'ఓటు చోరీ'కి వ్యతిరేకంగా కాంగ్రెస్ ర్యాలీ ..
డిసెంబర్ 14న రాంలీలా మైదానానికి హస్తం పార్టీ అగ్రనేతలు..
"ఓటు చోరీ" అంశంపై కాంగ్రెస్ తన ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. న్యూఢిల్లీలోని రాంలీలా మైదానంలో డిసెంబర్ 14న ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Kharge), రాహుల్ గాంధీ(Rahul Gandhi) నాయకత్వం వహించి ప్రసంగించే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, సచిన్ పైలట్ సహా సీనియర్ నాయకులు కూడా ఈ ర్యాలీలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా హాజరవుతారని భావిస్తున్నారు. ముందుగా సీనియర్ నాయకులు పార్టీ ప్రధాన కార్యాలయంలో ఇందిరా భవన్లో సమావేశమై అనంతరం బస్సులో రాంలీలా మైదాన్కు చేరుకుంటారు.
5.50 కోట్ల సంతకాలు..
"ఓట్ చోరీ"(vote chori)కి వ్యతిరేకంగా పార్టీ దాదాపు 5.50 కోట్ల సంతకాలను సేకరించిందని కాంగ్రెస్ సంస్థాగత ప్రధాన కార్యదర్శి, ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ తెలిపారు. "ఓటు చోరీ ఎలా జరుగుతుందో రాహుల్ ఆధారాలతో ప్రదర్శించారు. దానిపై చర్చకు సవాల్ కూడా విసిరారు. కాని హోంమంత్రి దానికి సమాధానం ఇవ్వలేదు" అని వేణుగోపాల్ చెప్పారు.
ఎన్నికల సంస్కరణలపై లోక్సభలో పెద్దఎత్తున చర్చ జరిగిన కొన్ని రోజుల తర్వాత ఈ ర్యాలీ చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఎన్నికలకు నెల ముందు అన్ని పార్టీలకు మెషిన్-రీడబుల్ ఓటరు జాబితాను అందించాలని, 45 రోజుల తర్వాత సీసీటీవీ ఫుటేజ్లను ధ్వంసం చేయడానికి అనుమతించే చట్టాన్ని రద్దు చేయాలని, EVMలను అందుబాటులోకి తీసుకురావాలని రాహుల్ సూచించిన విషయం తెలిసిందే.