ఇప్పటివరకు 159 మృతదేహాల అప్పగింత
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 190 మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు పూర్తి..;
అహ్మదాబాద్(Ahmedabad) విమాన ప్రమాద మృతులకు డీఎన్ఏ పరీక్షలు (DNA Analysis) కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 190 మృతదేహాలకు ఈ పరీక్ష చేసి 159 మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించారు.
జూన్ 12న 242 మంది ప్రయాణికులతో అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI-171 టేకాఫ్ అయిన కొన్ని నిముషాలకే కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో మొత్తం 241 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు. ఒక్కడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. విమానం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలిపోవడంతో ఐదుగురు వైద్య విద్యార్థులతో పాటు స్థానికులు 29 మంది ప్రాణాలు కోల్పోయారు.
"బుధవారం ఉదయం వరకు 190 DNA నమూనాలు సరిపోయాయి. 159 మృతదేహాలను ఇప్పటికే వారి కుటుంబాలకు అప్పగించాం. మిగిలిన మృతదేహాలకు కూడా త్వరలో డీఎన్ఏ పరీక్షలు పూర్తి చేస్తాం," అని అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ జోషి తెలిపారు.