బిభవ్‌ కుమార్‌కు 14 రోజుల జుడిషియల్ రిమాండ్

ఆప్ ఎంపీ మలివాల్‌పై దాడి చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్‌కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

Update: 2024-05-31 12:05 GMT

ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్‌కు శుక్రవారం కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

మే 13న ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో కుమార్ మలివాల్‌పై దాడికి పాల్పడ్డాడు. ఆమె ఫిర్యాదు మేరకు కుమార్ ను మే 18న పోలీసులు అరెస్టు చేశారు. మూడు రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో కుమార్‌కు కోర్టులో హాజరుపర్చారు. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ గౌరవ్ గోయల్ 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని అనుమతించారు. ఇదిలా ఉండగా కుమార్ అరెస్టును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొనసాగించడంపై ఢిల్లీ హైకోర్టు తన ఆదేశాలను రిజర్వ్ చేసింది. అంతకుముందు సోమవారం కుమార్ బెయిల్ పిటిషన్‌ను సెషన్స్ కోర్టు కొట్టివేసింది.  

తీర్పు రిజర్వ్‌..

తన అరెస్టు చట్టవిరుద్ధమని బిభవ్‌ కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం తీర్పును రిజర్వ్‌ చేసింది. అతని అరెస్టు ప్రాథమిక హక్కులతో పాటు చట్టాన్ని ఉల్లంఘించడమేనని, అరెస్టుకు ఎటువంటి కారణాలు లేవని కుమార్ తరఫు సీనియర్ న్యాయవాది వాదించారు. ఇరువైపులా హాజరైన సీనియర్ న్యాయవాదుల వాదనలను విన్న తర్వాత జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఆర్డర్ రిజర్వ్ చేశారు.

Tags:    

Similar News