహ్నం 1.39 గంటలకు జరిగింది. ఇద్దరు పైలెట్లు, విమాన సిబ్బందితో పాటు మొత్తం 241 మంది చనిపోయారు. ఈ ప్రమాదంలో ఐదుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు సహా చుట్టుపక్కల స్థానికులు 29 మంది కూడా ప్రాణాలుకోల్పోయారు. ఈ దుర్ఘటనలో ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రం బతికి పడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.